Sunday, 5 February 2012

ఐఏఎస్‌ చిన్నపిల్లలుకాదు...జెసి దివాకర్ రెడ్డి

మంత్రులు చెప్పినట్లు చేయడానికి ఐఏఎస్ అధికారులేం చిన్న పిల్లలు కాదని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. మంత్రులు చెప్పినట్లు తాము చేశామని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ బాధ్యత లేదని చెప్పడం సరికాదన్నారు. మంత్రుల బాధ్యత ఉందని చెబుతున్న ఐఏఎస్ అధికారుల ఏ మంత్రి అవినీతికి పాల్పడ్డారో బయట పెట్టాలని  డిమాండ్ చేశారు. ఆపద వచ్చిందని మంత్రుల పైకి తప్పు నెట్టేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. మేం ఎన్నిక ఎలెక్ట్ అయిన వారమని, వారు సెలెక్ట్ అయిన వారని, ఇరువురం ప్రజా సేవ కోసమే ఉన్నామన్నారు. తాము చిన్న చేపలమని వారు ఒప్పుకున్నారు కదా అని అన్నారు. కాగా అంతకుముందు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో ఐఏఎస్‌ల తీరును తప్పు పట్టిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల్లాగే ఐఏఎస్ అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ తప్పు లేదని చెప్పడం అధికారులకు సరికాదన్నారు. కనీస ప్రాథమిక సూత్రాలు కూడా మరిచిపోయి వ్యవహరించిన వారి తీరు చాలా విచారకరమన్నారు. చట్టాలు రాజకీయ నాయకులు చేసినా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.

No comments:

Post a Comment