Sunday, 4 March 2012

జగన్‌ అరెస్ట్ పై పుకార్లు

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అయినా కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ‘ఆధారాలు లేకపోయినా జగన్‌మోహన్ రెడ్డిని సీబీఐ తాకితే... ఆయనపై ఒక్క చేయి పడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి...’ అని గట్టిగా హెచ్చరించారు. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్‌ను ఒక సోదరుడుగా భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్‌ను తమ మనవడిగా చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్‌పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’ అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్‌నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు. 

  

జగన్ ఇంటి ముందు అర్ధరాత్రి అలజడి

హైదరాబాద్‌లో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి నివాసం. శనివారం రాత్రి తొమ్మిది గంటలు.. సుమారు 40 మంది అక్కడికి చేరుకున్నారు. గంటలు గడుస్తున్నాయి. వస్తున్న జనం సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట అయ్యేసరికి అక్కడికి దాదాపు 600 మంది వరకు చేరుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం వారికి అందడమే ఈ హడావుడికి కారణమని తెలిసింది. జగన్ ఇంటికి చేరుకున్న మద్దతుదారులు హల్‌చల్ సృష్టించారు. జగన్ ఇంటికి చేరుకునే నాలుగు దారుల్లోనూ రాకపోకలను అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాహనాలనే బ్యారికేడ్లుగా మార్చి రోడ్డుకు అడ్డంగా నిలబెట్టారు. ఆ మార్గంలోని వీధిలైట్లను ఆర్పేశారు. మరోవైపు, జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల, ఆయన ఇంటి వద్దకు చేరుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Saturday, 3 March 2012

కడప జిల్లా ఫ్యాక్షన్ అదుపులో ఉంది....జిల్లా ఎస్పీ

జిల్లాలో ఫ్యాక్షన్ అదుపులో ఉందని ఎస్పీ సుందర్‌కుమార్ దాస్ పేర్కొన్నారు. మండలంలోని ఫ్యాక్షన్ గ్రామంగా ముద్ర పడిన గండి కొవ్వూరు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ అదుపులో ఉందని, అరకొరగా జరిగిన సంఘటనలు ఫ్యాక్షన్ గ్రామాల్లో కాకుండా బయట జరిగాయన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఫ్యాక్షన్‌పై పోలీసులు డేగ కన్ను వేసినట్లు తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ అదుపులో పెట్టామన్నారు. ముఖ్యంగా గండి కొవ్వూరు గ్రామంలో 1920 సంవత్సరం నుండి ఫ్యాక్షన్ కొనసాగిందని, గత రెండు దశాబ్ధాల క్రితం నుంచి గ్రామంలోని ఇరువర్గాల మధ్య ఐక్యత ఏర్పడిందన్నారు. పూర్తిగా తగ్గిపోయిందనే సందర్భంలో బయట ప్రాంతంలో ఒకదాని తర్వాత మరొకటి రెండు సంఘటనలు చోటు చేసుకుని వర్గ పోరాటాలకు ఇరువురు బలయ్యారన్నారు. అప్పటి నుండి దాదాపు రెండేళ్లుగా గండి కొవ్వూరు గ్రామంలో పోలీసుల ఫికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజల్లో భయాన్ని తొలగించి ప్రశాంతతను నెలకొల్పామన్నారు. అలాగే కోర్టులకు ముద్దాయిలుగా వెళ్తున్న ఫ్యాక్షన్ గ్రామస్థులకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లాలో వారానికి ఒక్కరోజున ఫ్యాక్షనిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి వారిలో కొంత మార్పును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట పులివెందుల డిఎఎస్పీ జయచంద్ర, లక్కిరెడ్డిపల్లె సిఐ సుధాకర్, ఎస్‌బిసిఐ సువర్ణ, చక్రాయపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  
 

