Friday, 27 January 2012

అభిమానులు ,ప్రజలకు ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా...ఎమ్మెల్యే చిరంజీవి

తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి వ్యాఖ్యానించారు.  నీతి నిజాయితీ ప్రాతిపదికగా తాను రాజకీయ రంగప్రవేశం చేశానని, సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నానని చెప్పారు. పూలేలాంటి గొప్ప నేతలను తెర మీదకు తెచ్చి సామాజిక న్యాయం గురించి తమ పార్టీ ప్రచారం చేసిన తర్వాతనే మిగిలిన పార్టీలు అనుసరించి ఆయన విగ్రహాలను పెట్టాయన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి  మీడియాతో అన్నారు. అభిమానులు పరస్పరం గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక శక్తి, మరో శక్తితో జత కడితే అద్భుతాలు సాధించగలనని భావించానన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి సి.రామచంద్రయ్య భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment