Friday, 20 January 2012

పశుగ్రాసం పెంపకంలోకడప జిల్లాకు రెండోస్థానం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసం పెంపకంలో కడప జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని పశు సంవర్ధక శాఖ జేడీ విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా పశువైద్యశాలను  ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కరువును దృష్టిలో ఉంచుకొని చెరువులలోని మిగులు నీటితో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 40 చెరువులను గుర్తించామన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా పశుగ్రాసం నిల్వ చేసేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 50 పాతర గుంతలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో మొక్క జొన్న, జొన్న పైరును కటింగ్‌చేసి పాతర గుంతలలో వేసి వాటిపై బెల్లం పానకం చల్లితే మూడు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాకు 404 మినీ డెయిరీలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 10మినీ డెయిరీలు ఏర్పాటు చేశామన్నారు. పాడి పశువుల పెంపకానికి జిల్లాకు రూ..85లక్షలు మంజూరయ్యాయని, ఇందులో రూ..65లక్షలతో పాడి పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. అలాగే జిల్లాకు 91 గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ..12లక్షల సబ్సిడీ విడుదలైందన్నారు. దీని ద్వారా 50శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలను ఇస్తున్నామన్నారు. అంతేకాక జిల్లాకు కోళ్ల పెంపకానికి రూ..40లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 1800మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 6కోడి పిల్లల పెంపకం కేంద్రాలను కడప 2, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి ఉచితంగా 45కోళ్లను అందిస్తామన్నారు. అలాగే ఆర్‌కేయూవై పథకం కింద జిల్లాకు 220 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ..28వేలు ఇస్తున్నామని, ఇందులో రూ..14వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇప్పటివరకు 110 యూనిట్లను లబ్ధిదారులకు ఇచ్చామని వివరించారు. అనంతరం ఆయన పశువైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రసాదరావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment