Tuesday, 6 December 2011

నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి

హైదరాబాద్ నిమ్స్ సెగలు కడప రిమ్స్‌ను కూడా తాకాయి. నిమ్స్‌లో ఖైదీలకు వైద్యంపై జరిగిన కుంభకోణం లాంటిదే కడప రిమ్స్‌లోనూ చోటుచేసుకుంది. దీంతో విచారణ జరిపిన సర్కార్, రిమ్స్ ఆర్ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం కడపలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విచారణలో ఉన్న ఖైదీలకు ఎలాంటి అనారోగ్యం లేకున్నా వైద్యం కోసం కడప రిమ్స్‌లో చేర్చుకున్నారు. అలాగే వారిని హైదరాబాద్ నిమ్స్‌కు రెఫర్ చేశారు. చాపాడు మండలం శెట్టిపల్లికి చెందిన జయరాం రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఓ మర్డర్ కేసులో నిందితులు. విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని కడప రిమ్స్‌లో చేర్చుకోవడమే గాకుండా మరింత వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనలో నిమ్స్ వైద్యులు సస్పెండ్ కాగా, కడపలో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఆర్‌ఎంఓ, సూపర్నెంట్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ వైద్యుల సస్పెన్షన్‌తో డాక్టర్ల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రలోభాలకు లోబడి చికిత్సలకు రిఫర్ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.

శ్రీవారికి బంగారు కత్తిని బహుకరణ

తిరుమల శ్రీవేంకటేశ్వరునికి రెండు వేల సంవత్సరాల తర్వాత ఓ బంగారు కత్తిని బహుకరించారు. పీఠాధిపతి త్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ శ్రీవారికి యజ్ఞాయాగాదులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కానుకలతో స్వామివారికి సూర్య ఖఠారిని బహుకరించారు. తిరుమల శ్రీవారికి బీమవరం మఠాధిపతి శ్రీత్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ స్వామి 75 లక్షలు విలువ చేసే బంగారు కత్తిని బహుకరించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ కటాక్షయజ్ఞం నిర్వహించగా వచ్చిన కానుకలతో శ్రీవేంకటేశ్వరునికి బంగారు కత్తిని తయారు చేయించి ఇచ్చారు. నిన్న రాత్రి ఆలయంలో తోమలసేవ కార్యక్రమంలో స్వామి వారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి బహుకరించిన కత్తికి ప్రత్యేక పూజలు చేసారు. అటు తర్వాత భక్తులు, టీటీడీ చైర్మెన్ బాపిరాజు, పూజారులు పూజలందుకున్నారు. స్వామి వారికి బహుకరించిన కత్తిని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. వచ్చే శుక్రవారం జరిగే అభిషేకం అనంతరం శ్రీవారికి అలంకరించాలని టీటీడీ అధికారులను పీఠాధిపతి కోరారు. ఆయన వినతిని టీటీడీ అధికారులు అంగీకరించారు. వాయిస్. రెండు వేల సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్నకు మొదటి సారిగా అప్పటి రాజులు బహుకరించారు. తిరిగి స్వామి వారికి సూర్య కఠారిని బహుకరించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై చర్యలు...చిరంజీవి

పార్టీ విప్ ధిక్కరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మంగళవారం చెప్పారు. ఆయన పిఆర్పీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం స్పీకర్‌ను కలిసి విప్ ధక్కరించిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు తన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. స్వార్థానికి అతీతంగా ప్రజల పక్షాన మేం నిలబడతామని చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సంతోషంగా ఉందన్నారు.ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, అవినీతి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఏం చేసినా తప్పు కాదన్నారు. సిఎం పాలనపై తమకు విశ్వాసం ఉందన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభాలకు గురి చేశారని కానీ అవి సఫలం కాలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని విమర్శించారు. పడగొట్టి కుర్చీ ఎక్కాలనుకున్న వారి కోరికను మేం నెరవేరకుండా చేశామన్నారు. నిన్నటి అవిశ్వాసం ఘటన విపక్షాలకు చెంపపెట్టు అన్నారు.

అంతా మా ఇష్టం..!

అధికారం ఉండగానే అందినంత దండుకోవాలన్నది వారి లక్ష్యం..! అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్రమార్జనలో చెలరేగుతున్నారు.. వారి దెబ్బకు అధికారులు హడలెత్తిపోతున్నారు. ఒత్తిళ్లకు తాళలేక.. మాటలు పడలేక మనస్థాపం చెందిన అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. తాజాగా రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ పి.వెంకటరమణారెడ్డి మూడు నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇదే శాఖకు చెందిన మరో ఇద్దరు డీఈలు కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు.

‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో ఆదర్శరైతులకు ఉచితంగా సిమ్‌కార్డులు

ప్రముఖ ఎరువుల కంపెనీ ‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదర్శరైతులకు ఉచితంగా సిమ్‌కార్డులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా  మధ్యాహ్నం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీఏ కె.సాంబశివరావు కొంతమంది ఆదర్శరైతులకు గ్రీన్‌కార్డు పేరిట ఎయిర్‌టెల్ సిమ్‌కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి గ్రీన్‌కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఇఫ్కో జిల్లా ప్రతినిధి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ మొదటివిడత మండలానికి ఐదుగురు ఆదర్శరైతుల చొప్పున 273 మందికి గ్రీన్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. దశల వారీగా అందరికీ పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయం, 16 అనుబంధ రంగాలకు సంబంధించి రోజూ ఐదు వాయిస్ మెసేజ్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 534351 అనే హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవి, ఇఫ్కో ప్రతినిధులు సతీష్‌కుమార్, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

అనర్హత వేటు వేయండి...ఉప ఎన్నికలకు సిద్ధం ...వైఎస్ జగన్‌

అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటన అని వైఎస్ఆర్ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తొలి సారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు పోతాయని తెలిసినా ప్రజల పక్షాన నిలబడిన తన ఎమ్మెల్యేలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో అవిశ్వాసానికి మద్దతు తెలిపామని ఆయన పేర్కొన్నారు. అసలు అసెంబ్లీలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టారా లేక రైతు సమస్యలపై పెట్టారా అని అనుమానం వచ్చిందని జగన్ అన్నారు. దివంగత నేతను తిట్టేందుకే చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారని, తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు రెచ్చగొట్టారని విమర్శించారు.

జగన్ బలం ఎంతో తేలిపోయింది... మంత్రి శైలజానాథ్

అవిశ్వాసంలో ఓడిపోయామన్న బాధలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ బలం ఎంతో నిన్నటి అవిశ్వాసంలో తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి శైలజానాథ్ తెలిపారు.