Friday, 9 December 2011

ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ

ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా గురువారం బయటి వ్యక్తులను కళాశాల ఆవరణలోకి తీసుకొచ్చారు. విద్యార్థులందరూ ఏకమై వారిని చితకబాది పంపారు. చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐరాల మండలం కాణిపాకంకు చెందిన సంతోష్ చంద్రగిరి రెడ్డివీధిలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. పాకాలకు చెందిన కేశవులు కూడా ఇక్కడే చదువుతున్నాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అదే కళాశాలలోని ఒక అమ్మాయిపై ప్రేమ పెంచుకున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఇద్దర్నీ పట్టించుకునేది కాదు. మూడు రోజుల క్రితం ‘ఆ అమ్మాయి నీ వల్ల నాతో మాట్లాడడం లేదంటే కాదు నీ వల్లే అంటూ’ సంతోష్, కేశవులు చిన్నపాటి ఘర్షణ పడ్డారు. సంతోష్‌ను ఎలాగైనా కొట్టాలని నిర్ణయించుకున్న కేశవులు స్నేహితులు లీలాకృష్ణ, ఫరీన్‌లను వెంటబెట్టుకుని పాకాల మండలం సామిరెడ్డిపల్లికి వెళ్లి నానిరెడ్డి, రెడ్డిప్రసాద్, హరీష్, మహేష్‌లను కలుసుకున్నారు. విషయం చెప్పి తమకు సహాయం కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు సంతోష్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. లీలాకృష్ణ, ఫరీన్, కేశవులు యథావిధిగా కళాశాలకు వచ్చారు. సామిరెడ్డిపల్లికి చెందిన నలుగురు యువకులు సంతోష్‌పై కర్రలతో దాడికి దిగారు. విషయం గమనించిన కళాశాల విద్యార్థులు సంతోష్‌కు అండగా నిలి చారు. ఆ నలుగురు యువకులను పట్టుకుని చితకబాదారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. కానిస్టేబుళ్లు  వెంటనే అక్కడకు చేరుకుని ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనను కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రమ తీవ్రంగా పరిగణించారు.

No comments:

Post a Comment