Wednesday, 9 November 2011

నాకు డైరెక్టుగా కాల్ చేయండి- చిత్తూరు ఎస్పీ

కాల్‌యువర్ ఎస్పీ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు 08572- 234000 నెంబర్‌కు ఫోన్ చేసి బాధితులను సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 14 కార్యక్రమాల్లో 430 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో భూ తగాదాలు, కోర్టు కేసులను మినహాయించి మిగిలిన సమస్యలను ఆయా స్టేషన్ల ద్వారా పరిష్కరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

తిరుమలలో నో రష్ !

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం అయిదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది

ఓ రైతు రికార్డు: ఎద్దుకు గంతలు కట్టి సాగు

అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన తైదుల ఈశ్వరరెడ్డి పొలంలో బుటారు నాగరాజు  మంగళవారం  వినూత్న ప్రయోగం చేశారు. ఒంటెద్దుకు గంతలు కట్టి పగ్గాలు, పట్టెండ్లు లేకుం డా 12 ఎకరాల్లో జొన్న సాగుచేశాడు. ఉద యం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు సాగు పూర్తిచేశాడు. సాధారణంగా కాడెద్దులతోనే ఎనిమిది గంటల వ్యవధిలో ఇంత విస్తీర్ణంలో సాగుచేయడం కష్టసాధ్యం. అలాం టిది ఒకే ఎద్దుకు గంతలు కట్టి విత్తడం ఆషామాషీకాదు. ఈ దృశ్యాన్ని మండలంలోని పలు గ్రామాల రైతులు తిలకించి యువరైతు నాగరాజును అభినందించారు.

సత్యసాయి జయంతి వేడుకలు త్వరలో

సత్యసాయి బాబా జయంతి వేడుకలు మరో రెండు వారాల్లో జరగనున్నాయి. వీటి కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు ప్రతి జన్మదినం ఒక పర్వదినంలా జరిగేది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, ప్రభుత్వం జన్మదిన ఏర్పాట్లపై మూడునెలల ముందు నుంచే కసరత్తు చేసేవి. వేడుకలకు దేశ,విదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసేవారు. ప్రతి జన్మదినాన బాబా వరాలు కురిపించేవారు. 

విద్య, వైద్యం, తాగునీరు తదితర కార్యక్రమాలకు చేయూతనిచ్చేవారు. సత్యసాయి దివ్యప్రకాశం వల్ల పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. గుడిసెలు పోయి ఆకాశ హార్మ్యాలు వెలిశాయి. మాంద్యం సందర్భాలను ఎరుగక ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తూ వచ్చింది. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో పుట్టపర్తిలో కోట్ల రూపాయల లావాదేవీలు సాగాయి. 

పతినిత్యం వచ్చీ వెళ్లే భక్తులతో పట్టణం కిటకిటలాడేది. బాబా తన దేహాన్ని వదిలి ఇటీవల శివైక్యం చెందారు. బాబా జయంతి వేడుకలపై ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. బాబా పూర్వపు దివ్య వైభవాన్ని సత్యసాయి ట్రస్టు నిర్వాహకులు ఏ విధంగా కొనసాగిస్తారో వేచిచూడాల్సి వుంది. బాబా చివరి కోరికలుగా ప్రచారమవుతున్న వేయి స్తంభాలగుడి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి, సేవలందించే పథకాలను ట్రస్టు ప్రకటించవచ్చని భక్తులు ఎదురుచూస్తున్నారు. 

సివిల్స్ కు ఉచిత శిక్షణ

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) 2012కు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ డాక్టర్ సి.రామాంజినేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

బయోడేటా ఫారం లో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంవత్సరాదాయం, కులం, విద్యార్హతలు, వాటి ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు, రూ.5 విలువైన స్టాంపులు అతికించిన రెండు సెల్ఫ్ అడ్రస్ కవర్లతో ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ఏపీ బీసీ స్టడీ సర్కిల్, అనంతపురం అనే చిరునామాకు పంపాలన్నారు.

Tuesday, 8 November 2011

నేడు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు రాక


 ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.35 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.45కు బయలుదేరి 11.15 గంటలకు పలమనేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు రోడ్డు మార్గంలోగంగవరం చేరుకుని పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు.
                                                                  
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. 1.55గంటలకు పలమనేరు నుంచి బయలుదేరి 2.10 గంటలకు కలికిరి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొం టారు. సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి పీలేరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొం టారు. మళ్లీ సాయంత్రం 6.40 గంటలకు కలికిరికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళుతారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు

రేపు పులివెందులకు జగన్ రాక


                                               
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,  కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 
వైఎస్ జగన్ మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తారన్నారు. 9, 11వ తేదీలలో పులివెందులలో ఉంటారన్నారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారన్నారు. ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించడమే కాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అయితే వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు ఉండవచ్చన్నారు