Showing posts with label రాయలసీమ. Show all posts
Showing posts with label రాయలసీమ. Show all posts

Sunday, 26 February 2012

రాయలసీమలో కరెంటు కష్టాలు

మార్చి నెల ప్రారంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల నుంచి కరెంటు కోత లేక పోవడంతో ఊపీరి పీల్చుకున్న ప్రజలకు మళ్లీ ‘ఉక్కపోత’ మొదలైంది. రాష్ట్రంలోని ఆర్టీపీపీ, కెటిజిఎస్, ల్యాండ్‌కో, కాకతీయ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు తగ్గిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడింది. దీంతో కోతలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కరెంటు కోత విధిస్తున్నారు. ఇక  మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు.ఇక మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కోత విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కరెంటు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో బల్బు వెలగడడం లేదు. ఇక రైతన్నలు కరెంట్ కోసం రాత్రి పూట జాగారం చేయాల్సి వస్తోంది.మరోవైపు వేసవి కాలం మరింత ముదిరితే మరిన్ని గంటలు కోత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో అందుకు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కోత విధించాల్సిన అవసరం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కోత కారణంగా ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కోత సమయం మరింత పెరిగితే ప్రజలు బాధలు వర్ణణాతీతం. త్వరలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటు వంటి తరుణంలో విద్యుత్ కోత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Saturday, 25 February 2012

రాయలసీమలో పోలీసుల రాజ్యం!


 అయితే జిల్లాలో ఇటీవల జరు గుతున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. బాధ్యత గల ఉద్యోగులమనే విషయం విస్మరించి వీధి గూండాల్లా వ్యవహరించారు. ఇతరులెవరైనా తగవులాడుకుంటే సర్ది చెప్పి పంపాల్సిన 'పెద్దరికం' వారిది. కానీ వారే కండకావరంతో కసాయిల్లా ప్రవర్తించారు. తమ 'నాగరికత' ఇదీ అని చాటుకున్నారు. ఇంతకాలం రౌడీషీటర్లను, ఫ్యాక్షనిస్టులను జిల్లా నుంచి పోలీసులు బహిష్కరించేవారు. ఇప్పుడు వారికే అలాంటి దుర్గతి ఏర్పడిందంటే కార ణం స్వయంకృతమే. ఇలాంటి పరిస్థితు ల్లో ఎస్పీ పట్టుదలకు పోకుండా నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన తూతూ మం త్రంగా వ్యవహరిస్తే నష్టపోయేది పోలీ సు శాఖే. అయితే ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని, పద్ధతి ప్రకారం విచారణ జరిపించి చ ర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. అదే స మయంలో కొందరు గ్రామస్థుల్లో మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందం టూ తన మనసులో మాట చెప్పకనే చె ప్పారు. కళ్లకు కనిపించే నగ్న సత్యానికి మించి సాక్ష్యమేమి కావాలి. 
 ప్రజాభిప్రాయానికి మిం చిన విచారణ మరొకటేముం టుంది? ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడమంటే 'మసిపూసి మారేడు కాయ'చేసే ప్రయత్నమే అవుతుంది. ఒకసారి ప్రజల్లో విశ్వాసం కోల్పోయాక తిరిగి దాన్ని పాదుగొల్పడం అంత సులువైన పని కాదని గతవారం 'వ్యాఖ్యానం'లో చెప్పుకున్నాం. వృత్తి ధర్మాన్ని విస్మరించి పోలీసులు అసాంఘిక శక్తుల్లా నడుచుకుంటూపోయినంత కాలం వారు ప్రజాగ్రహానికి గురవుతూనే ఉంటారు. తర చూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరుగుతు న్నాయంటే మన పోలీసులు ఎటువైపు పయనిస్తున్నట్లు? ఎస్పీ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కితే ఇక పో లీసు 'బూచి' ఇక తొలగేదెన్నడు? సమాజమేగతి బాగుపడేను? పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఒకప్పుడు తల్లిదండ్రులు పోలీసులను 'బూచి'గా చూపే వారు. అప్పట్లో ఖాకీలంటే ఉండే భయం అదీ.. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ పోలీసులు ఎంతో కర్కశంగా వ్యవహరించే వారు. వారి అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు ఉండేది కాదు. అందుకే వారంటే జనం జడుసుకునేవారు. దాని ప్రభావమే 'బూచి' రూపంలో అలా వ్యక్తమ య్యేది. రానురాను పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పోలీసులు, ప్రజల మధ్య కొంతవరకు సంబం ధాలు మెరుగుపడ్డాయి. పోలీసులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవరుచు కున్నారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. అలాగని అంతా సస్వరులయిపో యారని చెప్పలేం గానీ కొంతలో కొంత మార్పయితే వచ్చింది.  దొంగలతో పోలీసులు చేతులు కలపడమంటే వింతగానూ, విడ్డూరంగానూ లేదూ? వారితో దొంగతనాలు, దోపిడీలు చేయిస్తూ వాటాలు పంచుకునేవారంటే జుగుప్స కలిగించడం లేదూ? అంతెందుకు? జిల్లాలో సంఘ టనను మానవమాత్రులెవరైనా సమర్థిస్తారా? ఏమి జరిగిందని అక్కడి పోలీసులు పూనకం వచ్చి నట్లు ప్రవర్తించారో అర్థం కావడం లేదు. తాము పోలీసులమనే అహంతో కన్నూమిన్నూ కాన కుండా నడుచుకున్నారు. 
అనంతపురం జిల్లాలో
'మా వాళ్లతోనే పెట్టుకుం టారా?' అన్నట్లు ఉంది ఆయన వ్యవహార సరళి. తాము మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నామనే స్పృహ కూడా వారికి కలగలేదు. ప్రజాస్పందనను గురించిన ఆలోచన కూడా వారికి ఏమాత్రం వచ్చినట్లు లేదు. తాము ఏమి చేసినా చెల్లుబాటవుతుందనుకున్నారు. అయితే ఆ తరువాత పరిస్థితి వారి చేయి దాటిపోయిం ది. గ్రామస్థులంతా ఏకమయ్యా రు. ఒక్కసారిగా పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. ఏకధాటిగా 8 గంటల పాటు కొత్తచెరువును దిగ్బంధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఒక డీఎస్పీ, ఎనిమిది మంది సీఐ లు, పో లీసు అదనపు బలగాలు రంగంలోకి ది గాల్సి వచ్చింది.
   
