Saturday, 18 February 2012

న్యూజిలాండ్ క్రికెట్టుకు కర్నూలు బిడ్డ అండ !

కర్నూలుకు చెందిన పాల్ వాల్తాటీ ఐపియల్‌లో సంచలనమే సృష్టించాడు. ఇప్పుడు కర్నూలు జిల్లాకే చెందిన తరుణ్ సాయి నేతుల న్యూజిలాండ్ క్రికెట్‌లో దూసుకొస్తున్నాడు. వెట్టోరీకి ప్రత్యామ్నాయం ఈ యువ క్రికెటరేననే మాట వినిపిస్తోంది. నేతుల 1983 మే 8వ తేదీన కర్నూలులో జన్మించాడు. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో అతను సంచలనాలు చేస్తు్నాడు. లెగ్ స్పిన్నర్‌గా న్యూజిలాండ్‌కు ఉన్న స్పిన్నర్ల కొరతను తీర్చడానికి సిద్ధపడుతున్నాడు నేతుల. కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అతను. అతనికి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కుటుంబం న్యూజిలాండ్‌కు మారింది. అతను న్యూజిలాండ్‌లో ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. 2008 - 09లో ఫస్ట్ క్లాస్ సీజన్ క్రికెట్‌లో అతను అడుగు పెట్టాడు. అత్యధిక వికెట్లు తీసుకుని ఆక్లాండ్ స్టేట్ చాంఫియన్‌షిప్‌ను అందించాడు. అక్కడ అతనికి సరైన అవకాశాలు రాకపోవడంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు మారాడు. ఇక్కడ అతను అన్ని క్రికెట్ ఫార్మాట్లలో ప్రధానమైన సభ్యుడైపోయాడు. 2012 జింబాబ్వేపై పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం అతను న్యూజిలాండ్ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయడం పట్ల తరుణ్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తాను ఎప్పుడూ పోటీ పడలేదని, టెస్టు మ్యాచులపైనే దృష్టి పెట్టానని, అందుకే ఆశ్చర్యం వేసిందని అతను అన్నాడు. లెగ్ స్పిన్నర్‌గా అనతు ఈ నెల 6వ తేదీన తన కెరీర్‌ను అతను ప్రారంభించాడు. తరుణ్‌కు ముందు భారత సంతతికి చెందిన దీపక్ పాటిల్, జీతన్ పాటిల్ న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. వెట్టోరీ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత స్థితిలో తరుణ్ న్యూజిలాండ్‌కు అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు.

No comments:

Post a Comment