Sunday, 6 November 2011

అరటి రైతులు తీవ్ర ఆందోళన

  జిల్లాలో ఒక్కసారిగా అరటి పండు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 10 పలుకగా నేడు కిలో రూ. 3 పలుకుతోంది. దీంతో అరటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాలలో దాదాపు 50 వేల ఎకరాలలో అరటి సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో రోజు వంద లారీలు అరటి కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో కిలో ధర రూ. 10 నుంచి 11 వరకు విక్రయించాల్సి ఉండగా ధరలు పడిపోవడంతో రైతులు కిలో రూ. 3 నుండి 3-50లకే విక్రయించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అరటి సాగుపై పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు అవుతుంది. వివిధ రకాలకు చెందిన అరటి పిలకలను తీసుకొచ్చి రైతులు పంటను సాగు చేశారు. 11 నెలలకే పంట దిగుబడి వస్తుంది.   
                                         

 ఎకరాకు 12 వందల చెట్లు రైతులు వేస్తారు. అందులో దాదాపు 300 చెట్లు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బ తింటాయి. ఇక మిగిలిన 900 చెట్లను ఆధారం చేసుకొని రైతులు ఆదాయం తీసుకోవాలి. బాగా పండిన తోటలో ఒక్కొక్క గెలకు 25 నుంచి 30 కిలోల కాయలు వస్తాయి. కిలో రూ. 9 నుంచి 10 వరకు ధర పలుకుతుంది. అయితే కాయలు బాగా పెద్ద సైజ్‌లో ఉన్న ధర మాత్రం పూర్తిగా పడి పోయింది. దళారులకు రైతులు ఒక్కొక్క గెలకు కమిషన్ కూడా తీస్తుంటారు. అయితే రైతులు అందించిన సమాచారం మేరకు నెల కిందట 160 గెలలు కొడితే కేవలం రూ. 9 వేలు మాత్రమే చేతికి అందాయి. ధర బాగుండింటే చేతికి రూ. 25 వేల నుంచి 30 వేల వరకు అందేది. ధరలు పడిపోవడం వల్ల కేవలం రూ. 9 వేలు వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పంటకు రూ. 70 వేలు పెట్టుబడి పెట్టి 11 నెలల పాటు అరటి తోటలను కంటికి రెప్పలగా కాపాడుకున్న ఫలితం దక్కలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు

No comments:

Post a Comment