Thursday, 15 December 2011

తిరుమలలో కలకలం శ్రీవారి ఆలయంపై వెలుగుచుక్క

తిరుమల శ్రీవారి ఆలయం పైభాగాన బాగా ఎత్తులో బుధవారం రాత్రి ఓ వెలుగుచుక్క ప్రయాణించిన సంఘటన కలకలం రేపింది. ఆకాశంలో జరిగిన ఈ అద్భుతంపై రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇది స్వామి దివ్యజ్యోతి అని, తిరుమల క్షేత్రానికి అదృష్టమని కొందరు అంటుంటే, ఇది ‘ఫ్లైయింగ్ సాసర్ ’(ఎగిరే పళ్లెం) అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే భక్తులు మాత్రం ఇది స్వామి జ్యోతి అయి ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది సాయిజ్యోతి అని కొంత మంది ప్రచారం చేస్తుంటే, ఇది తోకచుక్క అని ఇంకొంతమంది అంటున్నారు. తోకచుక్క అయితే ఆకాశం నుండి కిందకు జారుతూ క్రమంగా అదృశ్యమవుతుంది. అయితే బుధవారం శ్రీవారి ఆలయంపై తూర్పు నుండి పడమర వైపు కదులతూ వెలుగుచుక్క దర్శనమిచ్చింది. అందరూ చూస్తుండగానే కనుమరుగైంది. అయ్యప్ప మకరజ్యోతి తరహాలో రెండు నిమిషాల పాటు ఆలయంపై ఈ వెలుగు చుక్క ముందుకు సాగింది. ఆలయ గోపురంపై నుండి ఓ వెలుగుచుక్క వెళుతూ వుండటాన్ని విధి నిర్వహణలో వున్న ఓ సెక్యూరిటీ గార్డు గమనించి, పాత్రికేయులకు చూపించాడు. కొంత మంది ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారు ఈ వెలుగుచుక్కను కెమేరాల్లో బంధించారు. అయితే సాధారణ కెమేరాల్లోకి ఈ చుక్క అందుబాటులోకి రాలేదు. దివిటీలా వెలుగుతూ పడమర వైపు పయనిస్తూ రెండు, మూడు నిమిషాల వ్యవధిలో కనుమరుగయింది. ఈ వెలుగు రహస్యమేమిటో శాస్తవ్రేత్తలే తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా బుధవారం వెంకన్న ఆలయంపై ఆవిష్కృతమైన ఈ అద్భుతంపై వాడివేడిగా చర్చ సాగుతోంది.

No comments:

Post a Comment