Showing posts with label కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి. Show all posts
Showing posts with label కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి. Show all posts

Sunday, 4 March 2012

జగన్‌ అరెస్ట్ పై పుకార్లు

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అయినా కాంగ్రెస్, టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ‘ఆధారాలు లేకపోయినా జగన్‌మోహన్ రెడ్డిని సీబీఐ తాకితే... ఆయనపై ఒక్క చేయి పడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి...’ అని గట్టిగా హెచ్చరించారు. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్థరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ కోవూరు ఎన్నికల ప్రచారం ఒక రోజు మాత్రమే కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిందనీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు యథావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారనీ స్పష్టం చేశారు. ‘జగన్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మల ఏకైక పుత్రుడే కాదు...ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆయనను తమ కుమారుడుగా భావిస్తున్నారు...ప్రతి చెల్లి, ప్రతి అక్క జగన్‌ను ఒక సోదరుడుగా భావిస్తోంది...ప్రతి అవ్వ, ప్రతి తాత జగన్‌ను తమ మనవడిగా చూసుకుంటున్నారు...సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను....సీబీఐ...! జగన్‌పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి...’ అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ఏ ఆధారాలు లేక పోయినా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయనను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో...చూస్తారు’ అని అంబటి అల్టిమేటమ్ జారీ చేశారు. జగన్‌నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై చేయి పడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారని ఆయన అన్నారు. 

  

జగన్ ఇంటి ముందు అర్ధరాత్రి అలజడి

హైదరాబాద్‌లో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి నివాసం. శనివారం రాత్రి తొమ్మిది గంటలు.. సుమారు 40 మంది అక్కడికి చేరుకున్నారు. గంటలు గడుస్తున్నాయి. వస్తున్న జనం సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట అయ్యేసరికి అక్కడికి దాదాపు 600 మంది వరకు చేరుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారం వారికి అందడమే ఈ హడావుడికి కారణమని తెలిసింది. జగన్ ఇంటికి చేరుకున్న మద్దతుదారులు హల్‌చల్ సృష్టించారు. జగన్ ఇంటికి చేరుకునే నాలుగు దారుల్లోనూ రాకపోకలను అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాహనాలనే బ్యారికేడ్లుగా మార్చి రోడ్డుకు అడ్డంగా నిలబెట్టారు. ఆ మార్గంలోని వీధిలైట్లను ఆర్పేశారు. మరోవైపు, జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల, ఆయన ఇంటి వద్దకు చేరుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Wednesday, 4 January 2012

తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ...వైయస్ జగన్మోహన్ రెడ్డి

తనను నేరస్థుడిగా చూపించేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు తనపై రాజకీయ కక్ష సాధిస్తోందన్నారు. పార్టీ వదిలి పెట్టాకనే తనపై సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెసు ఆలోచనలను సిబిఐ అమలు పరుస్తోందన్నారు. తనను నేరస్థుడిగా చూపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన సాక్షిలో పెట్టుబడులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.

అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు...కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్స్‌పై అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో ఆరోపించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ చదవుకోవాలని, కానీ ప్రభుత్వం మాత్రం రీయింబర్సుమెంట్స్ చెల్లించడం లేదన్నారు. కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత చదువులు చదివితేనే పేదరికం పోతుందన్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య కళాశాలలకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారని ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడైనా వారిని కలిశారా అని ప్రశ్నించారు.బాబు పేదల కోసమో, రైతుల కోసమో అవిశ్వాసం పెట్టలేదన్నారు. తమ వర్గం ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెట్టడానికే పెట్టారన్నారు. ప్రభుత్వం పడిపోదని తెలిసినా తన వర్గం ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి విలువల కోసం ఓటు వేశారన్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాంగ్రెసు ప్రతిపక్షాలను వదిలేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.