 

Tuesday, 21 February 2012

రాయలసీమలో మహాశివరాత్రి ఘనంగా నిర్వహించారు

శ్రీశైలం
శిరిగిరిపై వెలసిన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనులారా చూసి తరించేందుకు సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం నుంచే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించిన అనంతరం తిరుమల వెంకన్న తరపున టిటిడి అధికారులు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడంతో కల్యాణోత్సవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్దం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో చీరాలకు చెందిన నేత కళాకారుడు పృధ్వీ వెంకటేశ్వర్లు నేసిన సుమారు 150 గజాల పాగాను కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం పాగాలంకరణకు సిద్ధమవగా ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపి వేశారు. దీంతో చిమ్మ చీకట్లో పృధ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా ఆలయంపై ఉన్న నవనందులు, ఆలయ గోపురాన్ని కలుపుతూ పాగా అలంకరించారు. పాగాలంకరణ, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.
శ్రీకాళహస్తి

మహాశివరాత్రి పర్వదినమైన సోమవారం ఉదయం శ్రీకాళహస్థీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి సర్వభూషితాలంకారులై ఇంద్రవిమానం, చప్పరం వాహనాలపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదిస్తూ చిద్విలాసాన్ని ప్రదర్శించారు. అదే విధంగా సోమవారం రాత్రి శ్రీకాళహస్థీశ్వరుడు నంది వాహనం, గజవాహనంపై జ్ఞానప్రసూనాంబికా దేవిలు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వాహనాల ముందు కేరళ పంచవాయిద్యాలు, తప్పెటగుళ్లు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు. అదే విధంగా ఏనుగులు, గుర్రాలు, వృషభాలు కూడా వాహనాల ముందు నడుస్తూ భక్తులను అలరించాయి. మొత్తంమీద ఉత్సవాల ఊరేగింపుతో మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీకాళహస్తి పట్టణం నాలుగుమాడావీధులు భక్తుల హరహర ధ్వానాలతో పులకించాయి.
తిరుపతి
తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రెండుగంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30గంటల నుండి 4.30గంటల వరకు అభిషేకం, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు రథోత్సవం(బోగితేరు) కన్నులపండుగా జరిగింది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధిసారధి, మనస్సుపగ్గం. ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు అర్చకులు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, కామాక్షి దేవి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. కాగా సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు నంది వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జూలకంటి బాలసుబ్రమణ్యం రచించిన, టిటిడి ముద్రించిన ‘కమనీయక్షేత్రం కపిలతీర్థం’ అనే పుస్తకాన్ని టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసేందుకు రాత్రి 10గంటల నుండి 12గంటల వరకు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాత్రి 12గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించారు.

