Friday, 30 December 2011

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది ... చంద్రబాబునాయుడు

దేశంలో అవినీతే తీవ్రవాదం కన్న పెద్ద సమస్యని, అవినీతిని నిరోధించాల్సిన అవసరం ఉందని, అవినీతిని రూపు మాపడానికి సమర్ధవంతమైన చట్టాలు రావాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపే ఉద్దేశం, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన విమర్శించారు. లోక్‌పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందంటూ బాబు ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పటిష్టవంతమైన లోక్‌పాల్ బిల్లు కోసం తుదివరకు పోరాటం చేస్తామని అన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంనకు ప్రోత్సాహాకాలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 4.12 కోట్ల లిక్కర్ కేన్‌లు, 3.49 కోట్ల బీర్ కేన్‌లు ఉత్పత్తి చేస్తున్నారని ప్రతి లిక్కర్ కేన్‌కు ప్రభుత్వానికి రూ. 1549 లాభం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ఒక వ్యక్తికి ఒకే షాపు రావాలన్న నిబంధనలున్నప్పుడు బొత్సకు 31 షాపులెలా వచ్చాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లపై ఏసీబీ నివేదికను ఎందుకు బయటపట్టడం లేదని బాబు ప్రశ్నించారు. మద్యం సిండికేట్లకు నిరసనగా జనవరి 3,4,5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment