ఓఎంసీ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కూడా విచారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐకి విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి సాక్షిగా హాజరై తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటల విచారణ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 64.2 ఎకరాల భూమి లీజు ను బదిలీ చేశారన్నారు.అందుకు సంబంధించిన జీవో ప్రతిని ఆయన చూపించారు.
1996 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాంమ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ భూమిని గనుల లీజుకు ఇచ్చారని అన్నారు. అదే చంద్రబాబు 2002లో రాంమ్మోహన్ రెడ్డి నుంచి ఆ లీజును ఓఎంసీకి బదిలీ చేశారని జగన్ వివరించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని, వారి విచక్షణ మేరకే నిర్ణయాలు జరిగాయని ఓఎంసీకి గనుల లీజును బదిలీ చేసింది చంద్రబాబే అయినప్పుడు, ఏడాదిన్నరగా ఇదే అంశంపై విచారిస్తున్న సీబీఐ చంద్రబాబును కూడా విచారించాలని తాను అభ్యర్థించానని జగన్ అన్నారు. జీవో కాపీని సీబీఐ అధికారులకు అందచేసినట్లు కూడా ఆయన చెప్పారు
No comments:
Post a Comment