Thursday, 8 December 2011

డర్టి పిక్చర్ పై రామ్ గోపాల్ వర్మ కామెంట్

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఏక్తా కపూర్ రూపొందించిన డర్టీపిక్చర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ...డర్టీ పిక్చర్ ని ఫ్యామిలీలు కూడా చూసేలా రూపొందించినందుకు ఫ్యామిలీ క్వీన్ ఏక్తాకు కుదాస్ అంటూ మెచ్చుకున్నారు. అలాగే అన్ని కుటుంబాలకి మనస్సు లోపల అంతర్గతంగా డర్టీ అనేది ఉంటుందని చాలా కాలంగా నా మనస్సులో అనుమానం ఉండేది. అది నిజమేనని ఏక్తా ప్రూవ్ చేసింది అని ట్వీట్ చేసారు. ఇక విద్యాబాలన్,నసీరుద్దీన్ షా కాంబినేషన్ లో వచ్చిన డర్టీ పిక్చర్ మొన్న శుక్రవారం దేశమంతటా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేసారు. సిల్మ్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 21 కోట్ల బడ్జెట్ తో ఏక్తా కపూర్ నిర్మించింది. మిలింద్ లూద్రియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకోలగలిగింది. అలాగే దేశం మొత్తం మీద హిందీ వెర్షన్ కి శుక్రవారం 9.5 కోట్లు,శనివారం 10.7 కోట్లు,ఆదివారం 12.3 కోట్లు వసూలు చేసింది.

ఐదు సినిమాలు ఓకే చేసిన అనూష్క

అనూష్క రీసెంట్ గా ఐదు సినిమాలు ఓకే చేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే అవన్నీ తమిళ చిత్రాలు. అరుంధతి తర్వాత ఆ రేంజి హిట్ ని సాధించలేకపోయిన అనూష్క తమిళంలోనూ సింగం వంటి చిత్రాల ద్వారా తనకంటూ ఓ స్ధానం ఏర్పాటు చేసుకుంది. ఆ మధ్య విడుదలైన వేదం రీమేక్ కూడా అక్కడ వర్కవుట్ కాకపోయినా ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టింది. దాంతో హీరోలంతా ఆమెను తమ ప్రక్కన నటించాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె వరసగా సినిమాలు సైన్ చేసేసింది. ఇప్పటికే కార్తీ సరసన ఆమె సినిమా చేస్తోంది.ఆ తర్వాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆర్య హీరోగా ఒప్పుకున్న చిత్రం పిభ్రవరి నుంచి మొదలు కానుంది. అలాగే విక్రమ్ సరసన మరోసారి తాండవం చిత్రం కమిటైంది. మరో ప్రక్క సూర్య,అజిత్ చిత్రాలుకు ఓకే చేసింది. అవి ఆగస్టులో మొదలవుతాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె నాగార్జున సరసన ఢమురకం చిత్రం మాత్రమే చేస్తోంది. ఆ తర్వాత వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రం ఓకే చేసింది. అయితే ఇంకా ఆ ప్రాజెక్టు కన్ఫర్మ్ కాలేదు. అలాగే ప్రభాస్ సరసన ఆమె వారిధి చిత్రం చేసే అవకాసం ఉంది. 2012 లో ఆమె అస్సలు ఖాళీ లేకుండా తన డైరీని ఫిల్ చేసుకుని మిగతా హీరోయిన్స్ కి షాక్ ఇచ్చింది.

మల్లన్న హుండీల ఆదాయం రూ.కోటి

 శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల్లోని హుండీల ద్వారా నగదు రూపేణా రూ.1,00,21,480 వచ్చినట్లు ఇన్‌చార్జి ఈఓ ధనలక్ష్మి తెలిపారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు హుండీలను లెక్కించామన్నారు. నగదుతో పాటు 84 గ్రాముల బంగారం, ఒక కేజీ 230 గ్రాముల వెండితో పాటు యూఎస్ డాలర్లు 124.. ఐదు యూరోల విదేశీ కరెన్సీ వచ్చాయన్నారు. ఈ మొత్తం 21 రోజుల్లో మల్లన్నకు వచ్చిన ఆదాయమని ఆమె పేర్కొన్నారు. భక్తుల కానుకలు, వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో కోటీశ్వరుడయ్యాడు. మంగళ,బుధవారాలలో రెండు రోజుల పాటు జరిగిన హుండీల లెక్కింపులో రూ. 1,06,28,555లు ఆదాయం చేకూరింది.

కడప జిల్లాకు త్వరలో కేంద్ర కరవు బృందం ...కలెక్టర్

కరవు బృందం జిల్లాలో పర్యటించే ఆస్కారం ఉన్నందున అధికారులు సంబంధిత నివేదికలను రూపొం దించుకుని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వి.అనిల్‌కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ తన కార్యాలయంలోని చాంబర్‌లో కేంద్ర కరవు బృందం జిల్లా పర్యటనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిర్మల, డీఆర్వో హేమసాగర్, సీపీవో గురప్ప, వ్యవసాయశాఖ జేడీ రామస్వామిరెడ్డి, పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ మోహన్‌రావు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర కరవు బృందం పర్యటనకై సీపీవో, జేడీ, అగ్రికల్చర్ జేడీ, అనిమల్ అజ్బెండరీ, డ్వామా పీడీ బృందంగా ఏర్పడి క్షేత్ర పర్యటన జరిపి రూటు మ్యాపును రూపొందించాలన్నారు. మండలాల్లో సాగుభూమి విస్తీర్ణం, పంట నష్టం, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి ఎ ద్దడి, సాగునీటి ఎద్దడి తదితర వివరాలతో పా టు పంటల వారీగా నష్టాలను విశదీకరిస్తూ నివేదికలు రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. కరవు బృందం జిల్లాలో ఏ ప్రాంతలో పర్యటిం చినా అక్కడి వివరాలు తెలపాలన్నారు

ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ

ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ సెల్‌ఫోన్లో చిగు రించింది. చివరికి పోలీస్‌స్టేషన్ చేర్చింది. ఇంతా చేస్తే అమ్మాయి వయసు 14. అబ్బాయి మొహం ఒక్కసారి కూడా చూసిందిలేదు. అయినా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. టెక్నాలజీ కొంపముంచు తుందనడానికి ఇదో ఉదాహరణ.చిత్తూరు పట్టణానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ మెంబర్. ఆమెకు కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఒక యువకుడు నెట్‌లో మూడు నెలల క్రితం పరిచయమయ్యాడు. చాటింగ్ మొదలయ్యింది. ఇద్దరూ నెట్‌లోనూ, సెల్‌ఫోన్లలోనూ గంటల తరబడి మాట్లాడారు. ఈనెల 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 7 వరకు మాట్లాడుతూనే ఉండిపోయారు. మధ్యలో వందలకొద్దీ ప్రేమ సందేశాలు పంపుకున్నారు (ఎస్‌ఎంఎస్). మరుసటి రోజు అమ్మాయి స్కూలుకు వెళ్లలేదు. ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి సెల్ కాల్స్ పరిశీలించిన పోలీసులకు రాజంపేట సమీపంలోని తాళ్లపాక గ్రామానికి చెందిన యువకుడితో ఆమె తరచూ మాట్లాడుతోందని అర్థమైంది. అక్కడికెళ్లి డిగ్రీ చదువుతున్న అబ్బాయిని అదుపులోకి తీసుకుని చిత్తూరు తీసుకువచ్చారు. అమ్మాయిని కూడా కడపలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కడపకు చెందిన మరో అబ్బాయి కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గురువారానికి పూర్తి వివరాలు వెల్లడవుతాయి

మహేంద్ర సింగ్ ధోనీకి మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ధోనీకి మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న మహీ భార్య సాక్షితో కలసి ఇటీవల సొంతూరు రాంచీకి విచ్చేశాడు. ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ధోనీకి భారీ భద్రత కల్పించినట్టు ఆ అధికారి చెప్పారు. రక్షణ చర్యల్లో భాగంగా జార్ఖండ్ ఆర్మ్‌డ్ పోలీసు కమాండోలను నియమించినట్టు తెలిపారు. ధోనీ ఇంటివద్ద సాధారణ దుస్తుల్లో భద్రత సిబ్బంది పహారా కాస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ధోనీ ఎక్కడికి వెళ్లినా అతని వెంట సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.

219 పరుగులతో వీరూ ప్రపంచ రికార్డు

ఇండోర్‌లో భారత క్రికెట్ అభిమానులు ఆనందపారవశ్యంలో తేలియాడారు. ప్రత్యర్థి నుంచి వస్తున్న ఒక్కొక్క బంతిని వీరేంద్ర సేహ్వాగ్ కొడుతుంటే వారి ఆనందానికి అవధులు లేవు. గురువారంనాడు ఇండోర్ స్టేడియంలో పరుగులు వరదలై పారింది. ఇండియా 418 పరుగులతో తన పాత రికార్డును తిరగరాస్తే, సేహ్వాగ్ 219 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వీరూ 25 బౌండరీలు, 7 సిక్సర్‌లతో అభిమానులను అలరించాడు. వీరూ ఔట్ అయినప్పుడు ప్రత్యర్థి అయిన వెస్ట్ ఇండీస్ క్రికెటర్లు ప్రతి ఒక్కరూ సేహ్వాగ్ దగ్గరకు వచ్చి అభినందించి మంచి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. భారత బ్యాట్స్‌మెన్ చెప్పినట్టు ప్రతి బంతి బౌండరీ వైపు పరుగు తీసింది. భారత కెప్టెన్ వీరేంద్ర సేహ్వాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వన్ డే లలో టాప్ ఆర్డర్ ముందే కుప్ప కూలిపోతున్నదని సర్వత్రా విమర్శలు వినవస్తున్న సమయంలో సేహ్వాగ్ కెప్టెన్ అంటే ఇలా ఆడాలి అన్నట్టు ఆడి సునాయాసంగా 219 రికార్డు పరుగులు సాధించాడు. ఒన్ డే క్రికెట్‌లో ఇప్పటివరకూ సచిన్ టెండూల్కర్ పేర అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు ఉంది. ఆ రికార్డును సేహ్వాగ్ తిరగరాశాడు. ఇండియా గతంలో సాదించిన రికార్డు 414 పరుగులు కాగా, ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లు మరో నాలుగు పరుగులు సాధించి ఇండియాకు అత్యధిక పరుగుల రికార్డు సాధించారు. దీంతో ఇండియా మొత్తం నాలుగు సార్లు ఒన్ డేలలో నాలుగు సార్లు 400 పైన పరుగులు సాధించినట్టయ్యింది. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, శ్రీలంక మాత్రమే ఒన్ డే లలో రెండు సార్లు 400 పరుగులు పైన సాధించాయి.