Monday, 13 February 2012

రాయలసీమలో ఎర్రచందనం దొంగల

రాయలసీమలో ఎర్రచందనం దొంగల కార్యకలాపాలు పెచ్చుమీరాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఎర్రచందనం దుంగలను తరలిస్తూ అటవీ అధికారులకు పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తేందుకు కొందరు ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకున్నారు. చిత్తూరు,కడప,  కర్నూలు, నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రబంగారం విస్తరించి ఉంది.ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా మారిన ఈ అడవులు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు నిల యమయ్యాయి.ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను అటవీ పోలీ సులు కాపుకాసి పట్టుకుంటున్నారు. రెండేళ్ల కాలంలో సీమ జిల్లాలతో పాటు నెల్లూరుతో కలిపి 900కు పైగా ఉంటారని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ అటవీ అధికారి స్పష్టం చేశారు. చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే 600 మందికిపైగా అరెస్టు చేసినట్లు సమాచారం. అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న వారిలో 90శాతం మంది కూలీలు, డ్రైవర్లే ఉన్నట్లు సమాచారం. కిలో ఎర్రచందనం దుంగను నరికి స్మగ్లర్ చేతికి ఇస్తే రూ.150 ఇస్తున్నారు. అలా వారానికి ఒకరు సుమారు రూ.2 నుంచి రూ.5వేలకు పైనే కూలి గిట్టుబాటు అవుతుండడంతో అటవీ సమీపంలోని గ్రామాల్లోని కొందరు దీన్నే వృత్తిగా పెట్టుకున్నారు. అలాంటి వారే అధికారులకు దొరుకుతున్నారు.పైరవీలతో తప్పించుకుంటున్న స్మగ్లర్లు ఇటీవల చిత్తూరు,కడప  జిల్లాల పరిధిలో పట్టుబడిన ఎర్రచందనం దొంగ ఒకరు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి, ఇద్దరు అధికారులకు కొంత మొత్తంలో నగదు ముట్టజెప్పి కేసు నుంచి తప్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తిపై రెండు జిల్లాల్లో 14 కేసులు ఉన్నట్లు అటవీ శాఖకు చెందిన ఓ అధికారి  వివరించారు.మరోవైపు తిరుపతిలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న టెంపోను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. సుమోలో మొత్తం 32 దిమ్మెలు ఉన్నాయని, వాటి విలువ నాలుగు లక్షల వరకు ఉంటుందని సిఐ నాగరాజ్ తెలిపారు. టెంపో డ్రైవర్ వామనాన్ని వదిలి పారిపోయాడు. వివిధ ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేసినా ఎర్రచందనానికి డిమాండ్ ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ జరుగుతోంది. అటవీశాఖలో కొందరు ఇంటి దొంగలు సహకరించడం వల్లనే విలువైన కలప తరలి వెళతున్నదని ఆరోపణలు ఉన్నాయి.వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నామన్నారు.

Thursday, 2 February 2012

పాల ధరలకు రెక్కలొచ్చాయి

 ఏడాది కాలంలో మూడు పర్యాయాలు ప్రైవేటు డెయిరీలు పాల ధరలను పెంచి వినియోగదారుల నెత్తిన భారం మోపాయి. ఏటా ఇతర డెయిరీలకన్నా రూపాయి అదనంగా పెంచే హెరిటేజ్ కంపెనీ తాజాగా లీటరు పాలుపై రూ.4 పెంచింది. దీంతో ఇతర డెయిరీలు తామేమీ తక్కువ కాదంటూ హెరిటేజ్ కంపెనీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. అందులో భాగంగానే హెరిటేజ్‌తో పాటు జిల్లాలోని మరో 8 డెయిరీలు కూడా లీటరు రూ.26 ఉన్న పాలధరలను రూ.30కి పెంచాయి. 3.0 శాతం కొవ్వు, 8.5 వెన్నశాతం ఉన్న లీటర్ పాలను రూ. 30 (రీటైల్ ధర) లకు విక్రయిస్తున్నారు. పాల సేకరణ ధరను పెంచకుండా ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలు పబ్బం గడుపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రానున్న మార్చి నుంచి మే నెలాఖరు వరకు పాలసేకరణ ఆశించిన స్థాయిలో ఉండదని ప్రైవేటు డెయిరీలు భావిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పాలసేకరణ ధర పెంపును పక్కన బెట్టి ఉత్పత్తుల విక్రయ ధరలను మాత్రం పెంచాశాయి. చాలా ప్రైవేటు డెయిరీలు లీటర్ నాణ్యమైన పాల సేకరణకు రూ. 14 నుంచి 19 వరకు మాత్రమే చెల్లిస్తున్నాయి.జిల్లాలో పాలిచ్చే ఆవులు, గేదెలు 5.80 లక్షలు ఉన్నాయి. 48 ప్రైవేటు డెయిరీలు, 101 బల్క్‌మిల్క్ సెంటర్‌ల ద్వారా రోజుకు దాదాపు 18 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. 3 లక్షల లీటర్లు స్థానిక పాల వ్యాపారులు విక్రయిస్తున్నారు. మిగిలిన 15 లక్షల లీటర్ల పాలను ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు కొవ్వు(ఫ్యాట్), వెన్నను తీసివేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలోని డెయిరీలు మినహా మిగిలిన 48 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ రేటును అనధికారికంగా పెంచేశాయి. సాధారణంగా పాలసేకరణ, విక్రయధరల నిర్ణయం ప్రభుత్వ సమక్షంలో నిర్ణయించాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా ధరలను పెంచేశాయి. ప్రభుత్వ ఆధీనంలోని బాలాజీ, ఏపీ డెయిరీలు లీటర్ పాలను రూ. 28కు విక్రయిస్తున్నాయి.

Friday, 27 January 2012

పాటించేవారు ఏరీ?

