Wednesday, 30 November 2011

ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులు !!

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా.. సాక్షులను భయాందోళనలకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో సాక్షుల వాంగ్మూలాలంటూ దర్యాప్తును తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచురిస్తున్నారన్న ఆరోపణలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ చేసిన ఆరోపణలకు సీబీఐ హైకోర్టుకు వివరణ ఇచ్చుకుంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తామెవ్వరికీ లీక్ చేయటం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై సంతృప్తి చెందని న్యాయమూర్తి.. పిటిషనర్ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీబీఐకి స్పష్టం చేశారు. సీబీఐ తన దర్యాప్తు వివరాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీక్ చేస్తోందని, సిటింగ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎమ్మార్ హిల్స్ ప్లాట్ కొనుగోలుదారు కె.రఘురామకృష్ణరాజు గత వారం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.మునికృష్ణారెడ్డి వాదనలను వినిపిస్తూ.. ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజల్లో ద్వేషభావం కలిగేలా.. సీబీఐ జాయింట్ డెరైక్టర్, అతని సహచరులు దర్యాప్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని తెలిపారు. చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన తన క్లయింటు లాంటి కొనుగోలుదారులను నేరస్తులుగా చిత్రీకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని కోర్టుకు నివేదించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సాక్షుల వాంగ్మూలాలు, వారి ప్రకటనలు, నేరాంగీకారాలు తదితర అంశాలను యథాతథంగా ప్రచురిస్తూ.. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు జర్నలిజం విలువలను కాలరాసి, అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఇప్పటి వరకు ప్రచురించిన తప్పుడు కథనాలను సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖండించలేదని.. తద్వారా సీబీఐ అధికారులే కీలక సమాచారాన్ని ఆ రెండు పత్రికలకు లీక్ చేస్తున్నారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము ఎవ్వరికీ ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్స్ ప్రయివేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని సీబీఐ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. 

No comments:

Post a Comment