Friday, 2 March 2012

రామ్ గోపాల్ వర్మ వార్నింగ్..!

వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రెడ్డి గారు పోయారు’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు ఈ దర్శకుడు. వర్మ ఈ టైటిల్ ప్రకటించిందే ఆలస్యం....‘రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్’ నుంచి వార్నింగ్ కూడా వచ్చింది. వెంటనే టైటిల్ మార్చాలని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ అభిమానుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మ దిగొచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ ను ‘రెడ్డి గారు పోయారు’అని కాకుండా ‘ఆయన పోయారు’గా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా...టైటిల్ మార్చాలని వచ్చిన హెచ్చరికలపై వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. ‘రెడ్డి గారు పోయారు టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లమో? అర్థం కావడం లేదు. వాళ్ల ప్రాబ్లం రెడ్డి గారు పోలేదనా? లేక రెడ్లెవరూ పోరనా?’’ అని వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరినట్లయింది. అయితే వైఎస్‌ఆర్ అభిమానులు తన బెండు తీస్తారని గ్రహించిన వర్మ టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

విశ్రాంతినివ్వాలని కోరా...వీరేంద్ర సెవాగ్

ఆసియాకప్ నుంచి తనకు విశ్రాంతిని ఇవ్వాల్సిందిగా బోర్డును కోరాననీ, తనను జట్టు నుంచి తప్పించలేదనీ వీరేంద్ర సెవాగ్ స్పష్టం చేశాడు. కోల్‌కతా లోని స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు జట్టు ఫిజియో ఇవాన్ స్పీచ్‌లీ ఒక ఫిట్‌నెస్ నివేదికను సెలెక్టర్లకు పంపాడు. ఆ నివేదికలో సెవాగ్, జహీర్‌లకు విశ్రాంతినివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ ధోనీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ కూడా సెవాగ్ విశ్రాంతిని కోరుకుంటున్నాడని సెలెక్టర్లకు చెప్పారు. దీంతో సెవాగ్‌ను ప్రధాన సెలెక్టర్ శ్రీకాంత్ సంప్రదించాడు. తాను విశ్రాంతి తీసుకుంటాననీ, తాను జట్టులో ఉండాల్సిందేనని సెలెక్టర్లు భావిస్తున్నట్లయితే అందుబాటులో ఉంటాననీ సెవాగ్ అతడికి తెలిపాడు. అందువల్ల సెవాగ్‌కు రెస్ట్ ఇచ్చారు. తాను గాయాన్ని దాచాలని అనుకోవడంలేదని సెవాగ్ ‘మిడ్ డే’ పత్రికతో చెప్పాడు. ‘నేను వెన్ను నొప్పితో బాధ పడుతున్నాను. కొంత విశ్రాంతి అవసరం. ఫిట్‌నెస్ విషయంలో నేనెప్పుడూ జట్టు మేనేజ్‌మెంట్‌ను తప్పుదోవ పట్టించలేదు. ఇది వరకు భుజానికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అప్పటి కోచ్ కిర్‌స్టెన్, కెప్టెన్ ధోనీని సంప్రదించాను’ అని సెవాగ్ పేర్కొన్నాడు. ఫిజియో నివేదికను ఆధారంగా చేసుకునే సెవాగ్‌కు విశ్రాంతినిచ్చారు. అయితే జట్టును ప్రకటించినప్పుడు సెవాగ్ ఫిట్‌నెస్ సమస్య గురించి శ్రీకాంత్ వివరించకపోవమే ఈ గందరగోళానికి కారణమయ్యింది. సెలెక్షన్ కమిటీ సమావేశానికి ముందే సచిన్.. తను ఆసియా కప్‌లో అడాలనుకుంటున్నానని టీం మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. జట్టులో స్థానం దక్కించుకోని సెవాగ్, జహీర్, ఉమేష్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు మాత్రమే శ్రీకాంత్ చెప్పాడు. వారికి అయిన గాయాలేంటో అతడు తెలపలేదు. అయితే జహీర్‌కు చీలమండ గాయమైనందు వల్ల, ఉమేష్ సుదీర్ఘ సిరీస్ ఆడి అలసిపోయినందు వల్ల విశ్రాంతిని ఇచ్చారని తెలుస్తోంది.

జగన్ అరెస్టు విషయంలో రాజకీయాల్లో చర్చ..!

కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. జగన్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న జగన్ అరెస్టుకు కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.  జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి శాసనసభ్యత్వానికి చేసిన రాజీమానామాను ఆమోదిస్తూ, జగన్ వర్గానికి చెందిన పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హులు శాసనసభ స్పీకర్ ప్రకటించనున్నారు. ఈ వారంలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. బహుశా మూడు లేదా నాలుగో తేదీన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని శాసనసభ సచివాలయ వర్గాలు తెలిపాయి. ఆరో తేదీ ప్రాంతంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 3, 4 తేదీల్లో కాని పక్షంలో రాజ్యసభ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాతనైనా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చని భావిస్తున్నారు. ఇక అక్రమ ఆస్తుల వ్యవహారంలో జగన్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను రెండు, మూడు రోజుల్లో సిబిఐ అరెస్టు చేయవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టుకు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు సంకేతంగా అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన వారం పది రోజుల్లో జగన్ అరెస్టు కూడా ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత ఆరు నెలల్లో ఆ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయిన పక్షంలో ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉండదని, అదే విధంగా జగన్ అరెస్టుతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా నైతికంగా కొంత దెబ్బ తినవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలపై పడవచ్చని, కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని అనుకుంటున్నారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఏదో ఒక రోజు సిబిఐ తనను అరెస్టు చేయకతప్పదన్న అభిప్రాయంతో జగన్ కూడా ఉన్నారు. ఇందుకు మానసికంగా ఆయన సిద్ధంగానే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమైనపుడు సిబిఐ తనను అరెస్టు చేయవచ్చన్న అంశాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ‘సిబిఐ నన్ను అరెస్టు చేస్తే పార్టీని అమ్మ చూసుకుంటుంది’ అని జగన్ వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల రానున్న పదిహేను రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ‘ముఖ్యు’లకు కూడా అధిష్ఠానం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ విషయంలో కఠినంగా ఉండాలన్న నిర్ణయంలో భాగంగా ముందుగా ఆయనకు మద్దతు ఇస్తున్న నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామా లోక్‌సభ స్పీకర్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో జగన్‌కు మద్దతు ఇస్తున్న పదిహేడు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వారంలోనే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి.



