Saturday, 28 January 2012

త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!...ద్రవిడ్

భారత క్రికెట్‌కు అమూల్యమైన సేవలు అందించి, ఎన్నో కీలక సమయాల్లో క్రికెట్ల వద్ద పాతుకుపోయి జట్టుకు అండగా నిలిచిన సీనియర్ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌కు అడెలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టే బహుశా చివరి టెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల ద్రవిడ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసీస్ టూర్‌లో ఉన్న టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్టులోనూ ఓటమి ముంగిట నిలిచింది. ఈ సిరీస్‌లో ద్రవిడ్ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 24.25 సగటుతో 194 పరుగులు మాత్రమే చేయగలగడాన్ని ద్రవిడ్ జీర్ణించుకోలేక పోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వనే్డ ఇంటర్నేషనల్స్, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అతను, ఇక టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా అతను శనివారం మ్యాచ్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. భారత్‌ను ఓడించాలంటే ముందుగా ద్రవిడ్‌ను అవుట్ చేయాలని ప్రపంచ దేశాలు భావించేవి. జట్టుకు కొండంత అండగా ఉంటాడు కాబట్టే అతనిని అభిమానులు ‘ది వాల్’ అంటూ పిలుస్తారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ (15,470) తర్వాతి స్థానం ద్రవిడ్‌దే. అతను 13,288 టెస్టు పరుగులు చేశాడు. 52.31 సగటుతో రాణించిన అతని ఖాతాలో 36 సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 270 పరుగులు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 164 టెస్టులు ఆడిన ద్రవిడ్ 210 క్యాచ్‌లతో ఈ విభాగంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో 1996లో తొలి టెస్టు ఆడిన ద్రవిడ్ 2005-07 మధ్యకాలంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలు అందించాడు. అవసరాలను బట్టి వికెట్‌కీపింగ్ బాధ్యతలను కూడా చేపట్టే సత్తావున్న ద్రవిడ్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకే, అతను రిటైర్మెంట్ గురించి తీవ్రంగా యోచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సమాచారంపై వివరణ కోరడానికి పిటిఐ ప్రయత్నించినప్పుడు అతను అందుబాటులో లేడు.ఇలావుంటే, ద్రవిడ్‌తోపాటు ఈ సిరీస్‌లో విఫలమైన మరో సీనియర్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతను రిటైర్ అయితేనే మేలని సూచిస్తున్నారు. ఇప్పట్లో అలాంటి యోచన లేదని లక్ష్మణ్ ఇటీవల ప్రకటించినప్పటికీ, ఒకవేళ ద్రవిడ్ రిటైరైతే, దాని ప్రభావం అతనిపై తప్పక ఉంటుందని అంటున్నారు. కానీ, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలియడం లేదు.

తిరుమల వాసులకు శుభవార్త!

 తిరుమల వాసులకు ఇకపై స్థానికులకు శ్రీవారి దర్శనం సులభంగా దక్కనుంది. ఆర్జిత సేవల్లో ప్రత్యేక కోటా కల్పిస్తూ  జరిగిన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 1980లో మాస్టర్‌ప్లాన్ అమలు చేయక ముందు తిరుమలలో సుమారు 30 వేల మంది స్థానికులు ఉండేవారు. శ్రీవారి ఆలయాభివృద్ధిలో టీటీడీతోపాటు స్థానికుల పాత్ర కీలకమైంది. అప్పట్లో భక్తుల రద్దీ తక్కువగా ఉండడం వల్ల ప్రతి మంగళవారం స్థానికులను శ్రీవారి దర్శనానికి ప్రత్యేకంగా అనుమతించేవారు. ప్రారంభంలో ఆలయ మహద్వారం, ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి స్థానికులు వెళ్లేవారు. 1992 వరకు ఈ నిబంధన కొనసాగించి తర్వాత నిలిపివేశారు. దశలవారీగా చేపట్టిన మాస్టర్‌ప్లాన్ వల్ల 2003వసంవత్సరానికి 90 శాతం ఊరు ఖాళీఅయ్యింది. ప్రస్తుతం బాలాజీనగర్‌లో 1,060 నివాసాలు, పునరావాస కేంద్రంలో మరో వంద గృహాల వారు మాత్రమే ఉన్నారు. కనీసం వీరికైనా శ్రీవారి దర్శనానికి అనుమతివ్వాలని అనేక మార్లు టీటీడీకి విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో,  జరిగిన పాలక మండలి సమావేశంలో చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులు, ఈవో సానుకూలంగా స్పందించారు. ఆర్జిత సేవల్లో (ఖాళీల బట్టి) స్థానికుల గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు వంటిని ఆధారంగా చేసుకుని టికెట్ల కేటాయింపుల్లో ప్రత్యేక కోటా ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో స్థానికులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు.

రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ పై ప్రత్యేక దృష్టి...హోంమంత్రి సబితా

రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం నివురుగప్పిన నిప్పులా దాగి ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు ఆమె తెలి పారు. రాయలసీమ జిల్లాల్లో శాంతిభద్రతలు, నేరాలపై ఆయా జిల్లాల ఎస్పీలతో ఆమె తిరుపతిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఫ్యాక్షన్ సమస్యలున్న మాట వాస్తవమేనని, అందుకే ఫ్యాక్షనిజం తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలను కోరినట్లు తెలిపారు. ఈ కేసు వెనుక ఎంతటి పెద్దలున్నా శిక్షకు గురికాక తప్పదని, చట్టం ఎవరికీ చుట్టం కాదని వ్యాఖ్యానించారు. పరిశోధనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుకే కేసును సీఐడీకి అప్పగించామని, భాను తప్పించుకోలేడని చెప్పారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ, తొమ్మిదేళ్లు సీఎంగా వ్యవహరించిన బాబుకు తెలియదా? పోలీసు పరిశోధనల గురించి, భాను గురించి ఆయన వద్ద ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు అందజేసి సహకరించవచ్చు కదా? అని అన్నారు.ఫ్యాక్షనిజంతో సంబంధం ఉన్న నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, దుస్సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది అదుపులో ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా సమస్య ఉన్నందున పోలీసులు, అటవీ శాఖతో కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. రెండు శాఖల సమన్వయంతో సుమారు రూ.27 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోగలిగారన్నారు. దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లను ఎదిరించేందుకు అటవీశాఖకు ఆయుధాలు ఇవ్వచ్చుకదా అని మీడియా ప్రశ్నించగా, అందరికీ ఆయుధాలు ఇస్తూపోతే పోలీసులు ఎందుకు ?, వారికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మద్దెలచెరువు సూరి హత్య కేసును ఛేదించడంలో, ప్రధాన నిందితుడైన భానుకిరణ్ అరెస్టు, కేసు పురోగతిపై కొందరు చేస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు

లక్ష ఎకరాల్లో అన్నదాతకు ఉపాధి

జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసా యం. అత్యధిక మండలాల్లో పంటలు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. వరుణు డు కరుణించకపోతే అన్నదాత కరువు కాటుకు గురవుతాడు. పడమట మండలాల రైతులు ప్రతి యేటా కరువు బారి న పడుతూనే ఉంటారు. కరువు బారి నుండి అన్నదాతను రక్షించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద తోటలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. మొదట్లో కానుగ, అల్లనేరేడు, జెట్రోఫీ మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ జెట్రోఫీ మొక్కలు పెంచడానికి చాలా మంది సుముఖత చూపలేదు. మామిడి మొక్కల పెంపకం కోసం చాలా మంది రైతుల నుండి వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మామిడి మొక్కల పెంపకానికి ఉపాధి అధికారులు అనుమతించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధిహామీ పథకంలో తోటల పెంపకానికి పెద్ద పీట వేస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు సుమారు లక్ష ఎకరాల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ఎకరాకు సగటున రూ.62 వేలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.650కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో తోటల పెంపకానికి మం చి స్పందన ఉంది. మరికొన్ని మండలాల్లో ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవడంలేదు. సద్వినియో గం చేసుకునే అన్నదాతకు ఉపాధి ఓ వరంగా మారింది.జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఉపాధిహామీ పథకం కింద మొక్కల పెంపకం చేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 969 గ్రామ పంచాయతీల్లో 22,721 మంది రైతులకు చెందిన 32,315.65 ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా ఎం చుకున్నారు. ఈ ఏడాది ఇంతవరకు 6,911మంది రైతులకు చెందిన 12,674.01 ఎకరాలలో మొక్కల నాటే కార్యక్రమం జరగుతోంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1587.03 లక్షలు ఖర్చుచేశారు. మామిడితోటల పెంపకానికి ఎకరాకు మూడేళ్ళకు రూ.62వేల వంతున నిధు లు విడుదల చేస్తారు. డ్రిప్ ఇరిగేషన్‌కు అయితే అదనంగా మరో రూ.30 నుం డి రూ.40వేలు ఇస్తారు. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటున 70 మొక్కలు పెంచవ చ్చు. మొక్కనాటడానికి గుంత (పిట్స్) లు తీయడం మొదటుకుని నాటడం, నీరు పోయడం, కంచె వేయ డం, ఎరువులు అన్నింటికీ ఉపాధిహా మీ పథకం కింద నిధులు ఇస్తున్నారు. ముఖ్యంగా పేద రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. కొన్ని మండలాల్లో రైతులకు అవగాహన కల్పించక పోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మండలాలు మరీ అధ్వానం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పేద రైతుల వద్దకు తీసుకెళ్ళడంలో ఉపాధి సిబ్బంది విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మండలాల్లో రైతులు ఈ తోటల పెంపకానికి దూరంగా ఉంటున్నారు. జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది

Friday, 27 January 2012

పాటించేవారు ఏరీ?

