Thursday, 15 December 2011

అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికలు పార్టీ లు గట్టి పోటీ

గ్రూపు తగాదాలతో కాంగ్రెస్… అవిశ్వాసానికి మద్దతు తెలిపిన అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిల భవితవ్యం ఏ విధంగా ఉండనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.  వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరుపున గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణమాల నేపథ్యంలో వారు ఆయన తనయుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గుచూపారు.
ఇప్పటికే కాంగ్రెసులో నియోజకవర్గ ఇన్‌ఛార్జీల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరికివారు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇన్‌ఛార్జి పదవిని దక్కించుకోవడం ద్వారా వైఎస్‌ఆర్ పార్టీ తరపున అనంతపురం నియోజకవర్గానికి తిరిగి గురునాథరెడ్డి బరిలో ఉండే అవకాశాలున్నాయి. టీడీపీలోనూ అభ్యర్థులు తీవ్రంగానే పోటీ పడుతున్నారు. ఇక రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే డిసిసి అధ్యక్షులు పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డిని కాదని అప్పట్లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాపు రామచంద్రారెడ్డికి ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు పాటిల్‌ సహకరించాల్సి వచ్చింది. ఇప్పుడు కాపు జగన్‌వైపు వెళ్లడంతో పాటిల్‌కు తిరిగి మార్గం సుగమమైంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులున్నందున ఆయన తనయుడు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక టిడిపి తరుపున దీపక్‌రెడ్డిని ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాయలసీమలో జగన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. యువకుడు కావడం ఒక కారణమైతే, కాంగ్రెస్ పెద్దలు మోసం చేశారన్నసానుభూతి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ఉన్నాయి. గ్రూపులుగా ఏర్పడటంతో నాయకత్వం లోపించింది. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాధ్‌లు ఒక గ్రూపుగా, మాజీ మంత్రి  జేసీ దివాకర్‌రెడ్డి మరోగ్రూపుగా ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. అందుకని ఇక్కడ జగన్‌కు జనం జై కొట్టే అవకాశముంది.అనంతపురంలో జగన్‌కు జనం జై కొట్టే అవకాశముంది. జనంలోకి వెళ్లిన జగన్‌కు బలమైన క్యాడర్‌ కూడా ఉంది. అనంత జిల్లాలో జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఇద్దరు పోటీ చేయనున్నారు. బలంగా ఉన్న తెలుగుదేశం కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. కాంగ్రెస్ మాత్రం గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది.

No comments:

Post a Comment