సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని వెల్లడిచేసిన మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఏడు జిల్లాలకు మొబైల్ వైద్య సేవలు విస్తరిస్తూ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రకటన మేరకు కట్టుబడి సెంట్రల్ ట్రస్టు ఉదయం సాయికుల్వంత్ సభా మండపంలో మొబైల్ వైద్య సేవలను సత్యసాయి సంస్థల దేశీయ అధ్యక్షులు, ట్రస్టు సభ్యులైన మద్రాస్ శ్రీనివాస్, ఆర్జె రత్నాకర్ చేతులమీదుగా ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణల అనంతరం ఆధునిక వైద్య వసతులతో కూడిన మొబైల్ వాహనాలను సాయికుల్వంత్ సభా మండపంలో జిల్లాల వారీగా వరుస క్రమంలో వుంచి పూజానంతరం ప్రారంభించారు. వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదల చెంతకు చేర్చే లక్ష్యంతో ప్రారంభించినట్లుగా ట్రస్టు వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం మొబైల్ వైద్య సేవలను అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాలూకాలోని 5 మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సేవలను విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, మహబూబ్నగర్, హైదరాబాద్, వైఎస్ఆర్ కడప జిల్లాకు విస్తరింప జేసి సదరు జిల్లాల్లో 410 గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తారు. అత్యాధునిక వైద్య వసతులు కలిగిన మొబైల్ వాహనంలో అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించే సౌకర్యాలను అందుబాటులో వుంచినట్లుగా ప్రారంభనంతరం ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఈ వైద్య సేవలు డిసెంబర్ నెల నుండి ప్రారంభం కానున్నాయి. మొబైల్ వైద్య సేవల్లో డాక్టర్లు, పారా మెడికల్ స్ట్ఫా, సేవాదళ్ సభ్యులు పాల్గొని సేవలందిస్తారు. ప్రధానంగా మొబైల్ వై ద్యచికిత్సల తదుపరి రోగ తీవ్రతను బట్టి వైద్య సేవలను, అత్యవసర సేవలను అందించేందుకు సత్యసాయి సేవా సంస్థలకు అనుబంధంగా వున్న నర్సింగ్ హోంలలో చేర్పించి వైద్య సేవలు అందించే విధానాన్ని అమలుపరుస్తున్నారు. సత్యసాయి ప్రేమతత్వపు స్ఫూర్తితో వీటిని నిర్వహిస్తున్నామని ట్రస్టు వర్గాలు వెల్లడించాయి
No comments:
Post a Comment