Friday, 6 January 2012

శ్రీ రామ రాజ్యం యాభై రోజులు వేడుకలో...సిఎం బాలయ్య అంటూ నినాదాలు

శ్రీ రామ రాజ్యం యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన అర్ధశత దినోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ మాట్లాడటానికి వస్తుండగా అభిమానులు ఒక్కసారిగా కాబోయే సిఎం బాలయ్య అంటూ నినాదాలు చేశారు. శ్రీ రామ రాజ్యం అర్ధ శతదినోత్సవ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ... లవకుశ, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు యుగానికి ఒక్కసారే వస్తాయని, రికార్డులు కొట్టేశాం అని జబ్బలు చరుచుకునే వారు ఒక్కసారి ఆలోచించాలని, ఒక సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టిందనేది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నదన్నదే ముఖ్యమన్నారు.నయనతారను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. మీడియా ద్వారా నయనతార నటించవద్దని నిర్ణయం తీసుకుందని తెలుసుకున్నానని, దానిని వెనక్కి తీసుకోవాలని దాసరి సూచించారు. బాలకృష్ణ గొప్ప గొప్ప పాత్రలతో ముందుకెళుతున్నారని ఆయనకు నీలాంటి నటి కావాలన్నారు. సావిత్రి, జయసుధ, జమున వంటి మహానటీమణులు పెళ్లైన తర్వాత కూడా అద్బుతమైన పాత్రలు వేసి మెప్పించారన్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు రాలయసీమ జిల్లాలకు అన్యాయమే

 డీఎస్సీ-12లో జిల్లాకు అతి తక్కువ పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు,డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాకు దాదాపు 500 నుంచి 600 వరకు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం 97 మాత్రమే మంజూరు చేశారని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించకుండా ప్రభుత్వం తక్కువ పోస్టులను కేటాయించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పస్తుత డీఎస్సీలో అనంతపురం జిల్లాకు గణితం-77, భౌతికశాస్త్రం-52, సామాన్యశాస్త్రం-17, ఆంగ్లం-30, సాంఘికశాస్త్రం-66, కర్నూలు జిల్లాకు గణితం-69, భౌతికశాస్త్రం-115,సామాన్యశాస్త్రం-58, ఆంగ్లం-82, సాంఘికశాస్త్రం-84, చిత్తూరుకు గణితం- 94, భౌతికశాస్త్రం-105, సామాన్యశాస్త్రం-18, ఆంగ్లం-68, సాంఘికశాస్త్రం-85 కేటాయించారు. వైఎస్సార్ జిల్లాకు కేటాయించిన 97 పోస్టుల్లో గణితం-21, భౌతికశాస్త్రం-32, సామాన్యశాస్త్రం-2, ఆంగ్లం-20, సాంఘికశాస్త్రం-14 ఉండగా, మిగిలినవి భాషకు సంబంధించినవి. ఈ 97 పోస్టుల్లో కూడా 70 శాతం ప్రమోషన్లు ఇస్తారు. గత నుంచీ అన్యాయమే గత డీఎస్సీల నుంచి కూడా జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేస్తేనే మరికొన్ని పోస్టులను కలుపుతున్నారు. 1994 డీఎస్సీలో అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ రంగారావు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కడపకు 182 పోస్టులు మంజూరు చేశారు. దీన్ని నిరసిస్తూఉద్యమిస్తే అదనంగా 417 ఖాళీలు చూపించారు. డీఎస్సీ-94 రాసిన అభ్యర్థులకు 1997జనవరి 12న అప్పటి కలెక్టర్ బిఆర్ మీనా 198 మందికి పోస్టులిచ్చారు. డీఎస్సీ-2008లో కూడా దాదాపు 596 పోస్టులు ఇచ్చారు. ఇవి తక్కువని పోరాటాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు 90 పోస్టులు పెంచారు. దీంతో ఎస్జీటీ పోస్టులు 646కు పెరిగాయి. వీరిలో ఇంకా 52మందికి ఉద్యాగాలివ్వాల్సి ఉంది. వీరికి హామీ పత్రాలు కూడా ఇచ్చారు.

ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదు..టెట్ డైరెక్టర్

ఈ నెల 8వ తేదీ ఆదివారం నుంచి జరిగే టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు హాజరయ్యే అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదని టెట్ డైరెక్టర్ శేషుకుమారి చెప్పారు. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2100 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీగా చేపట్టాలని అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్ చెన్నకేశవరావు అధికారులను ఆదేశించారు.  రెవెన్యూభవన్‌లో టెట్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ టెట్‌కు విద్యాశాఖ తప్ప ఇతర శాఖల అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొరపాట్లకు తావీయకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల కోసం ఇచ్చే ప్యాకేజ్ మెటిరీయల్స్‌ను అధికారులు సరిచూసుకోవాలని అన్నారు. ఏడో తేదీనే మెటీరియల్ మొత్తం అందిందా, సెంటర్ లో ఫర్నీచర్స్, తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. ఏమైనా లేకపోతే రూట్ అధికారులకు, డీఈఓకు ఫిర్యాదు చేయాలన్నారు పేపర్1 కంటే పేపర్2కు ఎక్కువ మంది అభ్యర్థులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. 1 నుంచి 16 సెంటర్ల అధికారులు ఉదయాన్నే రావాలని, మిగిలిన 89 సెంటర్స్ అధికారులకు మధ్యాహ్నం ఉంటుందని తెలిపారు పోలీస్‌బందోబస్తు కోసం పోలీసుఅధికారులకు లేఖ రాయాలని డీఈఓ ప్రేమానందంను ఆదేశించారు. బుక్‌లెట్లు పరీక్షా సమయానికి గంటముందే కేంద్రానికి అందుతాయని, వాటిని మొత్తం ప్రత్యేక సూపరింటెండెంట్స్ సమక్షంలో తెరవాలని సూచించారు. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించి టెట్ పరీక్షలను విజయవంతం చేయాలని కోరారు.ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు డీఎడ్ అభ్యర్థులకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎడ్ అభ్యర్థులకు పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.

ఆటగాళ్లందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి...కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని

సిడ్నీ టెస్ట్ లో ఇండియా ఓటమికి కారణాలు వెతకడం లేదని కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నాడు. టెస్ట్‌లో ఓటమి అనంతరం మాట్లాడుతూ ప్లేయర్లందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని ధోని చెప్పాడు. మరోవైపు పాంటింగ్‌, హసీలతో పార్ట్‌నర్‌షిప్‌లు ఈ టెస్ట్‌ని మలుపు తిప్పాయని ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అన్నాడు. సిడ్నీలో తను ట్రిపుల్‌ సెంచరీ సాధించడం, సచిన్‌ వికెట్‌ తీసుకోవడం మధురానుభూతులని క్లార్క్‌ చెప్పాడు. భారత్ - ఆసిస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ ఒక ఇన్నింగ్స్, 68 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పొందింది. ఓవర్‌నైట్ స్కోర్ 114/ 2 పరుగులతో బరిలోకి దిగిన భారత్ 400 పరుగులకు ఆల్ఔట్ అయింది. దీంతో ఒక ఇన్నింగ్స్, 68 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సచిన్(80), గంభీర్(83), లక్ష్మణ్(66), అశ్విన్(62) పరుగులు చేశారు.భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 191, రెండో ఇన్నింగ్స్ 400 పరుగులు కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 659/ 4 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్ హిల్ఫెనాస్‌కు 5 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు సాధించిన క్లార్క్‌కు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ దక్కింది. సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది. అనుకున్నట్లే సిడ్నీ టెస్ట్‌లో భారత క్రికెట్‌ జట్టు చిత్తయిపోయింది. టీమిండియాపై ఇన్నింగ్స్, 68 పరుగులతో ఆసీస్ విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌పై గెలవడం ఆసీస్‌కు ఇది పదోసారి కాగా, ఒక్క సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లోనే ఇది మూడోసారి. భారత్ ఓపెనర్‌ గంభీర్‌ 17 పరుగుల తేడాతో, సచిన్‌ 20 పరుగుల తేడాతో సెంచరీలు మిస్సయ్యారు. లక్ష్మణ్‌, ధోనీ, కొహ్లీ అవుటైనా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అశ్విన్ వీరోచితంగా పోరాడటంతో ఆసీస్‌ విజయం కాస్త ఆలస్యమైంది.

అనంతపురం జిల్లా కరువుతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి విముక్తి

కరువుతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి విముక్తి కలిగించాలంటే... కృష్ణాజలాలను జిల్లాకు మళ్లించడమే ఏకైక మార్గమని నాటి గాంధేయవాది అ నంత వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టడం జరిగిందన్నారు. అందుకే హంద్రీనీవా రూపకర్తగా అనంత వెంకటరెడ్డి కీర్తింపబడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే వైఎ స్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీనీవాకు అనం త వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్ర వంతి ప్రాజెక్టుగా పేరుపెట్టారని గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో అనంత వెంకటరెడ్డి 12వ వర్థంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  జరుపుకున్నాయి.పార్టీ నగర అ ధ్యక్షుడు రషీద్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన వర్థంతి సభకు మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కష్టం... న ష్టం.. ఓడినా.. గెలిచినా కాంగ్రెస్ జెం డా అండగా ఉంటుందనే సిద్దాంతాన్ని నమ్మిన నాయకుడు అనంత వెంకటరామిరెడ్డిఅన్నారు. జిల్లా అభివృద్దికి అ నునిత్యం పాటుపడిన రాజకీయ నా యకుడిగా అనంత వెంకటరెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అన్ని వ ర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కో సం ఆయన కృషి చేశారన్నారు. డీసీసీ భవనం ఎస్కేయూనివర్శిటీ, ప్రభుత్వ వైద్య కళాశాల, కరువు నివారణ పథ కం తీసుకురావడంలో అనంత వెంకటరెడ్డికృషి చిరస్మరణీయమన్నారు.ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు నెరపిన నాయకుడిగా అనంత వెంకటరెడ్డి ని కొనియాడారు. గాంధేయవాధిగా అభివర్ణించారు.

Thursday, 5 January 2012

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఆఫర్ చేసిన ఓ అధికారి

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఆఫర్ చేసిన ఓ అధికారి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ దినపత్రిక ఆ మహిళా అధికారి ఉదంతం గురించి రాసింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనే, సాక్షాత్తూ కేబినెట్ మంత్రికే ఒక జిల్లా స్థాయి అధికారి లంచం ఆఫర్ చేశారు. మంత్రి ముందే తన బ్యాగు జిప్పు తీసి, రూ.మూడు లక్షల కరెన్సీ కట్టలు టేబుల్ మీద పెట్టారు. 'ఇది ఉంచండి సార్' అంటూ చెప్పారు. ఇది చూసి మంత్రి విస్తుపోయారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి జయకుమారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఇవ్వజూపిన ఉదంతం ఇది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంటూ ఆ పత్రిక ఇలా రాసింది - తనను బదిలీ చేస్తున్నట్లు జయకుమారికి ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమె సచివాలయానికి వెళ్లారు. మంత్రి రవీంద్రా రెడ్డిని కలిశారు. 'సర్ నను ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటున్నారట!' అంటూ... తనను బదిలీ చేయొద్దని, రంగారెడ్డి జిల్లా అధికారిగానే ఉంచాలని విన్నవించుకున్నాను. ఈ విషయం తనకు తెలియదని, పరిశీలిస్తానని మంత్రి చెప్పారు. కానీ జయకుమారి అక్కడి నుంచి కదల్లేదు.తన వెంట తెచ్చిన బ్యాగు నుంచి రూ.3 లక్షల ఫెళఫెళలాడే కరెన్సీ తీసి, మంత్రి టేబుల్ ముందు పెట్టారు. మంత్రి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని 'ముందు నా చాంబర్ నుంచి బయటికి వెళ్లిపోండి' అని కసురుకున్నారు. ఆ తర్వాత ఆమె మంత్రి డీఎల్ చాంబర్ నుంచి బయటికి వచ్చి ఆయన ఓఎస్‌డీ గౌడ్‌ను కలిశారు.'సార్... ఇది.. ఉంచుకోండి. ట్రాన్స్‌ఫర్ చేయకుండా చూడండి' అంటూ ఈసారి గౌడ్ టేబుల్ మీద రూ.3 లక్షలు పెట్టారు. ఆమె తీరును పసిగట్టిన డీఎల్ ముందుగానే ఓఎస్డీకి ఫోన్ చేసి విషయం చేరవేశారు. వెరసి... ఓఎస్డీ కూడా జయకుమారిని కసిరి పంపారు. ఈ ఉదంతాన్ని మంత్రి ధ్రువీకరించినట్లు ఆ పత్రిక తెలిపింది.

ఒక్కసారే వైకుంఠ దర్శనం : మంత్రి టీ జీ వెంకటేష్

ముస్లింలు మక్కా మసీదుకు ఎలా వెళతారో.. ఆ విధంగా తిరుమల స్వామివారిని కూడా ఏడాదికోసారి మాత్రమే దర్శించుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ సూచించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తాను మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల వచ్చానన్నారు. తాను క్యూలైన్లో వెళ్లేటప్పుడు చాలామంది భక్తులు పలుసార్లు వచ్చామని చెప్పారన్నారు. అందుకని భక్తులు తమ జీవితంలో ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశికి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక భక్తులు త్వరితగతిన ఆలయం వెలుపలకు వచ్చేలా గర్భగుడి తప్ప మిగిలిన ప్రాంతాల్లోని క్యూలైన్లను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయాలన్నారు. మఠ, పీఠాధిపతుల సలహాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తెలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన క్యూలైను ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులను మంత్రి కోరారు.