Saturday, 28 January 2012

నందికొట్కూరు నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్ కట్

ఇటీవలే నగర పాలిక సంస్థగా మారిన నందికొట్కూరు మేజర్ పంచాయతీ విద్యుత్ శాఖకు భారీగా బకాయి పడింది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో నందికొట్కూరు పరిధిలోని వీధిలైట్లకు విద్యుత్ కట్ చేయనున్నట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. బకాయిలు భారీగా ఉన్నాయని ఇచ్చిన నోటీసులకు స్పందన లేకపోవడంతో మొదటి దశలో అప్పటి పంచాయతీ ఇప్పటికీ నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్‌ను  తొలగించారు. నందికొట్కూరు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు రూ.కోటి బకాయి ఉందని ట్రాన్స్‌కో ఎడిఎ శ్రీనివాసులు తెలిపారు. బకాయిలు గత 15 నెలలుగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. నీటి పథకాలు, విద్యుత్ దీపాలు వినియోగించి బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు. అయితే స్పందన లేకపోవడంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశామన్నారు. నగర పంచాయతీగా మారిన తరువాత సైతం మునిసిపల్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే స్పందించకపోయిన కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలు త్వరగా చెల్లించని పక్షంలో వీధి దీపాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపి వేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యుత్ బకాయిలు చెల్లించడంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించి బకాయిలను చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పట్టణ వీధుల్లో చీకట్లు కమ్ముకుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడం, అవినీతికి పాల్పడటం వంటి కారణాల వల్లే బకాయిలు పేరుకుపోయాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకొని బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment