Sunday, 22 January 2012

24న జాతీయగీతం జనగణమన వందేళ్ల ఉత్సవం

జాతీయగీతం జనగణమనకు వందేళ్లు, విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె బిటి కళాశాల ప్రిన్సిపల్ తులసీరామ్‌నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 24న జనగణమన జాతీయగీత వందేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటి సిఎం దామోదర్ తో పాటు 10మందికి పైగా కేంద్ర, రాష్టమ్రంత్రులు, చిరంజీవి, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉత్సవానికి హాజరవుతున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాష వెల్లడించారు.  విశ్వకవి రవీంద్రుడు ఆరురోజుల పాటు మదనపల్లె బిటి కళాశాలలో బసచేసిన ప్రదేశాలు, నాడు జనగణమన గేయానికి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ట్యూన్‌చేసి గీతాన్ని మొదటిసారిగా అప్పటి విద్యార్థులచే ఆలపించిన ప్రదేశాలను సిఎం, గవర్నర్‌లు పరిశీలించనున్న దృష్ట్యా వాటిని అధికారులు పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ ల్యాండ్ స్థలం కోసం బెంగళూరురోడ్డులోని బిటి కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం జరిగే సిఎం బహిరంగ సభ కోసం పుంగనూరురోడ్డులోని మిషన్‌కాంపౌండు ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహం, ఎమ్మెల్యే స్వగృహాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సిఎం మదనపల్లె పట్టణంలో ఉంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష స్థానిక విలేఖరులతో మాట్లాడారు. జనగణమనకు వందేళ్ళు, విశ్వకవి రవీంద్రునికి 150 జయంతి ఉత్సవాలను ఈనెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24న మధ్యాహ్నం 2గంటలకు ప్రజలందరూ ఒకేసారి జనగణమన జాతీయగీతం ఆలపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment