Thursday, 15 December 2011

కడప జిల్లా ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఆరాటం

గడిచిన ఏడేళ్ల కాలంలో వరస వైఫల్యాలతో చతికిలపడిన తెలుగుదేశం పార్టీ నేటికి తేరుకొని రానున్న ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా జిల్లాలో నిర్వీర్యమైంది. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉండేది అలాంటిది వైఎస్ ఆ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి తెలుగుదేశం కోటలను బీటలు వార్చారు. ప్రస్తుతం ఆ మూడు నియోజకవర్గాలు దివంగత ముఖ్యమంత్రి బతికినంత కాలం కాంగ్రెస్‌పార్టీకి ఎదురులేదు. ప్రస్తుతం ఆ మూడు నియోజకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఆ మూడు నియోజకవర్గాలలో తిరిగి పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలోపడింది. మూడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ కలిగి పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డే నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఉప ఎన్నికల పోరుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నది. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నేతలలో విబేధాలు ఉన్నప్పటికీ అందరూ కలసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ మూడు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను ధిక్కరించిన దరిమిలా వారిపై అనర్హత వేటు పడనున్నది. దీంతో ఉప ఎన్నికలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి కంచుకోట స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీపాగా వేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి కడప ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటికి వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా మరో వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇదే అదనుగా భావించిన తెలుగుదేశం పార్టీ ఆ మూడు నియోజకవర్గాలలో పట్టు బిగించాలనే వ్యూహా పన్నుతోంది. పార్టీ పూర్వవైభవం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాలలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. నాయకులంతా విబేధాలను పక్కన పెట్టి అభ్యర్థుల గెలుపుపై దృష్టి సారించారు. ఆ మూడు నియోజకవర్గాలలో ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు అభ్యర్థుల విజయంపై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఉప ఎన్నికలలో కష్టించి పనిచేస్తే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీను ఎదుర్కొవడం తేలికగా అవుతుందని తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితులలో జగన్‌పై ప్రజలలో ఇదివరకటి ఆదరణలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగనమోహన్‌రెడ్డిపై విస్తృతంగా వస్తున్న చెడుఆరోపణలపై ప్రచారం నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గవైష్యమాలను కూడా అనుకూలంగా మలుచుకోవాలని దేశం నేతలు ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అధికార పార్టీ నేతలు క్యూ కట్టుతుండడంతో టికెట్ దక్కని ఆశావాహులు ఉప ఎన్నికలలో గోడదూకేందుకు కూడా వెనుకాడడం లేదు. రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. గతనెల చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో తలపెట్టిన రైతుపోరు బాటలో విజయవంతమైంది. ఈ పర్యటనలో చంద్రబాబు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జడ్పీ మాజీ చైర్మెన్ సుగవాసి సుబ్రమణ్యం పేరును ప్రకటించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అందరూ ఏకతాటిపై నడుస్తున్నారు. ఇక రాజంపేట నియోజకవర్గ విషయానిక వస్తే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. అలాగే అనుకోని పరిస్థితులలో తెలుగుదేశం పార్టీని వీడిన మాజీ మంత్రి పి బ్రహ్మయ్య వర్గీయులు కూడా బ్రహ్మయ్యకు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీచేసిన అజయ్‌కుమార్‌ను కానీ లేదా ఇతరుల పేర్లను ఇప్పటికే పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తుంది. ఈ మూడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుకలిగి ఉండడంతో ఉప ఎన్నికల ద్వారా తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడంతో పాటు కాంగ్రెస్, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను మట్టికరించే విధంగా ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికలలో దేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డి తమ ఉనికిని కాపాడుకోనున్నది.

No comments:

Post a Comment