రాయలసీమ జిల్లాలో యువత ప్రమాదకర బైక్ రేసు లు.. తల్లిదండ్రుల అతి గారాబం... వాహన చోదకుల నిర ్లక్ష్యం... పరిమితికి మించిన లోడుతో వా హనాల రాకపోకలు... ఇరువైపులా ప్రయాణికులతో ఆటోడ్రైవర్ల సర్కస్ ఫీట్లు, ప్రమాదకర మలుపులు... అమ్మకాలను పెంచుకునేందుకు వాహన తయారీదారుల విన్యాసాలు.. దశాబ్దా ల నాటిరోడ్లు.. పెరుగుతున్న జనాభా.. వీటన్నిటికీ మించి రవాణా, పోలీసు శాఖాధికారులు అలసత్వంతో రహదారులు మృత్యు దారులుగా మారుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాల పేరుతో హడావుడి చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఇప్పటివర కు ఇలాంటివి 22 వారోత్సవాలు చేసి నా అవి లెక్కగా మాత్రమే మిగిలాయి. ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించలేనంత వరకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.8 నివ దేశ ఆర్థిక వ్యవస్థపై రూ. 8 వేల కోట్లు భారం దేశంలో ఏడాదికి దాదాపు 3 లక్షల కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్ష మందికి పైగా మృతి చెందుతున్నారు. 4 లక్షల మందికి పైగా గాయాలతో బయటపడి వికలాంగులవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల ప్రాణ, ధన నష్టం జరుగుతూ ఎన్నో లక్షల కుటుంబాలు జీవనాధారం కోల్పోయి అనాధలవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 8 వేల కోట్ల భారం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నిమిషానికి ఒక్క ప్రమాదం, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మనిషి మృత్యువు పాలవుతున్నట్లు జాతీయ రోడ్డు భద్రత కార్పొరేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 75 శాతం ప్రమాదాలు దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక భాగం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని రోడ్డు భద్రత కమిషన్ నివేదిక తేటతెల్లం చేస్త్తోంది. - డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం.పాటించేవారు ఏరీ? చట్టాలు ఎంత పకడ్బందీగా తయా రు చేసుకున్నా వాటిని అమలు చేసేవారు.. పాటించేవారు కరువవ్వడంతో ఈ రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మృతుల్లో యువత అధికమని చెబుతున్న అధికారులే దశాబ్దాలుగా వారిని చైతన్యవంతం చేయడంలో విఫలమవుతున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల మాట మరచినట్టుంది. ప్రముఖుల సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలతో వచ్చేవారికి దర్శనాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయడానికి సమాయత్తం అయింది. నాలుగేళ్ళ క్రితం తిరుమలలో చైర్మన్ కార్యాలయంగా ఉన్న డంబుల్ అతిధిగృహంలో ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలతో దళారీలు రాజ్యమేలారు. జెరాక్స్ కాపీలతో వందల కొద్ది టిక్కెట్లు సంపాదించి బ్లాక్‌లో అమ్ముకున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడం కోసం సిఫారసు లేఖలపై టిక్కెట్లు ఇవ్వడాన్ని టీటీడీ బాగా తగ్గించింది. ఎమ్మెల్యే, ఎంపీలు లెటర్లు ఇచ్చినా నేరుగా వారు ఫోన్‌చేసి చెబితే తప్ప వీఐపీ బ్రేక్, ఇతర సేవా టిక్కెట్లు ఇవ్వకుండా నియంత్రించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేల సిపార్సు ఉత్తరాలకు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక విధంగా సామాన్య భక్తులకు అన్యాయం చేయడమే. తమకు తగిన గౌరవం ఇవ్వడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీ లు బహిరంగంగా విరుచుకుపడటం, స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లడంతో వీరిని సంతృప్తి పరచడానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అభిమానులు ,ప్రజలకు ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా...ఎమ్మెల్యే చిరంజీవి

తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి వ్యాఖ్యానించారు.  నీతి నిజాయితీ ప్రాతిపదికగా తాను రాజకీయ రంగప్రవేశం చేశానని, సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నానని చెప్పారు. పూలేలాంటి గొప్ప నేతలను తెర మీదకు తెచ్చి సామాజిక న్యాయం గురించి తమ పార్టీ ప్రచారం చేసిన తర్వాతనే మిగిలిన పార్టీలు అనుసరించి ఆయన విగ్రహాలను పెట్టాయన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి  మీడియాతో అన్నారు. అభిమానులు పరస్పరం గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక శక్తి, మరో శక్తితో జత కడితే అద్భుతాలు సాధించగలనని భావించానన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి సి.రామచంద్రయ్య భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.