కడప నగరంలో శుక్రవారం జరిగిన సీమ సమైక్యాంధ్ర సదస్సులో రాయలసీమ జిల్లాల నుండి మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘం నాయకులు, మహిళా నాయకురాళ్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్ సిహెచ్. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నాయకులు తమ ఉద్యమంతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు ముందే నికర జలాల సమస్య, పెండింగ్ ప్రాజెక్టుల సమస్య తేల్చాల్చిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ విభజన రెండవ అంశంగా భావిస్తామన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తెలంగాణ కన్నా రాయలసీమే అన్నింట వెనుకబడి ఉందన్నారు. పోతిరెడ్డిపాడుకు 30 రోజులు వరద నీళ్లు పారితే ప్రస్తుతం మనకు నీళ్లు వచ్చాయన్నారు. గాంధీగిరి అంటునే కెసిఆర్ రౌడీయిజం చేస్తున్నాడన్నారు. రాయలసీమ వాసులుగా మనం ఏం పోగొట్టుకున్నామో వారికి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు జరిగాయన్నారు. రాష్ట్రం విడిపోవడమంటే మన హృదయాన్ని పగులగొట్టడమేనన్నారు. మరో మాజీ మంత్రి రామమునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విడిపోతే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి అల్లూరు సీతారామరాజుకన్నా ముందే బ్రిటిష్ వారిపై పోరాడాడన్నారు. తెలంగాణ వారు మన మంచి తనాన్ని బలహీనతగా తీసుకుంటున్నారన్నారు. రాయలసీమ జర్నలిస్టు సంఘం నాయకులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టే దమ్ము ఎవరికి లేదన్నారు. జెఎసి తీసుకునే ఎలాంటి నిర్ణయాలనైనా మీడియా అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే మనకు నీళ్లుండవు, ప్రాజెక్టులు కూడా వారే కట్టుకుంటారన్నారు. అందుకే మన భావాన్ని ఢిల్లీకి గట్టిగా తెలపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వారు నెల రోజులుగా పోరాటం చేస్తుంటే మనం చోద్యం చూడడం దురదృష్టకరమన్నారు. కర్నూలు టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ వారికి బుద్ధి వచ్చేలా మనం ఉద్యమించాలన్నారు. మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కోరటం మనం చేసిన త్యాగాలకు ఫలితమా అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనను ఖండించాలన్నారు. మైనార్టీ నాయకులు అమీర్బాబు మాట్లాడుతూ సమైక్యతే ముస్లింల మనోభావమన్నారు. లక్ష మంది పొట్టి శ్రీరాముల లాంటి వారు త్యాగాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమన్నారు. ప్రొద్దుటూరు భార్ అసోసియేషన్ అధ్యక్షులు నూరుల్లా మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమ కారులపై పోలీసులు పెట్టే ఎలాంటి కేసులైన తమ భార్ అసోసియేషన్ ఉచితంగా వాధిస్తుందన్నారు. మహిళా నాయకురాలు చిక్కేరు జానకి మాట్లాడుతూ తెలంగాణ పోరాటం స్వార్థపూరిత పోరాటమన్నారు. ప్రతి రోజు రాయలసీమ ఉద్యమం ఉండాలన్నారు. మరో నాయకురాలు అల్లె ప్రభావతి మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యమంలో మహిళల మనోభావం దెబ్బతింటోందని ఉద్యమంలో మా పాత్రే ముందుండాలన్నారు
No comments:
Post a Comment