Saturday, 14 January 2012

పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరులైన పోతుల, చమన్‌పై బహిష్కరణ వేటు!

దివంగత ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరులైన పోతుల సురేష్, చమన్‌లపై జిల్లా పోలీసు శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగానే వీరిద్దరి కదలికలపై నిఘాను తీప్రతరం చేసింది. దీంతో పాటు వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లా బహిష్కరణ విధించే అధికారం పోలీసులకు లేకపోవడంతో వౌఖికంగా వీరిద్దరికీ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. వీరు జిల్లాలో ప్రవేశిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి హెచ్చరించినట్లు సమాచారం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం, పరిటాల రవీంద్ర అనుచరుడైన తగరకుంట ప్రభాకర్‌ను ఆయన ప్రత్యర్థి వర్గం దారుణంగా హత మార్చడంతో వీరిద్దరూ అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తరువాత 2005 జనవరి 24న పరిటాలను జిల్లా పార్టీ కార్యాలయంలో దారుణంగా హతమార్చడం తెలిసిందే. అప్పటికీ వీరిద్దరూ అజ్ఞాతం వీడకుండానే గడిపారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోతుల సురేష్ ముందుగా పోలీసులకు లొంగిపోగా కొన్ని రోజుల క్రితం చమన్ పోలీసుల ముందు లొంగిపోయాడు. శత్రువుల నుంచీ ఎలాంటి ప్రాణభయం లేకపోవడం వల్లే వీరిద్దరూ పోలీసులకు లొంగిపోయారు. ఆర్వోసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పోతుల సురేష్ లొంగిపోయిన తరువాత కొన్ని రోజుల జిల్లా కేంద్రంలోనే మకాం వేశారు. ఆ సమయంలో వివాదాస్పద భూ పంచాయితీల్లో తల దూర్చడం, తిరిగి తన వర్గాన్ని సమీకరించే పనిలో పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించగలిగారు. దీంతో పాటు టిడిపిలోనే కొన్ని వర్గాలు ఆయన జిల్లాలో ఉండడాన్ని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిరసించినట్లు సమాచారం. తను అనుకున్న వాళ్లే ఈ విధంగా వ్యవహరించడంతో ఖిన్నుడైన ఆయన వారితో అమీతుమీకి సిద్ధమైనట్లు తెలిసింది. అందులో భాగంగానే జిల్లాలో ఏర్పాటుచేస్తున్న గాలి మరల వ్యవహారంలో ఆయా కంపెనీలతో తగవుకు దిగినట్లు తెలిసింది. ఆయనకు సన్నిహితులుగా పేరుపడ్డ కొందరు వ్యక్తులు గాలి మరల కాంట్రాక్టులు చేపట్టినట్లు సమాచారం. దీంతో పాటు గాలిమరల కాంట్రాక్టులో గుడ్‌విల్ కావాలని, అందులో తను చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా హెచ్చరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని ఒక లాయర్‌ను, టిడిపిలోని కొందరు నాయకులను సురేష్ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఆయనకు సన్నిహితులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని నేరుగా పోలీసులకు చేరవేసినట్లు పోతుల వర్గం అనుమానిస్తోంది. భూదందాలు, గాలిమరల వ్యవహారంలో కలగచేసుకోవడం, తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటుచేసుకుంటుండడంతో వీటన్నింటినీ ముందుగానే గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారాలకు చెక్ పెట్టినట్లు తెలిసింది. ఇలా ఇతనిపై పలు ఆరోపణలు ఉండడంతో పోలీసులు పోతులను జిల్లాలోకి రాకూడదని హెచ్చరించినట్లు సమాచారం. దీని వెనుక టిడిపిలోని కొందరు పెద్దల హస్తం కూడా ఉన్నట్లు పోతుల సురేష్ వర్గం అనుమానిస్తోంది. కొన్ని నెలల క్రితం పోలీసులకు లొంగిపోయిన చమన్ ఒకటి రెండు మార్లు ఇదే మార్గం గుండా బెంగళూరు వెళ్లినట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. పోలీసులకు లొంగిపోవడానికి ముందు కూడా ఒకటి రెండు సార్లు ఇదే మార్గం గుండా ఆయన బెంగళూరు వెళ్లినట్లు సమాచారం. చమన్ లొంగిపోయిన తరువాత జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయనతో కలవడం, బెయిల్ వచ్చిన తరువాత జిల్లాలోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని ఒక కేబుల్ ఆపరేటర్ కూడా పెద్దమొత్తంలో డబ్బులు ముట్టచెప్పినట్లు తెలిసింది. దీంతో పాటు పలువురు చోటామోటా నాయకులు ఆయన దగ్గరకు చేరి జిల్లాలో నెలకొన్న పలు వివాదాస్పద విషయాల గురించి ఆయనకు తెలియజేసినట్లు సమాచారం. చమన్ లొంగిపోయినప్పటి నుంచి ఆయనను ఎవరు కలుస్తున్నారు.. ఎందుకు కలుస్తున్నారన్న సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అనంతరం వీరిలో కొందరిని పిలిపించి తమదైన శైలిలో హెచ్చరించారు. ఈ సందర్భంగా చమన్‌ను కూడా పోలీసులు వౌఖికంగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన పోలీసు బాసు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నెల రోజుల్లోపు నిన్ను జిల్లాకు పంపిస్తానని ఈ సందర్భంగా పోలీసు బాసు హామీ ఇచ్చినట్లు చమన్ వర్గం చెబుతోంది. తాను జిల్లాకు చెందిన వ్యక్తినేనని పోతులది మాత్రం మహబూబ్‌నగర్ జిల్లా కాబట్టి ఆయన విషయంలో తాను ఏ మాత్రం కలగచేసుకోనని కూడా ఈ సందర్భంగా పోలీసు బాసుకు చమన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆయన రాకను ఆయనకు సన్నిహితంగా ఉన్న పలువురు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. చమన్ జిల్లాలోకి వస్తే తమ దగ్గర ఉన్న వారందరూ ఆయన దగ్గరకు వెళ్తారన్న అనుమానం వారిని పట్టిపీడిస్తోంది. అందుకే ఆయన రాకను వారు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చమన్ కూడా గుర్తించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇలా ఇన్ని సమస్యలు, అడ్డంకుల నడుమ వారిద్దరూ జిల్లాలోకి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం. తన వాళ్లు అనుకున్న వాళ్లే ప్రస్తుతం వారికి అనుకూల శత్రువులుగా మారడం గమనార్హం.

No comments:

Post a Comment