రాలయసీమ జిల్లాలో మాఫియాకు రాజకీయ అండ!
రాలయసీమ జిల్లాలో అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన వారు మాఫియా మారి రాజకీయ
అండదండలతో చెలరేగి పోతున్నారు. వీరిని కాదని సామాన్యుడికి న్యాయం ఎలా
జరుగుతుందన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. మాఫియాకు రాజకీయ నాయకులు,
రాజకీయ నాయకులకు అధికారులు అండగా ఉన్నంత కాలం ఏ అక్రమ వ్యవహారాన్ని
అడ్డుకోలేరని వారు తేల్చి చెబుతున్నారు. తమ కష్టం తమకు తప్పదని మాఫియా
విషయంలో జోక్యం చేసుకోవడం ప్రమాదమే కాని ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం
చేస్తున్నారు. మద్యం, ఇసుక దందాలపై హడావుడి చేసి దాడులు నిర్వహించి భరతం
పట్టాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాటి అమలులో శ్రద్ధ చూపకపోవడమే
ఇందుకు నిదర్శనమని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు
విక్రయించడం, ఇసుక అక్రమ రవాణాతో పాటు అడవులను కొల్లగొడుతూ ఎర్ర చందనం,
గనులను తవ్వుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ఉక్కు పాదం మోపితే
ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నిధులు సమకూరుతాయి. అయితే ఎక్కడా, ఏ అధికారి
ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖాలు కనిపించడం లేదు. అధికారులు
పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల మేడలపై మేడలు కడుతూ, బీరువాల్లో కరెన్సీ
నోట్ల కట్టలను పేర్చుకుంటున్నారు. ఖనిజ సంపదతో పాటు మద్యం వ్యవహారంలో
రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో మాఫియాలకు
తలొంచుతూ వారి వైపు పోలీసు, రెవిన్యూ, గనులు, విజిలెన్స్ అధికారులు
కనె్నత్తి చూడడం లేదు. పరోక్షంగా సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు తమ మద్దతుగా
ఉన్నందుకు వారికి భారీగా నజరానా ముడుతోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇక
ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న నాయకులు అధికారుల సహకారంతో తమ వ్యాపారాన్ని
అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష నాయకులు
ఆరోపణలు చేసుకునే విషయం బహిరంగంగా జరిగితే లోలోన మాత్రం ఒక అభిప్రాయానికి
వచ్చి తమ పని చక్కబెట్టుకుంటారంటున్నారు. మద్యం, ఇసుక, కలప, మైనింగ్
మాఫియాలపై నాయకులు చేసే హడావుడి కేవలం తమను నమ్మించడానికి చేసే
ప్రయత్నమేనని చెబుతున్నారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులను వెతికితే
ఎక్కడో ఒకరో ఇద్దరో కనిపించినా వారు కూడా మాఫియాను, వారికి అండగా ఉన్న
వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. జిల్లాలో చెలరేగుతున్న
మాఫియాను వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల ఆగడాలను
అడ్డుకోవాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రయోజనం ఉండదని
చెబుతున్నారు. మద్యం, ఇసుకపై దాడులు చేయించిన ప్రభుత్వం మద్యం ఎమ్మార్పీ
ధరలకే విక్రయించాలని, ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయాలని
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వం
చిత్తశుద్ధితో వ్యవహరించనంత కాలం సామాన్యుడికి మేలు జరిగే ప్రసక్తే లేదని
స్పష్టం చేస్తున్నారు. అక్రమార్కులను కట్టడి చేయనంత కాలం సామాన్యుడికి
కష్టాలు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment