Wednesday, 28 December 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ‘ఢీ’

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాదులాటకు దిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డికి, రవీంద్రా రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల ఉద్యోగుల తొలగింపుపై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్కువగా ఉన్న 104 సర్వీసుల ఉద్యోగులను తొలగించాలని రవీంద్రా రెడ్డి పట్టుబట్టగా అలా తొలగిస్తే సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. దీంతో రవీంద్రా రెడ్డి సమావేశం నుంచి మధ్యలో ఆగ్రహంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల్లో హెచ్ఎంఆర్ఐ అవసరానికి మించి ఉద్యోగులను నియమించిందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే విషయంపై పరిశీలిస్తున్నామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో ఏ విధమైన వాగ్వివాదం జరగలేదని ఆయన చెప్పారు. 108 సర్వీసులను నెలలోగా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 104 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలా, కొత్త టెండర్లను ఆహ్వానించాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో జివికె నుంచి 108 సర్వీసులను తప్పిస్తారు.

No comments:

Post a Comment