Thursday, 2 February 2012

పాల ధరలకు రెక్కలొచ్చాయి

 ఏడాది కాలంలో మూడు పర్యాయాలు ప్రైవేటు డెయిరీలు పాల ధరలను పెంచి వినియోగదారుల నెత్తిన భారం మోపాయి. ఏటా ఇతర డెయిరీలకన్నా రూపాయి అదనంగా పెంచే హెరిటేజ్ కంపెనీ తాజాగా లీటరు పాలుపై రూ.4 పెంచింది. దీంతో ఇతర డెయిరీలు తామేమీ తక్కువ కాదంటూ హెరిటేజ్ కంపెనీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. అందులో భాగంగానే హెరిటేజ్‌తో పాటు జిల్లాలోని మరో 8 డెయిరీలు కూడా లీటరు రూ.26 ఉన్న పాలధరలను రూ.30కి పెంచాయి. 3.0 శాతం కొవ్వు, 8.5 వెన్నశాతం ఉన్న లీటర్ పాలను రూ. 30 (రీటైల్ ధర) లకు విక్రయిస్తున్నారు. పాల సేకరణ ధరను పెంచకుండా ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలు పబ్బం గడుపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న మార్చి నుంచి మే నెలాఖరు వరకు పాలసేకరణ ఆశించిన స్థాయిలో ఉండదని ప్రైవేటు డెయిరీలు భావిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పాలసేకరణ ధర పెంపును పక్కన బెట్టి ఉత్పత్తుల విక్రయ ధరలను మాత్రం పెంచాశాయి. చాలా ప్రైవేటు డెయిరీలు లీటర్ నాణ్యమైన పాల సేకరణకు రూ. 14 నుంచి 19 వరకు మాత్రమే చెల్లిస్తున్నాయి.జిల్లాలో పాలిచ్చే ఆవులు, గేదెలు 5.80 లక్షలు ఉన్నాయి. 48 ప్రైవేటు డెయిరీలు, 101 బల్క్‌మిల్క్ సెంటర్‌ల ద్వారా రోజుకు దాదాపు 18 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. 3 లక్షల లీటర్లు స్థానిక పాల వ్యాపారులు విక్రయిస్తున్నారు. మిగిలిన 15 లక్షల లీటర్ల పాలను ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు కొవ్వు(ఫ్యాట్), వెన్నను తీసివేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలోని డెయిరీలు మినహా మిగిలిన 48 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ రేటును అనధికారికంగా పెంచేశాయి. సాధారణంగా పాలసేకరణ, విక్రయధరల నిర్ణయం ప్రభుత్వ సమక్షంలో నిర్ణయించాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా ధరలను పెంచేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని బాలాజీ, ఏపీ డెయిరీలు లీటర్ పాలను రూ. 28కు విక్రయిస్తున్నాయి.

No comments:

Post a Comment