Sunday, 20 November 2011

కడప జిల్లాలో రేపటి నుంచి రైళ్లు దారి మళ్లింపు

 జిల్లా వాసుల దశాబ్దాల నాటి కల ఈ నెల 21వ తేదీన నెరవేరనున్నది. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకూ వారం రోజుల పాటు కడప-ముద్దనూరు మధ్య డబ్లింగ్ పనులను రైల్వే అధికారులు పూర్తి చేయనున్నారు. డబ్లింగ్ పనులు ప్రారంభకానున్న దృష్ట్యా ముంబాయి, చెన్నై, చెన్నై-ముంబాయి, హైదరాబాద్-చెన్నై, చెన్నై-హైదరాబాద్, తిరుపతి-హుబ్లీ, హుబ్లీ-తిరుపతి రైళ్లను రైల్వే శాఖ ఉన్నతాధికారులు దారి మళ్లించారు. ఈ వారం రోజులు ప్రయాణికుల సౌకర్యార్థం ఎపిఎస్ ఆర్టీసీ వారు కడప నుండి సుదూర ప్రాంతాలకు అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు, రేణిగుంట రైల్వేలైన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు జంక్షన్ల మధ్య డబుల్ లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల నుంచి కంటున్న కల నెరవేరే రోజు రానే వచ్చింది. ఈ ప్రాంతంలో రైల్వేశాఖకు అత్యధిక ఆదాయం తెచ్చే డివిజన్‌గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ముడి సరకు రవాణకు ముంబాయి, చెన్నై రైల్వేలైన్‌గా చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో తయారయ్యే సిమెంట్ పరిశ్రమ నుంచి ఇతర రాష్ట్రాలకు సిమెంట్ ఎగుమతి వీటితో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనానికి ఈ లైన్ మీదుగా పలు రైళ్లు ఉన్నాయి. రేణిగుంట, గుంతకల్లు మధ్య ఉన్న సుమారు 300 కిలోమీట్ల పొడవునా డబుల్ లైన్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు సుమారు రూ. 800 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రేణిగుంట నుంచి కమలాపురం వరకు 2010 అక్టోబర్ నాటికి పూర్తయ్యాయి. అయితే కమలాపురం-కొండాపురం మధ్య డబ్లింగ్ లైన్ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభంకానున్నాయి. రైల్వే అధికారులు అనుకున్న సమయానికి ముందుగానే ఈ పనులు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీన పనులు ప్రారంభించి 26వ తేదీ నాటికి పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకు ఎర్రగుంట్లలో ఇప్పటికే పనులు వేగవంతం చేశారు. నూతన లైన్, విద్యుదీకరణ పనులు అనుసంధానం చేసి ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు పూర్తి కానున్నాయి. రేణిగుంట నుంచి కమలాపురం వరకూ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. నవంబర్ 26 నాటికి ముద్దనూరు వరకూ డబ్లింగ్ పనులు పూర్తవుతాయి. జనవరి 31వ తేదీ నాటికి ఈ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తి చేయనున్నారు. కమలాపురం నుండి ఎర్రగుంట్ల, ముద్దనూరు వరకూ రైల్వే స్టేషన్‌లో ఉన్న రెండవ లైన్‌ను అత్యంత ఆధునీకరణతో నిర్మించడంతో పాటు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలు కూడా ఆధునీకరించనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి తిరుపతి-కాచిగూడ, కాచిగూడ-తిరుపతి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై-కాచిగూడ, ఎగ్మోర్-కాచిగూడ, తిరుపతి-హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటీ, ముంబాయి-త్రివేండ్రం మధ్య నడిచే రైళ్ల రూట్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. చెన్నై-హైదరాబాద్, చెన్నై-ముంబాయి వెళ్లే రైళ్లను రేణిగుంట నుంచి గూడూరు మీదుగా మళ్లించారు. అలాగే ముంబాయి-త్రివేండ్రం, చెన్నై-ముంబాయి రైళ్లను ధర్మవరం మీదుగా మళ్లించారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా తిరుపతి-్ధర్మవరం మీదుగా మళ్లించారు. 26వ తేదీ పనులు పూర్తయిన వెంటనే 27వ తేదీ నుంచి డబుల్ లైన్లల్లో రైళ్ల రాకపోకలు జరుగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. డబ్లింగ్ పనులు పూర్తయితే క్రాసింగ్ సమస్యలు తీరడంతో పాటు, రైళ్ల రాకపోకలు వేగవంతం కానున్నాయి

No comments:

Post a Comment