ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆది నుంచి గంగుల, భూమా కుంటుంబాల మధ్య
ఫ్యాక్షన్, గ్రూపు రాజకీయాలు నడుస్తూన్నాయి. పార్టీల కన్నా గంగుల, భూమా
గ్రూపు ఆధిపత్య రాజకీయమే ఆళ్లగడ్డలో కీలకం. అయితే స్థానిక ఎమ్మెల్యే
శోభానాగిరెడ్డి రాజీనామాను రెండురోజుల క్రితం అసెంబ్లీ స్వీకర్ ఆమోదించడంతో
ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు తెర లేచింది. దీంతో అందరి దృష్టి
ఆళ్లగడ్డవైపు మళ్లింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలతో
పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు కూడా తమ గ్రూపులను
ఇప్పటి నుంచే ఉపపోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంకిపెళ్లి సుబ్బి
చావుకొచ్చిందన్న చందంగా రెండు ప్రధాన గ్రూపుల ఆధిపత్య పోరు మధ్య అధికారుల
నలిగిపోతున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారులతో
సమావేశమై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఆళ్లగడ్డ నియోజక
వర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులతో పాటు
గ్రామపంచాయితీ నిధులు కూడా తాము సూచించిన వారికే కేటాయించాలని స్పష్టం
చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్న విషయాన్ని
ప్రజలకు తెలుపాలన్నదే తమ ఉద్దేశ్యం అని కాంగ్రెస్పార్టీ అసెంబ్లీ
ఇన్చార్జి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే
శోభానాగిరెడ్డి కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిబంధనలమేరకు
ఉపాధి హామీ పనులు చేయాలని సూచించారు. రాజకీయ వత్తిళ్లకు తలవంచి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా
హెచ్చరిక జారీ చేశారు.
No comments:
Post a Comment