పుట్టపర్తిలో4 కోట్లతో మ్యూజియం

ప్రపంచంలోని ప్రతి నిరుపేద భక్తునికి భగవంతుని సందేశం వినిపించడం ధ్యానం యోగా ద్వారా మానసిక ప్రశాంతతను కలుగ జేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ డైరక్టర్ రతన్‌జీ తెలిపారు.  గోకులంలో గల వారి కార్యాలంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలున్నా, విదేశాలకు లండన్ ప్రధాన కేంద్రంగా భారత్‌లో వౌంట్ అబు కేంద్రంగా పని చేస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8500 సేవా కేంద్రాలు వున్నాయని, భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహుర్తంలో రోజు 10 లక్షల మంది ధ్యానం చేస్తారని, ప్రతి మూడవ ఆదివారం సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల మధ్య విశ్వశాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతినికి కాంక్షించే సంస్థగా ఐక్యరాజ్య సమితి తల ట్రస్టుకు ఐదు శాంతిదూత అవార్డులను ప్రధానం చేసిందన్నారు. నైతిక విలువలతో కూడిన బోధనలు, మారసిక ప్రశాంతత చేకూరడం, దుర అలవాట్లకు గురైన వారిని సన్మార్గంలో మార్చడం యోగా ద్వారా సాధ్యమన్నారు. పుట్టపర్తిలో ఐదు ఎకరాల్లో 81 అడుగుల ఎత్తుతో లింగాకృతిలో సుమారు 5 కోట్ల వ్యయంతో మ్యూజియంను నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. ఇందులో ఆడిటోరియం, ధ్యాన మందిరం వసతి గృహాలు వుంటాయన్నారు. ప్రతి మతం వారు భగవంతుడు ఒక్కడే అని నమ్ముతున్నారని, అయితే ఆ భగవంతుడు ఎవరనేది తెలుసుకోలేక పోతున్నారని, రాజయోగం ద్వారా పరమాత్తుని గురించి తెలుసుకోవచ్చన్నారు.

త్వరలో కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ....టిజి వెంకటేష్

ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని మంత్రి టిజి వెంకటేష్ విమర్శించారు. ఆంధ్రలో చిచ్చు పెట్టేందుకే ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు శానససభా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తానని కెసిఆర్ చెబుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులపై స్పీకర్ వేటు వేస్తూ సరైన నిర్ణయమే తీసుకున్నారని, వేటు బాధాకరమే అయినప్పటికీ అది సరైన నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన అన్నారు.

దగ్గుబాటి రాణాతో రామ్ గోపాల్ వర్మ సినిమా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించారు. దగ్గుబాటి రాణా-నతాలియా జంటగా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందనుందని, అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో రూపొందిస్తున్న ‘డిపార్ట్‌మెంట్’ చిత్రంలో బ్రెజిల్ భామ నతాలియా ఐటం సాంగులో నటిస్తోంది. ఇంతకు ముందు వర్మ నతాలియా అందచందాల గురించి తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. నతాలియా లాంటి అందాన్ని నేను నా సినీ కెరీర్లో ఇదివరకెప్పుడూ చూడలేదని, ఆమె అందం చూసి పిచ్చిక్కిపోతోందని......హింసాత్మక ఘటన నేపథ్యంలో రక్తచరిత్ర సినిమా రూపొందించినట్లుగా, ఆమె ‘అందం’ గురించి అంతా చర్చించుకునేట్లుగా ఓ సినిమా తీయనున్నట్లు కూడా ప్రకటించారు వర్మ. మరి ఈ సినిమా...రాణా-నతాలియా జంటగా తీయబోయే సినిమా ఒకటేనా? అనేది తేలాల్సి ఉంది. వర్మ ఇప్పటి వరకు బోలెడు కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఆచరణ వరకు వచ్చినవి చాలా తక్కవ. మరి ఈ సినిమాల సంగతేమిటో కాలమే నిర్ణయించాలి.

తిరుపతి దేవస్థానంకు భారీ బడ్జెట్

2010 కోట్ల రూపాయలతో టిటిడి బడ్జెట్ ని ఆమోదించారు. ఈరోజు జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో దీనిని ఆమోదించారు. దేశంలోని దేవాలయాల చరిత్రలో ఇదే భారీ బడ్జెట్ . భక్తుల కోసం తిరుపతిలో కాటేజీలు నిర్మించాలని నిర్ణయించారు. తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం దేవాలయాలకు పెద్దపీట వేశారు. కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో ఆలయం, కల్యాణమండపం నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరున 'నిత్యకల్యాణం' ప్రారంభిస్తారు. టిటిడి విద్యాసంస్థలలో పని చేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది 150 శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తారు. మహాద్వారం వైపు నుంచి వయోవృద్ధులతోపాటు మరొకరిని అనుమతించాలన్న ప్రతిపాదనని ఆమోదించారు. గత ఏడాది హుండీ ఆదాయం 730 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 800 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని అంచనావేశారు.
బడ్జెట్ లో వివిధ విభాగాలకు కేటాయించిన నిధులు ఈ విధంగా ఉన్నాయి. 

 

హిందూ ధర్మప్రచారానికి 106 కోట్ల రూపాయలు
ఆరోగ్యం కోసం 58.43 కోట్ల రూపాయలు
ఆస్పత్రి కోసం 22.04 కోట్ల రూపాయలు
పెన్షన్ పథకానికి 50 కోట్ల రూపాయలు
విద్యాసంస్థలకు 65 కోట్ల రూపాయలు
ఇంజనీరింగ్ విభాగానికి 149 కోట్ల రూపాయలు
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి 39.63 కోట్ల రూపాయలు