రాయలసీమ జిల్లాలో యువత ప్రమాదకర బైక్ రేసు లు.. తల్లిదండ్రుల అతి గారాబం... వాహన చోదకుల నిర ్లక్ష్యం... పరిమితికి మించిన లోడుతో వా హనాల రాకపోకలు... ఇరువైపులా ప్రయాణికులతో ఆటోడ్రైవర్ల సర్కస్ ఫీట్లు, ప్రమాదకర మలుపులు... అమ్మకాలను పెంచుకునేందుకు వాహన తయారీదారుల విన్యాసాలు.. దశాబ్దా ల నాటిరోడ్లు.. పెరుగుతున్న జనాభా.. వీటన్నిటికీ మించి రవాణా, పోలీసు శాఖాధికారులు అలసత్వంతో రహదారులు మృత్యు దారులుగా మారుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాల పేరుతో హడావుడి చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఇప్పటివర కు ఇలాంటివి 22 వారోత్సవాలు చేసి నా అవి లెక్కగా మాత్రమే మిగిలాయి. ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించలేనంత వరకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.8 నివ దేశ ఆర్థిక వ్యవస్థపై రూ. 8 వేల కోట్లు భారం దేశంలో ఏడాదికి దాదాపు 3 లక్షల కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్ష మందికి పైగా మృతి చెందుతున్నారు. 4 లక్షల మందికి పైగా గాయాలతో బయటపడి వికలాంగులవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల ప్రాణ, ధన నష్టం జరుగుతూ ఎన్నో లక్షల కుటుంబాలు జీవనాధారం కోల్పోయి అనాధలవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 8 వేల కోట్ల భారం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నిమిషానికి ఒక్క ప్రమాదం, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మనిషి మృత్యువు పాలవుతున్నట్లు జాతీయ రోడ్డు భద్రత కార్పొరేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 75 శాతం ప్రమాదాలు దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక భాగం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని రోడ్డు భద్రత కమిషన్ నివేదిక తేటతెల్లం చేస్త్తోంది. - డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం.పాటించేవారు ఏరీ? చట్టాలు ఎంత పకడ్బందీగా తయా రు చేసుకున్నా వాటిని అమలు చేసేవారు.. పాటించేవారు కరువవ్వడంతో ఈ రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మృతుల్లో యువత అధికమని చెబుతున్న అధికారులే దశాబ్దాలుగా వారిని చైతన్యవంతం చేయడంలో విఫలమవుతున్నారు.

Tuesday, 17 January 2012

రాయలసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి



హిందువుల పండుగల్లో మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ఎంత దూరంలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు పట్టణాల్లో చదువుతున్న యువకులు, ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ గ్రామాలకు చేరుకున్నారు. దీంతో పట్టణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఏ పల్లెలో చూసినా వాహనాలతో కొత్త కొత్త వ్యక్తులతో కనిపించాయి. గ్రామానికి చేరుకున్న కొత్తవ్యక్తులు, పల్లెకు చెందిన వారు గ్రామంలో ఉండే రైతులను పలకరించడం, కలిసి మెలిసి సంక్రాంతి పండుగను చేసుకున్నారు. అయితే రైతును ఏమాత్రం కదిలించినా కష్టాలను దిగమింగుతూ వారికి తమ కష్టం ఎందుకు చెప్పుకోవాలన్న ఆలోచనతో చిరునవ్వుతో వారిని పలకరించడం, వచ్చిన బంధువులను, స్నేహితులకు, అల్లుళ్లు, ఆడ బిడ్డలకు ఎక్కడా ఏలోటు రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనపడింది. తమ కష్టాలు ఎన్నిఉన్నా వారు వచ్చేది సంవత్సరానికి ఒకమారే కదా, వచ్చినపుడువారికి తమ కష్టాలను చూపడం భావ్యం కాదన్న విధంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలన్న సదుద్దేశంతో కలిసి మెలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. అయితే పండుగకు కావాల్సిన నిత్యావసర సరుకులు ధరల పోటు ఆకాశాన్ని అంటినా కొనుగోలుచేయక తప్పలేదు. ఆరేడు సంవత్సరాలుగా వరుస కరవులతో సంక్రాంతి పండుగ కాలక్రమేణా ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమాలు చేయడం తప్ప పండుగలో పూర్తి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. పండుగ వచ్చింది ఏదో చేసుకోవాలా, నలుగురితో నారాయణ అన్న చందంగా చేయడమేతప్ప మనస్ఫూర్తిగా రైతు లు ఈ పండుగను జరుపుకోలేకపోతున్నారు. కారణం ప్రభుత్వ వైఫల్యం, ప్రకృతి కనికరించకపోవడం రైతులను ప్రతియేడు నష్టాలలోకి నెట్టేస్తోంది. గతంలో సంక్రాంతి పండుగ అంటే గ్రామ సీమలు కళకళలాడుతుండేవి. పారుతున్న సెలయేర్లు, పక్షుల రాగాలతో, పచ్చని పైర్లతో రైతన్న ముఖంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. పండించిన ధాన్యం రాసులుపోసి ఎటువెళ్లినా రైతన్నకు ఆప్యాయత, అనురాగాలు చూపించేవారు. ప్రస్తుతం అదే రైతన్న బజారులోకి అప్పుకోసం వెళితే గతంలో పిలిచి అప్పు ఇచ్చే ఆసాములు నేడు ముఖం చాటుచేసుకుని వెళ్తున్నారు

