Sunday, 26 February 2012

అనంతపురం పోలీస్ శాఖ ప్రతిష్ట దిగజార్చకండి ...జిల్లా ఎస్పీ

మంచి పనిచేస్తే సహకారం, ప్రశంసలుంటాయని, చెడు పని చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీం పోలీసు అధికారులకు ఘాటైన హెచ్చరిక చేశారు. ఇందులో హోం గార్డులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎవరికైనా 15 రోజులు గడువిస్తానని, ఆ లోపు బాధ్యతరహితంగా మెలిగే వారు, చెడు ప్రవర్తన కలిగిన వారు తమ పద్ధతులను మార్చుకోవాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బంది, అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్న సమస్యకు పెద్ద రాద్ధాంతం చేయవద్దన్నారు. ఎస్‌హెచ్ఓలు హుందాగా పనిచేయాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించవద్దన్నారు. అందుకు అవకాశం కూడా ఇవ్వకూడదన్నారు. సిబ్బందిపై నియంత్రణ, ప్రజలతో సత్సబంధాలు కొనసాగించాలన్నారు.అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ, ఎస్‌ఐలకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా కదిరి ప్రాంతంలో యువతులకు ట్రాఫికర్లు మాయమాటలు చెప్పి నగరాల్లోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని తెలిపారు. వీరిని గుర్తించడంలో సరైన ప్రగతి సాధించలేక పోయామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో నేరాలు పూర్తిస్థాయిలో తక్కువయ్యాయని, అయితే కదిరి-బత్తలపల్లి మధ్య చిత్తూరుకు చెందిన చోరీ ముఠా సంచరిస్తుందని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గుంతకల్లు రూరల్ సర్కిల్ పరిధిలో మిస్టరీగా మారిన గుర్తు తెలియని మహిళల హత్య సంఘటనలకు సంబంధించి ప్రశ్నించగా దశబ్దాలు గడిచిన వాటి సమాచారం బయటకు రావడం ఇబ్బందికరమని నమ్ముతానని దాటవేశారు. ధర్మవరం, గుంతకల్లులో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా ఉరవకొండ సర్కిల్ పరిధిలో పోలీసు స్టేషన్, పోలీసు క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కిందిస్థాయి సిబ్బంది ఎవరైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే అలాంటి వారిపై ఆ ప్రాంత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఐడీ పార్టీ పోలీసులైనా ...ఇతర సిబ్బంది అయినా క్రమశిక్షణతో మెలగాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తానన్నారు. ఎవరో ఒకరు చేసే తప్పిదం ప్రభావం పోలీసు శాఖపైనే పడుతుందనే విషయాన్ని గ్రహించి మసలుకోవాలన్నారు.దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని ఆయన అదనపు ఎస్పీని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యే అవకాశమున్న ప్రాంతాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులపై దృష్టి పెట్టాలని సూచించారు.

No comments:

Post a Comment