ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫాం హౌస్ నుండే దివంగత తెలుగుదేశం
పార్టీ నేత పరిటాల రవీంద్ర హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ చేనేత, జౌళీ
శాఖ మంత్రి శంకరరావు మంగళవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ
రాశారు. ఆయన సోనియాకు ఎనిమిది పేజీల లేఖ రాసి ఫ్యాక్స్ చేశారు. అందులో ఆయన
పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిటాల హత్యకు కుట్ర సబితా ఫాం హౌస్
నుండే జరిగిందన్నారు. సబిత తనయుడు కార్తీక్ రెడ్డి భూఆక్రమణలకు
పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాడి జరిగి నెల రోజులు దాటినా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించక పోవడం బాధాకరమన్నారు. దాడికి
కారకులపై సబితా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై ఇప్పటి వరకు
ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోనియాకు
విజ్ఞప్తి చేశారు.కార్తీక్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని
కోరారు. బడుగు, బలహీన వర్గాలను దూరం చేసుకోవడం పార్టీకి సబబు కాదని లేఖలో
అధినేత్రికి విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలోనూ అవినీతి
కొనసాగుతోందని అందులో పేర్కొన్నారు. పాలనపై అధిష్టానం ఐబి రిపోర్టు
తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంగా
తప్పించాలన్నారు.
No comments:
Post a Comment