Tuesday, 14 February 2012

ఎన్టీ రామారావు తర్వాత వైయస్ మాత్రమే...వైయస్ జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని పాలించిన పెద్ద మనిషి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అంటే నష్టపరిహారం కోసం చనిపోతున్నారని అవహేళన చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 200 మంది చేనేత కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలకు కూడా లక్ష రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని వైయస్ రాజశేఖర రెడ్డి జీవో జారీ చేశారని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా ముందు చేనేత కార్మికులకు ఏమైనా చేశారంటే ఎన్టీ రామారావేనని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం ఎన్టీ రామారావు జనతా పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 48 గంటలపాటు చేపట్టిన దీక్షని ఆయన ఈ సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నేతన్నలకు అండగా తనతోపాటు ఉన్న నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూలు, జరీ, రేషన్, రంగుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చేనేత కార్మికులు తయారు చేసిన చీరల ధరలు మాత్రం కనీస స్థాయిలో పెరగడంలేదన్నారు. వారికి గిట్టుబాటు ధర లభించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు 11 రకాల ఉత్పత్తులను చేనేత కార్మికులకు కేటాయించారు. ఆ ఉత్పత్తులను ఇతరులు ఉత్పత్తి చేయకుండా ఈ ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని తెలిపారు.
చేనేత కార్మికుల సమస్యలపై అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు రోజుల పాటు చేపట్టిన దీక్షను ఆయన మంగళవారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అల్లుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పథకాన్ని ఎత్తేశారని ఆయన విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జారీ జీవోల గురించి ఆయన వివరించారు. చేనేత కార్మికుల గురించి, చదువుకునే విద్యార్థుల గురించి ఆలోచించే నాథుడు రాష్ట్రంలో లేకుండా పోయారని ఆయన అన్నారు.

No comments:

Post a Comment