Sunday, 30 October 2011

‘దమ్ము’ చిత్రంలో ఎన్టీఆర్, త్రిష

                                   
‘దమ్ము’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన త్రిష నటించటం దాదాపు ఖరారైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ కనిపిస్తారు. మాకందిన అధికారిక సమాచారం ప్రకారం శుక్రవారం నుంచి త్రిష షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ పై ఓ పాట షూట్ చేయనున్నారు. యంగ్ టైగర్ సరసన త్రిష తొలిసారి జతకడుతోంది. కాగా, కార్తీక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించటం ఖాయమైంది

త్వరలోనే చరణ్, అర్జున్ సినిమా


మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్నకాంబినేషన్ సాకారం కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి పైడిపల్లి వంశీ దర్శకత్వం వహిస్తారు. నిర్మాత దిల్ రాజు
                            .
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రం లో మెయిన్ హీరోగా నటించబోతున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోలూ ఈ సినిమా లో నటిస్తున్నప్పటికీ, వీరిరువురూ ఒకే సారి తెరపై కనిపించరు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక కీలక మైన పాత్రను అల్లు అర్జున్ పోషించబోతున్నారని సమాచారం.
మొత్తానికి ఈ వార్త చరణ్, అర్జున్ అభిమానులిద్దరికీ ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరుంటారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మూవీకి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు

                             
కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకువచ్చిన ఆయన ప్రభుత్వాస్పత్రి, వివాదాస్పద మిస్సమ్మ కాంపౌండ్ స్థలాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది తాము అడిగిన దానికంటే ఎక్కువగానే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నప్పటికీ...ఆచరణలో మాత్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్భాటంగా కరువు మండలాలను ప్రకటించడం... ఆ తర్వాత చేతులెత్తేయడం రివాజుగా మా రుతోందని విమర్శించారు. పక్షం రోజుల్లో కరువు మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించి సాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టడమే కాకుండా... ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఆదివారం ప్రసారం చేసింది. అనుమతులకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వ భవనంలో ఉంటున్నారని, అందుకు ఆయన మూడు లక్షల రూపాయలు కేంద్రానికి బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు మాత్రమే కేటాయించే భవనాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం వైయస్ జగన్‌కు కేటాయించింది. కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఆ భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకుగాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. 

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెసు నేత జి. వెంకటస్వామి కూడా తనకు గతంలో కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకు గాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి రూ. 30 లక్షలు బాకీ పడ్డారని ఆ తెలుగు టీవీ చానెల్ తెలిపింది. ఇదిలా వుంటే, వార్త దినపత్రిక అధిపతి, మాజీ పార్లమెంటు సభ్యుడు గిరీష్ సంఘీ కూడా అనుమతులకు విరుద్ధంగా ఓ భవనంలో ఉన్నారని చెప్పింది. అయితే, ఆయన చెల్లించాల్సిన బాకీ ఏమీ లేదని తెలుస్తోంది

రాఘవేంద్ర తీర్థ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు

 కాశీ మఠం సంస్థానం శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ మాజీ శిష్యుడు, ఆయన వారసుడిగా తృణీకరణకు గురైన రాఘవేంద్ర తీర్థ స్వామీజీని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కడపలోని ఇందిరానగర్‌లో గల ఫ్లాట్‌లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లాట్‌లో కొన్ని చీకటి పనులు జరుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని ఇందిరా నగర్‌లోని ఆయన ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందుకు వచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 20 విగ్రహాలను, రూ.8.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 

కాశీ మఠానికి చెందిన విగ్రహాలను, చరాస్థులను, ఇతరాలను వెంటనే సుధీంద్ర తీర్థ స్వామీజీకి అప్పగించాలని ఇంతకు ముందు తిరుపతి కోర్టు ఆదేశించింది. దాంతో రాఘవేంద్ర హైకోర్టుకు వెళ్లాడు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. తాను మతపరమైన పర్యటనలో ఉన్నానంటూ వాటిని అప్పగించేందుకు రాఘవేంద్ర తీర్థ నిరాకరించారు. అక్టోబర్ 12వ తేదీన ఇందిరానగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఓ ల్యాప్‌టాప్‌ను, 600 ఏళ్లనాటి లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని, కొన్ని పంచలోహ విగ్రహాలను, పులి గోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా రాఘవేంద్ర తీర్థ స్వామీజీపై కేసులున్నాయి

సీమాంధ్రలో తెలంగాణ విద్యార్థి జెఎసికి స్వాగతం!

పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు వస్తున్న తెలంగాణ విద్యార్థి జెఎసిని స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. శనివారం ఎయు లా కాలేజీలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి జెఎసి సభ్యులు వస్తున్న బస్సును పోలీసులు అడ్డుకోనవసరం లేదని అన్నారు. తెలంగాణ విద్యార్థులు పోలవరంతోపాటు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఇచ్చిన విధంగా వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్రల్లో కూడా పర్యటించాలని కిషోర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనంపై కూడా సమైక్యాంధ్ర జెఎసి యాత్రను చేపడుతుందని ఆయన అన్నారు. దీనివలన ఇరు ప్రాంతాల వారికి ఉన్న అపోహలు తొలగిపోతాయని కిషోర్ అన్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకుండా వచ్చే నెలలో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని పరస్పరం చర్చించుకుని, వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు ప్రభుత్వాలపై వత్తిడి తెద్దామని హితవు పలికారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్‌పై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ జరపాలని కిషోర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జాబ్ మేళాకు హాజరైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజుకు సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి వినతి పత్రం ఇచ్చింది

చిత్తూరు జిల్లాలో 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది

ఖరీఫ్ సీజన్‌లో తగినంత వర్షాలు లేక జిల్లాలో అత్యధిక మండలాలు కరవు కోరల్లో చిక్కుకుని సతమతమవుతుండగా, ప్రభుత్వం మాత్రం 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌లో మైనస్ 17 శాతం నుంచి- మైనస్ 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా యంత్రాంగం 14 మండలాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వాని కి నివేదిక పంపించింది.

చౌడేపల్లె, వాల్మీకిపురం, కేవీపల్లె, గుడుపల్లె, పుంగనూరు, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, సోమల, కలకడ, కురబలకోట, తిరుపతి రూరల్, ఎర్రావారి పాళెం, రామసముద్రం మండలాలను అధికారులు ప్రతిపాదించగా, శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం రామసముద్రం మండలాన్ని మాత్రం మినహాయించి మిగిలిన 13 మండలా లను కరువు ప్రాంతంగా ప్రకటించింది.

వాస్తవానికి వర్షపాతం, పంటల విస్తీర్ణం, తెగుళ్ళు, పంటల దిగుబడి తదితర అంశాల ప్రాతిపదికన చూస్తే జిల్లాలో 49 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. పొరుగునే వున్న అనంతపురం జిల్లాలో అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇంచుమించు 50 మండలాల్లో కరువు పరిస్థితులు తలెత్తినప్పటికీ కేవలం వర్షాభావాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని 13 మండలాలకే ప్రకటనను పరిమితం చేశారు