Friday, 27 January 2012

ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల మాట మరచినట్టుంది. ప్రముఖుల సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలతో వచ్చేవారికి దర్శనాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయడానికి సమాయత్తం అయింది. నాలుగేళ్ళ క్రితం తిరుమలలో చైర్మన్ కార్యాలయంగా ఉన్న డంబుల్ అతిధిగృహంలో ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలతో దళారీలు రాజ్యమేలారు. జెరాక్స్ కాపీలతో వందల కొద్ది టిక్కెట్లు సంపాదించి బ్లాక్‌లో అమ్ముకున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడం కోసం సిఫారసు లేఖలపై టిక్కెట్లు ఇవ్వడాన్ని టీటీడీ బాగా తగ్గించింది. ఎమ్మెల్యే, ఎంపీలు లెటర్లు ఇచ్చినా నేరుగా వారు ఫోన్‌చేసి చెబితే తప్ప వీఐపీ బ్రేక్, ఇతర సేవా టిక్కెట్లు ఇవ్వకుండా నియంత్రించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేల సిపార్సు ఉత్తరాలకు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక విధంగా సామాన్య భక్తులకు అన్యాయం చేయడమే. తమకు తగిన గౌరవం ఇవ్వడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీ లు బహిరంగంగా విరుచుకుపడటం, స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లడంతో వీరిని సంతృప్తి పరచడానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

No comments:

Post a Comment