రాయలసీమ జిల్లాలో వణికిస్తున్న చలిపులి



ఎన్నడూ లేనంతగా చలి ప్రజలను గజ గజ వణికిస్తోంది. దీనితో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 7గంటలైనా సూర్యుని కిరణాలు బయటకు పడని పరిస్థితి ఉంది. ఉదయం పూట మంచు కప్పేసి ఉండడంతో చలితో జనం వణికిపోతున్నారు. నాలుగురోజుల్లోనే వాతావరణంలో వచ్చిన మార్పులతో చలి పెరిగింది. ఉదయం ఏడుగంటలైనప్పటికీ ఇళ్లలో నుంచి జనం బయటకురాని పరిస్థితి ఉంది. ఇలాంటి చలిని గత 60 సంవత్సరాల కాలంలో ఎప్పుడు చూడలేదని ప్రజలు స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో చలి పెరిగిపోతోంది. రాత్రి 9గంటల తరువాత వరకూ లావాదేవీలు సాగించే వాణిజ్య వ్యాపార సంస్థలు 8 గంటలకే మూతపడుతున్నాయి. వృద్ధులు చలివలన అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలు కూడ చలి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆస్మాతో బాధపడే ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉదయం పూట మంచు కురుస్తుండడంతో దైనందిన కార్యక్రమాలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. దుకాణాల వద్ద, రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో నిద్రించే భిక్షగాళ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. భిక్షగాళ్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో పడుకొనే పరిస్థితి ఏర్పడింది. చలి దెబ్బకు ఉదయం, సాయంత్రం కూడా బయట జనం సంచారం తగ్గిపోయింది. ఉదయం, సాయంత్రం వాకింగులు, జాగింగ్‌లు బందయ్యాయి.

Sunday, 8 January 2012

రాయలసీమ జిల్లాలో రాజీవ్ యువ కిరణాలు నీరుగారి పోతోంది

రాజీవ్ యువ కిరణాలు పథకం లక్ష్యానికి ప్రభుత్వమే తూట్లు పొడిచింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం జిల్లాలో నీరుగారి పోతోంది. ఇప్పటికే శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారు వాటిని వదిలేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుస్తీ పడుతుండగా శిక్షణలో ఉన్న వారు సైతం గైర్హాజరవుతుండటమే కాక కొత్తగా శిక్షణ పొందేందుకు యువత ముందుకు రాకపోవడం విశేషం. దీంతో రాజీవ్ యువ కిరణాల పథకం కింద లక్ష ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషనే్ల గండి కొట్టుకున్నట్లయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువత కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద భారీ ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వాలని భావించారు. గత అనుభవాల దృష్ట్యా యువత నుంచి మద్దతు రాకపోవడంతో తన మాట నిలుపుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకం కింద ప్రైవేటు కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి ఆయా సంస్థలకు అవసరమైన మేరకు ప్రభుత్వమే శిక్షణ ఇప్పించి ఉద్యోగాలను కల్పించింది. అయితే ప్రైవేటు కంపెనీల్లో జీతం తక్కువ ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల అపుడు కూడా ఉద్యోగం పొందిన యువత వెనక్కి తిరిగిరావడంతో ఆ పథకం క్రమంగా మూలనపడింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మెరుగులు దిద్దుతారని ప్రచారం జరిగినా కొద్ది రోజులకే ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆ పథకానికి మంగళం పాడేశారు. ఇక ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాజీవ్ యువకిరణాలు పేరుతో పాత పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన 15 సంస్థలకు యువతకు శిక్షణ ఇప్పించే బాధ్యతను అప్పగించారు. ఆయా సంస్థలు ప్రవేటు సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు గుర్తించి వాటికి అవసరమైన మానవ వనరులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించాల్సి ఉంది. ప్రభుత్వం గుర్తించిన 15 సంస్థలు జిల్లాల్లో తమ భాగస్తులుగా స్థానిక శిక్షణా సంస్థలను ఎంపిక చేసుకొని శిక్షణ ఇవ్వడం ప్రారంభింయి. జిల్లాలో 4,308 మందికి శిక్షణ, ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 2వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపించగా అప్పటికే నైపుణ్యం ఉన్న 13 వందల మందికి నేరుగా ఉద్యోగాలు ఇప్పించారు. సుమారు మరో 600 మంది వరకు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యంలో సుమారు 3,300మందికి ఉద్యోగాలిచ్చినట్లు ప్రభుత్వానికి నివేదిక వెళ్లగా దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే అందులో 45శాతం మంది ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయినట్లు తేలింది. మరో 20 శాతం యువకులకు సంబంధించి చిరునామాలు కూడా లభ్యం కాలేదని తెలుస్తోంది. శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశం కల్పిస్తే వెళ్లిపోవడానికి గల కారణాలపై మరో విచారణ నిర్వహించగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కారణంగా ఆర్‌వైకె కింద ఉద్యోగం పొందిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు అవసరమైన శిక్షణ పొందేందుకు వెళ్తున్నారని తేలింది. మరికొందరు జీతం తక్కువ, పని ఎక్కువగా ఉందని, ఉద్యోగ భద్రత లేదని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఆర్థిక భారంగా పరిగణించి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరోవైపు ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం కావడంతో రాజీవ్ యువ కిరణాల లబ్ధిదారులు తమకు వచ్చిన ఉద్యోగావకాశాలను వదిలేసి వెనక్కి వచ్చినట్లు విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా శిక్షణలో ఉన్న సుమారు 600మంది అభ్యర్థుల్లో కూడా చాలా వరకు డ్రాపవుట్స్ కనిపించే అవకాశం ఉందని పథకాన్ని నిర్వహిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. మొత్తం మీద రాజీవ్ యువ కిరణాలు పథకానికి ప్రభుత్వమే గండి కొట్టిందన్న అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Saturday, 7 January 2012

