Friday, 10 February 2012

పేద విద్యార్థుల ఉజ్వల భవితకే ఉపకార వేతనాలు

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకే ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సాయంత్రం చిత్తూరు కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ జూనియర్, డిగ్రీ, ఎంబిఎ, యూనివర్శిటీ ప్రిన్స్‌పాల్స్, కరస్పాండెంట్‌లతో మంత్రి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునేందుకు, ఆర్థికంగా చేయూతను అందించేందుకే పీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతకు విద్యను అందించి దేశానికి ఉపయోగపడే విధంగా వారిని ప్రయోజకులుగా చేసే మంచి ఆశయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్స్ సమన్వయంతో కలసి పనిచేయాలని కోరారు. స్కాలర్‌షిప్‌లను, రీయింబర్స్‌మెంట్‌ను శాశ్వతంగా కొనసాగించేందుకు కళాశాల ప్రిన్స్‌పాల్ వారి సలహాలను, సూచనలను అందించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి యాజమాన్యాలు ఎటువంటి అవకతవలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమశాఖ రేమాండ్ పీటర్ మాట్లాడుతూ విద్యార్థుల దరఖాస్తు లు వెంటనే పరిశీలించి ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. ఈసంవత్సరం 1,259కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, విచారణ ప్రక్రియ కళాశాల యాజమాన్యాల వారు మరింత వేగవంతం చేయాలన్నారు. కళాశాల యాజమాన్యాల వారు కళాశాలకు ఏప్రాంతంలో అనుమతి తీసుకుని వుంటే ఆప్రాంతంలోనే కళాశాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని అమలుచేస్తున్న కార్యక్రమానికి కళాశాలల ప్రిన్స్‌పాల్స్ సహకారం అందించాలన్నారు.

No comments:

Post a Comment