Wednesday, 14 December 2011

ఇక ఆన్‌లైన్‌లోనే ఆర్మీ పరీక్ష

సైన్యంలో నియామకాలకు ఇక ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష ఉంటుందని ఆర్మీ జనరల్ రిక్రూటింగ్ డిప్యూటీ డెరైక్టర్(స్టేట్స్) బ్రిగేడియర్ పంకజ్ సిన్హా తెలిపారు. పారదర్శకంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన  విలేకరులతో మాట్లాడుతూ.. సైన్యంలో చేరడానికి ఇప్పుడు యువతలో ఆసక్తి పెరిగిందన్నారు. అధికారుల స్థాయి పరీక్షలు యూపీపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌బీ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థుల ర్యాలీ నుంచి ఎత్తు, పరుగుపందెం, పుల్‌అప్స్ వంటి శారీరక దృఢత్వ పరీక్షల తర్వాత రాత పరీక్ష ఉంటుందని వివరించారు. అన్ని ప్రక్రియల్లోనూ కంప్యూటర్‌లో వివరాలు నమోదు చేస్తారని, ఆన్‌లైన్ పరీక్ష అనంతరం నిమిషాల వ్యవధిలోనే మార్కులు తెలిసిపోతాయని పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన సమయంలోనే ఓఎంఆర్, బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రల సేకరణ, ఐరిస్, ఫొటోగుర్తింపు వంటివి తీసుకుంటామని, ఇందువల్ల ఆయా అభ్యర్థులు దేశంలో ఎక్కడ పరీక్షకు హాజరైనా డేటాషీట్ ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ విధానంలో మొట్టమొదటిసారి వచ్చే ఏడాది ఏప్రిల్ 12న పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు www.indianarmy.comవెబ్‌సైట్ చూడొచ్చని ఆయన సూచించారు.

No comments:

Post a Comment