మున్సిపాలిటీలో వాహనాల కొనుగోలులో గోల్‌మాల్

 ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నులను ఉద్యోగులు ఖజానాలో జమచేయకుండా, దిగమింగి జైలుపాలైన విషయం మరువకముందే పారిశుద్ధ్య పనులకు సంబంధించి వాహనాల కొనుగోలులో గోల్‌మాల్‌కు పాల్పడిన వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. 12 ఆర్థిక సంఘం నిధుల కింద మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం హైడ్రాలిక్ తరహా వాహనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అధికారులు నిబంధనలను తోసిరాజని.. రూ.20 లక్షల వ్యయంతో మహేంద్ర కంపెనీకి చెందిన మూడు ఆటోలు, ఒక టిప్పరును కొనుగోలు చేశారు. ఏడాది క్రితం ఈ వాహనాల కొనుగోలకు పాలకవర్గం ఆమోదం తెలపడంతో, రెండునెలల క్రితం అవి మున్సిపాలిటీకి చేరుకున్నాయి. వీటికి ఇప్పుడు మళ్లీ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి హైడ్రాలిక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. లక్షలాది రూపాయలు కమీషన్ తీసుకుని వీటిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.ఈ గోల్‌మాల్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదీ ఎమైనప్పటికీ మున్సిపాలిటిలో తవ్వేకొద్దే అవకతవకలు బయటికొస్తున్నాయి. అభివృద్థి పేరిట చేపట్టిన అన్ని పనుల్లో సంబంధిత అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళుతున్నాయి. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం. అవినీతి అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొల గించాలని ఇటీవలో హైకోర్టులో పిల్ దాఖాలు అయిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన టెండర్లలో అనుమానాలు ఉన్నాయని, వృద్ధులకు, ఇతర పింఛన్ దారులకు న్యాయం జరగడంలేదన్న ఆరోపణలు హైకోర్టు దృష్టికి వెళ్లింది.

Friday, 30 December 2011

న్యూఇయర్ వేడుకలకు ముస్తాబు

కాల గమనంలో ఎన్ని వసంతాలు మన కళ్ల ముందు మంచులా కరిగిపోతున్నా కొత్త సంవత్సరం రాక నూతనోత్సాహమే. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ఆహ్వానం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే.. మరికొందరు పుణ్యక్షేత్రాలకు పయనమవుతున్నారు. అలా వీలు కాని వాళ్లు మాత్రం స్థానికంగానే అంబరాన్నంటే సంబరాల్లో మునిగిపోవాలని పరితపిస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభానికి రెండు రోజులుండగానే ‘అనంత’ సుందరంగా ముస్తాబవుతోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్లంటూ అప్పుడే వ్యాపారస్తులు న్యూఇయర్ బొనాంజా ప్రకటిస్తున్నారు.మద్యం కూడా ఆఫర్లలో లభిస్తుండడంతో మద్యంప్రియులు హుషారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వస్త్రదుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు విద్యా సంస్థలు వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా కాలం తెచ్చిన మార్పుతో గ్రీటింగ్ కార్డులు వెలవెలబోతున్నాయి. సెల్ ఫోన్‌తో క్షణాల్లో శుభాకాంక్షలు చెప్పుకునే వీలుం డడంతో అందరూ వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఏడా ది తమ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంతో జ్యోతిష్కులకు డిమాండ్ పెరి గింది. గురువారం నగరంలోని రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్‌లు, బేకరీలు విద్యుద్దీపాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Thursday, 22 December 2011

రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పు

రైల్వేశాఖలో రిజర్వేషన్ సిస్టం మారనున్నది. సికింద్రాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనుల వల్ల అర్ధరాత్రి నుంచి రైల్వేసేవలకు బ్రేక్ పడింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు అంతర్జాలంలో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే సదుపా యం నిలిచిపోయింది. రాత్రి పది నుంచే ఈ పరిస్థితి ఉంటుందని రైల్వే అధికారులు అంటున్నారు. అంతేగాకుండా రైల్వే రాకపోకల వేళలు, విచారణ సేవలు, పీఎన్‌ఆర్ స్టేటస్ అందుబాటులో ఉం డవు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిపివేయడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రైళ్లకు సంబంధించి చార్ట్‌లను మంగళవారం రాత్రి తీసుకున్నారు. రీఫండ్ కూడా ఇవ్వడానికి వీలుకాదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముఖ్య రైల్వేస్టేషన్‌లలో కేవలం యూటీఎస్ (అన్‌రిజర్వ్‌డ్ టికెట్ సిస్టమ్) మాత్రమే పని చేస్తోంది.
పోర్ట్ సదరన్ రైల్వేకి అప్పగింత
దక్షిణమధ్య రైల్వే పీఆర్‌ఎస్ సిస్టమ్‌ను సదరన్‌రైల్వేకి అప్పగిస్తున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులు సౌత్‌సెంట్రల్ రైల్వే చేపడుతోంది. అం దులోనే భాగంగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రిజర్వేషన్ సిస్టమ్‌ను షడౌన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీరైల్వే పీఆర్‌ఎస్ సిస్టమ్‌లో లాగిన్ అయ్యి ఎస్‌సీఆర్‌ఎఫ్‌ఈ1తో రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగించేవారు. ఇకపై లాగిన్ ఎంఏఎస్‌ఎఫ్‌ఈ1తో ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోంది. అంటే చెన్నైతో రిజర్వేషన్ సిస్టమ్ అనుసంధానం చేస్తారు. ఎస్సీరైల్వేపోర్ట్ నుంచి సదరన్ రైల్వేపోర్ట్‌లో విలీనం చేయనున్నారు.

రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత

రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత ప్రజలను వణికిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే అత్యంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో తెల్లవారుజామున జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. తతిమా రుతువులలో మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చే జనంతో నగరంలో ఉదయం 4.30 గంటల నుంచే ప్రధాన వీధులు కిటకిటలాడేవి. ప్రస్తుతం 6.30 దాటుతున్నా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. వాకిళ్లు, కిటికీలు బిగించుకుని ఇంట్లో ఉంటున్నా చలి బాధ తప్పడం లేదని జనం వాపోతున్నారు. ఉదయం ఏడు గంటలు దాటుతున్నా సూర్యోదయం కాకపోవడంతో బాలభానుని నులివెచ్చని కిరణాల కోసం జనం పరితపిస్తున్నారు. నగరంలో కొన్ని పాఠశాలలు ఉదయం 5.30 గంటలకే ట్యూషన్ క్లాసులు ప్రారంభిస్తాయి. చలి దెబ్బకు పిల్లలు రాలేకపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా చలి బాధిస్తుండడంతో డిసెంబర్ మాసమే ఇలా ఉంటే ఇక జనవరిలో ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వణికిపోతున్నారు.దుప్పటి మీద దుప్పటి కప్పుకున్నా వణుకు ఆగడం లేదు.. మోచేతుల మధ్య తల పెట్టుకుని.. కాళ్లు ముడుకుని పడుకున్న పిల్లలు ఉదయం నిద్రలేవడానికి ససేమిరా అంటున్నారు.. స్నానానికి బాత్రూంలోకి తోస్తేగానీ వెళ్లడం లేదు. ఎనిమిది గంటలు అవుతున్నా ఉదయ భానుడు దర్శనమివ్వడం లేదు. పొగలు కక్కుతున్న చాయ్ కూడా గుటుక్కున లోపలికెళుతోంది. మార్నింగ్ వాక్ కాస్తా.. ఈవెనింగ్‌కు జంప్ అవుతోంది. ఒకవేళ తప్పదనుకుంటే స్వెట్టర్లు, మఫ్లర్లు, షూ, గ్లౌజ్‌తో సైనికుల్లా వెళ్లాల్సివస్తోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చలి మంటలు వేసుకుని కాచుకుంటారు. అదే నగరాలలో అయితే చలి మంటలు వేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 28-30 డిగ్రీల సెల్సియస్ కాగా రాత్రి ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న నేపథ్యంలో చలి పులి విజృంభణ ఊహించుకుని జనం ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ ఉదయం పూట 88-90 శాతం, మధ్యాహ్నం పూట 35-80 శాతం ఉంటోంది. ఆగ్నేయ గాలులు గంటకు 5-8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇప్పటికే చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్వెట్టర్లు, మఫ్లర్లు, ఉన్ని బెడ్‌షీట్లు, ఇయర్‌బ్యాండ్స్, వేజ్‌లైన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక్కడివారేగాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వెట్టర్లు తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు రూ.200లకు దొరికే స్వెట్టర్లు ఈ రెండు మూడు రోజుల్లో రెట్టింపు ధర పలకడం విశేషం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదని సూచిస్తున్నారు. తెల్లవారుజామున నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తుండడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయమేర్పడుతోంది.