  

Thursday, 1 March 2012

రెండోసారి కీమోథెరపీ చేయించుకున్న ...యువరాజ్‌సింగ్

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న క్రికెటర్ యువరాజ్‌సింగ్ రెండోసారి కిమోథెరపీ చేయించుకున్నారు. అమెరికాలోని బోస్టన్‌తో చికిత్స పొందుతున్న యూవీ మెల్లమెల్లగా క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాడు. తాను రెండో సారి కీమోథెరిపి చేయించుకున్నట్లు యువరాజ్‌ ట్విటర్‌లో తెలిపాడు. చికిత్సలో భాగంగా మళ్లీ స్కానింగ్‌ ఈనెల ఏడో తేదీన ఉన్నట్లు యువీ ట్విటర్‌లో చెప్పారు.ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువీ ట్యూమర్‌ తగ్గుతోందన్నాడు. గత నెల రోజుల నుంచి బోస్టన్‌లోనే ఉంటున్న యువరాజ్‌ మే మొదటి వారంలో మళ్లీ బ్యాట్‌ పట్టే అవకాశాలున్నాయి. జనవరిలో చికిత్సలో భాగంగా యువీ గుండు చేయించుకున్నాడు. ఈనెల మొత్తం యువీ చికిత్స తీసుకోనున్నాడు. వచ్చే నెల నుంచి రిహాబిలిటేషన్‌ మొదలవుతుంది.

నేటి నుంచి అనంతపురం జిల్లాలో చెరువు పోరు బాట

'నీరు లేనిదే మనిషికి మనుగడ లే దు... నీటి వనరులున్న చోట నాగరికత ఉంటుంది. జిల్లాలో సాగునీటి సౌకర్యాలు పెద్దగా అందుబాటులో లేనందున చెరువులను అభివృద్ధి చేయడం ద్వారానే కరువు కోరల నుంచి రైతన్నలకు విముక్తి లభిస్తుంది. అందుకే 'చెరువు బాట' ప్రతి ఒక్కరికీ బతుకు బాట కావాలనే ఆకాంక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నామ'ని రాయలసీమ వికాస సాధన సమితి అధ్యక్షుడు, సీనీనటుడు నరేష్ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం నుంచి 'చెరువుబాట' పేరుతో ఆయన రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భా న్ని పురస్కరించుకుని  మార్చి 1 న అనంతపురంలో రథయాత్రను ప్రారంభించి ఆరు రోజుల్లో 36 మండలాల మీదుగా 800 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ప్రజలను చైతన్య పరచనున్న ట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, కళాకారు లను భా గస్వాములను చేయనున్నట్లు తెలిపారు. యాత్ర ద్వారా ప్రతి చెరువు చరిత్రా తెలు సుకోవాలని ఆశిస్తున్నామన్నారు. యాత్రకు జాతీయ స్థా యిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మెగసెసే అవార్డు గ్రహీ త, వాటర్‌మన్ ఆఫ్ ఇండియాగా పే రొందిన రాజస్థాన్ కు చెందిన రాజేంద్రసింగ్‌ను ఆహ్వానించామన్నారు. ఇక్కడి చెరువుల అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామన్నారు.చెరువుల అభివృద్ధి కోసమే రాయలసీమ వికాస సాధన సమితి దేశంలోనే కరువు జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురం నుంచి ప్రా రంభించి రాయలసీమ వ్యాప్తంగా ఉండే చెరువులను అభివృద్ధి పరిచేందుకు అంచెలంచెలుగా పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ వికాస సాధన సమితి ఏర్పాటు చేసినట్లు నరేష్ వెల్లడించారు.
 
 


 



 
   

జగన్ సిఎంగా ఉంటే బాగుండేది ...డిఎల్ రవీంద్రా రెడ్డి

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు మదనపడుతున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒరిగిందేమీ లేదని అనుకుంటున్నారని ఆయన అన్నారు.మూడు నెలల్లో ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. వారం రోజుల్లో 130 పిహెచ్‌సిలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని కానీ మందుల కొరత మాత్రం లేదని చెప్పారు. మందులు అన్ని ఆసుపత్రులలో దొరుకుతున్నాయని చెప్పారు. 
 

Wednesday, 29 February 2012

కెసిఆర్‌కు పోటీ సభ పెడతా... టిజి వెంకటేష్

ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అయితే పార్టీ నేతలు వద్దని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వస్తే తాను కాంగ్రెసు తరఫున ప్రచారం చేసేందుకు వెళతానని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు. కెసిఆర్ కొవూరులో ప్రచారం చేస్తే అదే సమయంలో నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ప్రత్యేక వాదం వినిపిస్తే తాను సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు. ఆయనపై ఎవరూ దాడి చేయకుండా చూస్తానని చెప్పారు. కెసిఆర్ అక్కడ ఏర్పాటు చేసే సభకు ఎక్కువ జనం వస్తే రావొచ్చునని.. అడవి మనుషులను చూసేందుకు కూడా జనం అధికంగా వస్తారని విమర్శించారు.