Monday, 30 January 2012

కాణిపాకం ఆలయ హుండీలో వాచ్ కలకలం

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆవరణలోని హుండీలో బాంబు ఉందని సోమవారం కలకలం రేగింది. నాలుగు గంటల ఉత్కంఠ అనంతరం ఎలక్ట్రానిక్ రిస్ట్‌వాచ్ అని తేలడంతో గ్రామస్థులు, అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.కాణిపాక వరసిద్ధి ఆలయ ఆవరణలో సోమవారం వేకువజామున ఉన్నట్లుండి టైమ్ బాంబుకు సంబంధించిన బీప్ శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆలయ హోంగార్డులు క్షుణ్ణంగా పరిశీలించగా ప్రధాన ఆలయ గర్భగుడి పక్కనే ఉన్న అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన హుండీ నుంచి ఈ శబ్దం వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఉలిక్కిపడ్డ అధికారులందరూ హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని హుండీని పరిశీలించి, బాంబు స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. శబ్దం వస్తున్న హుండీ స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లకు ఆనుకుని ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించలేదు. నిబంధనల మేరకు తాళాలు చిత్తూరు ఏసీ కార్యాలయంలో ఉండటంతో హుండీ తెరవడానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.తాళాలు వచ్చిన తర్వాత బాంబుస్క్వాడ్ సిబ్బంది సురేష్ ద్వారా హుండీని నెమ్మదిగా తెరిపించారు. అందులో ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ కనపడటంతో ఆలయాధికారులు, భక్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది.

సిబిఐ వెనుక రాజకీయ కుట్ర...విజయమ్మ

సిబిఐ దర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు ఆమె ఒక లేఖ రాశారు. మే 2009కి ముందు ఏ రాజకీయ హొదా లేని జగన్మోహన రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. సిబిఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలిపెట్టి, వైఎస్ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోందని తెలిపారు. జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాక్షులను సిబిఐ బెదిరిస్తోందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హొం ఎండి రంగారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. అతనిని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమఆరోపించారు.రంగారావుకు బెయిలు ఇవ్వడంలో సిబిఐ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని స్పష్టమైందన్నారు. నిధులు దుబాయ్ కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపైన ఏవిధమైన చర్యలు లేవని తెలిపారు.అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చానని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వారిని విచారించకుండా, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే వేధిస్తున్నారని ఆ లేఖలో ప్రధానికి విజయమ్మ తెలిపారు. సిబిఐకి ఆధారాలు దొరక్కపోవడంతో విజయసాయి రెడ్డి అనుమతి లేకుండా నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయించి, తప్పుడు నివేదిక సృష్టించారన్నారు.

Sunday, 29 January 2012

హార్బజన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్...హార్బజన్ సింగ్

ఇండియా ఆఫ్ స్పిన్నర్ హార్బజన్ సింగ్ తన తోటి క్రికెటర్స్ యువరాజ్ సింగ్, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని క్రికెట్ అకాడమీని నెలకొల్పడంలో ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా 'జలంధర్' లో ఆదివారం తన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాడు. జలంధర్‌కు అతి సమీపంలో ఉన్న సురనుస్సీ‌లో మొత్తం పది ఎకరాల స్దలంలో 'హార్బజన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్' అనే పేరుతో ఈ అకాడమీని నిర్మిస్తున్నాడు. వచ్చే సంవత్సరం చివరి కల్లా ఈ అకాడమీ పూర్తిగా వినియోగంలోకి రానున్నదని తెలిపాడు. ఈ సందర్బంలో ఆస్టేలియా టూర్‌లో పరాజయం పాలైన టీమిండియా గురించి భజ్జీ మాట్లాడుతూ.. టీమిండియా త్వరలోనే పుంజుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని సిరిస్‌లలో ఇలాంటి ఓటములు సహాజంగా జరుగుతాయని దీని గురించి బాధ పడాల్సిన అవసరం లేదన్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని అగ్రశ్రేణి జట్టులను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామని, త్వరలోనే టీమిండియా తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

రేపు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

22 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఒకవేళ సోమవారం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడని పక్షంలో ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,139 పోస్టులు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఎ) కింద 9,569 పోస్టులు, మునిసిపాలిటీల్లోని 1,600 పోస్టులు, ఉర్దూ మీడియం నుంచి డీ రిజర్వు అయిన 314 పోస్టులు నోటిఫై చేస్తున్నారు. అయితే.. డీఎస్సీ-2008లో సెలెక్ట్ అయి హామీ పత్రాలు పొందిన అభ్యర్థులకు దాదాపు వెయ్యి పోస్టులు ఇవ్వటంతో.. ఆ మేరకు ఖాళీల సంఖ్య తగ్గనుంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ పోస్టులు ఉంటాయి. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద మంజూరైన 38వేల టీచర్ పోస్టులను ఈ డీఎస్సీలో నోటిఫై చేసే అవకాశం లేదు. వాటికోసం కొద్ది నెలల్లో మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఏపీటెట్-2012  విడుదల
 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీటెట్-2012) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ నెల 8న టెట్-2012 జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 81,957 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,584 మంది (67.82%) పరీక్ష రాశారు. పేపర్-2కు మొత్తం 4,15,137 మంది (1,99,710 మంది మేథ్స్ అండ్ సైన్స్, 2,15,427 మంది సోషల్ స్టడీస్ ) దరఖాస్తు చేసుకోగా.. 4,02,083 (96.86%) మంది హాజరయ్యారు. ఈ సారి పేపర్-1కు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులైనందున దరఖాస్తులు, పరీక్ష రాసినవారి శాతం బాగా తగ్గాయి. తొలి టెట్‌తో పోలిస్తే పేపర్-2కు దరఖాస్తుల సంఖ్య, హాజరుశాతం పెరిగాయి.

Saturday, 28 January 2012

తెలుగుదేశంలో నేనూ జూ. ఎన్టీఆర్...హరికృష్ణ

. పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.తాను తెలుగుదేశం పార్టీని వదిలివెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీడీపీని వదిలే ప్రసక్తే లేదని, తన ఒంటిలో ఉన్నది ఎన్టీఆర్ రక్తమని, తమ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోనే కొనసాగుతారని హరికృష్ణ స్పష్టం చేశారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసాన్ని ఆయన ఖండించారు. సుస్థిర పాలన అందించేది ఒక్క టీడీపీయేనని, వచ్చే ఎన్నికట్లో తెలుగుదేశం పార్టీ విజయంసాధిస్తుందని హరికృష్ణ అన్నారు.పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని ఆయన  మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాము క్రియాశీలంగా లేమనడం సరికాదని, పార్టీ కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు.

నందికొట్కూరు నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్ కట్

ఇటీవలే నగర పాలిక సంస్థగా మారిన నందికొట్కూరు మేజర్ పంచాయతీ విద్యుత్ శాఖకు భారీగా బకాయి పడింది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో నందికొట్కూరు పరిధిలోని వీధిలైట్లకు విద్యుత్ కట్ చేయనున్నట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. బకాయిలు భారీగా ఉన్నాయని ఇచ్చిన నోటీసులకు స్పందన లేకపోవడంతో మొదటి దశలో అప్పటి పంచాయతీ ఇప్పటికీ నగర పాలక సంస్థ కార్యాలయానికి విద్యుత్‌ను  తొలగించారు. నందికొట్కూరు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు రూ.కోటి బకాయి ఉందని ట్రాన్స్‌కో ఎడిఎ శ్రీనివాసులు తెలిపారు. బకాయిలు గత 15 నెలలుగా బకాయిలు పేరుకుపోయాయన్నారు. నీటి పథకాలు, విద్యుత్ దీపాలు వినియోగించి బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు. అయితే స్పందన లేకపోవడంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశామన్నారు. నగర పంచాయతీగా మారిన తరువాత సైతం మునిసిపల్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే స్పందించకపోయిన కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలు త్వరగా చెల్లించని పక్షంలో వీధి దీపాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపి వేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యుత్ బకాయిలు చెల్లించడంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించి బకాయిలను చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పట్టణ వీధుల్లో చీకట్లు కమ్ముకుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించడం, అవినీతికి పాల్పడటం వంటి కారణాల వల్లే బకాయిలు పేరుకుపోయాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకొని బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!...ద్రవిడ్

భారత క్రికెట్‌కు అమూల్యమైన సేవలు అందించి, ఎన్నో కీలక సమయాల్లో క్రికెట్ల వద్ద పాతుకుపోయి జట్టుకు అండగా నిలిచిన సీనియర్ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌కు అడెలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టే బహుశా చివరి టెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల ద్రవిడ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసీస్ టూర్‌లో ఉన్న టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్టులోనూ ఓటమి ముంగిట నిలిచింది. ఈ సిరీస్‌లో ద్రవిడ్ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 24.25 సగటుతో 194 పరుగులు మాత్రమే చేయగలగడాన్ని ద్రవిడ్ జీర్ణించుకోలేక పోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వనే్డ ఇంటర్నేషనల్స్, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అతను, ఇక టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా అతను శనివారం మ్యాచ్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. భారత్‌ను ఓడించాలంటే ముందుగా ద్రవిడ్‌ను అవుట్ చేయాలని ప్రపంచ దేశాలు భావించేవి. జట్టుకు కొండంత అండగా ఉంటాడు కాబట్టే అతనిని అభిమానులు ‘ది వాల్’ అంటూ పిలుస్తారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ (15,470) తర్వాతి స్థానం ద్రవిడ్‌దే. అతను 13,288 టెస్టు పరుగులు చేశాడు. 52.31 సగటుతో రాణించిన అతని ఖాతాలో 36 సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 270 పరుగులు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 164 టెస్టులు ఆడిన ద్రవిడ్ 210 క్యాచ్‌లతో ఈ విభాగంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో 1996లో తొలి టెస్టు ఆడిన ద్రవిడ్ 2005-07 మధ్యకాలంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలు అందించాడు. అవసరాలను బట్టి వికెట్‌కీపింగ్ బాధ్యతలను కూడా చేపట్టే సత్తావున్న ద్రవిడ్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకే, అతను రిటైర్మెంట్ గురించి తీవ్రంగా యోచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సమాచారంపై వివరణ కోరడానికి పిటిఐ ప్రయత్నించినప్పుడు అతను అందుబాటులో లేడు.ఇలావుంటే, ద్రవిడ్‌తోపాటు ఈ సిరీస్‌లో విఫలమైన మరో సీనియర్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతను రిటైర్ అయితేనే మేలని సూచిస్తున్నారు. ఇప్పట్లో అలాంటి యోచన లేదని లక్ష్మణ్ ఇటీవల ప్రకటించినప్పటికీ, ఒకవేళ ద్రవిడ్ రిటైరైతే, దాని ప్రభావం అతనిపై తప్పక ఉంటుందని అంటున్నారు. కానీ, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలియడం లేదు.