Wednesday, 21 December 2011

అప్పులు తీర్చలేక రైతన్నకు కన్నీటి కష్టాలు

ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన  రైతులు రబీ సీజన్‌లో తమ అదృష్టం పరీక్షించుకుందామని వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. అయితే ఆదిలోనే ఎడతెగని వర్షాలు పంటలను నాశనం చేయగా, ప్రస్తుతం విద్యుత్తు కోతలు రైతన్నకు క'న్నీటి' కష్టాలు తెస్తున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు నీరు లేక ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డారు. రబీ సీజన్‌లో  రైతులు వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. విత్తిన వారం రోజులకే ఎడతెగని వర్షాల ధాటికి పొలాల్లో నీరు నీలిచి విత్తనాలు మొలకెత్తక పంటలు నాశనమయ్యాయి. అయితే వర్షానికి ముందు విత్తిన రైతులు మాత్రం కొంత ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం కలుపు కాలం కావడంతో మొక్కల ఏరివేతకు నీటి సమస్య మొదలైంది. విద్యుత్తు కోతల కారణంగా సరఫరా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పలువురు రైతులు విధిలేక పొలాల వద్దకు నీరు తెచ్చుకుని కలుపు తొలగిస్తూ తమ పంటలు కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక వర్షాలతో రబీ సీజన్ ఆరంభంలోనే దెబ్బతిన్న వేరుశనగకు ఏం చేయాలో తోచని పలువురు రైతన్నలు ఆర్థిక భారమైనా చివరకు ట్రాక్టర్ల సాయంతో దున్నేస్తున్నారు. ఇకపై అప్పు చేసి పంటలు సాగు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ మొరపెట్టుకుంటున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటూ గోడు వెల్లబోసుకుంటున్నారు. అధికారులు ఆదుకోకున్నా ఉన్న పంటకు సరిపడా నీరందించేందుకు ఏడు గంటల విద్యుత్తు సరఫరా చేస్తే చాలని కొన్ని ప్రాంతాల రైతులు విన్నవిస్తున్నారు.

Friday, 16 December 2011

ఉప ఎన్నికలంటేనే భయం!

అవిశ్వాస తీర్మానం తెచ్చిన తంటా.. అన్ని రాజకీయ పార్టీల నేతలకు నష్టాలను వెంట తెచ్చినట్లయింది. ఎందుకంటే ఎన్నికలకు చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి గెలిచినా, రెండేళ్లే పదవి ఉంటుంది. ఈ కాలంలోనే అంత సంపాదించుకుంటామా? అంటే అదీ నమ్మకం లేదు. అందుకోసం ఆయా రాజకీయ పార్టీల నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలు బయటికి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల మాత్రం అంతర్మధనం చోటు చేసుకుంది. ఖర్చు తడిసి మోపెడవుతున్న ఉప పోరు పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేందుకు సిద్ధపడడం లేదు. కాకపోతే పరువు ప్రతిష్ఠలు సమస్యగా మారడడంతో అటు రాజకీయ పార్టీలు, నేతలు విధిలేకే ఈ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ ఏడాది మే నెలలో జరిగిన కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అభ్యర్థులకు ఖర్చు వచ్చింది. ఇప్పుడు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటే అటు అభ్యర్థులు, ఆ యా పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మరో ఆరు నెలలు గడుస్తే కేవలం రెండు సంవత్సరాలు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. ఈ రెండేళ్ల కాలానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓడిపోతే కోలుకోవడం కష్టం అవుతుందని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలు పోటీ చేయక తప్పని పరిస్థితి అయినా వారిలో కూడా ఎన్నికల భారం ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. ఈఉప ఎన్నికల ఘట్టం ముగిస్తే మరో రెండు ఏళ్లల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జగన్ వర్గాన్ని జిల్లాలో కట్టడి చేయాలంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బరిలోకి దిగి పరపతిని నిరూపించుకోవలసిన సమయం వచ్చింది.

Monday, 21 November 2011

జై రాయలసీమ సినిమా తీయాలి

 రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో విశాలాంధ్ర కొరకు త్యాగం చేసి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలకు వారసులైన రాయలసీమ త్యాగ నిరతిపై జై రాయలసీమ చిత్రాన్ని సినీ నిర్మాతలు తీయాలని రాయలసీమ ఐక్య వేదిక అధ్యక్షులు పిబివి సుబ్బయ్య కోరారు. ఆదివారం స్ధానిక రవీంద్ర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో సీమ ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై రాయలసీమ చిత్ర నిర్మాణం కోసం తాము సినిమా నిర్మాతలను సంప్రదించాలని, తమ సభ్యులతో కలసి చలన చిత్ర మండలి మాజీ అధ్యక్షులు, నిర్మాత బీవీ రెడ్డిని త్వరలో కలుస్తామని అన్నారు. ఐక్య వేదిక కార్యదర్శి విక్టర్ ఇమ్మానియేలు మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షన్ గురించి, కత్తులు కటారులు చూపడం భావ్యం కాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరగాధలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర ఆధ్యాత్మికతను ప్రధాన భూమికగా చూపాలని అన్నారు. మంచి హృదయంతో కర్నూలు ప్రజలు సమైక్యవాదానికి ప్రతీకగా నిలిచిన కర్నూలు త్యాగ నిరతిని చూపించాలని కోరారు. విద్యార్ధి సంఘాలు, ఐక్య కార్యాచరణ సంఘాలు, రాజకీయవాదులు, మేధావి వర్గాలు వీటిపై స్పందించి తగిన రీతిలో ముందుకు వచ్చి మన త్యాగ నిరతిని సినిమా ద్వారా, సాహితీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాటాలని ఆయన పిలుపునిచ్చారు