Tuesday, 8 November 2011

నేడు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు రాక


 ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.35 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.45కు బయలుదేరి 11.15 గంటలకు పలమనేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు రోడ్డు మార్గంలోగంగవరం చేరుకుని పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు.
                                                                  
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. 1.55గంటలకు పలమనేరు నుంచి బయలుదేరి 2.10 గంటలకు కలికిరి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొం టారు. సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి పీలేరుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొం టారు. మళ్లీ సాయంత్రం 6.40 గంటలకు కలికిరికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళుతారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు

రేపు పులివెందులకు జగన్ రాక


                                               
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,  కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 
వైఎస్ జగన్ మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తారన్నారు. 9, 11వ తేదీలలో పులివెందులలో ఉంటారన్నారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారన్నారు. ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించడమే కాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అయితే వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు ఉండవచ్చన్నారు

Monday, 7 November 2011

సంజయ్ నయాపైసా ఇవ్వలేదు: నాగార్జున

                                                     
నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్, చాలా పద్దతి గల మనిషి,దేని లెక్క దానిదే అన్నట్లు ఉంటాడు వంటివన్నీ చెప్తుంటారు.అయితే తాజాగా హైదరాబాద్ కి వచ్చిన సంజయ్ దత్ నాగార్జునపై ఓ కామెంట్ చేసాడు.'చంద్రలేఖ'లో కనిపించినందుకు తనకు నయాపైసా కూడా ఇవ్వలేదని,అందుకే తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని డైరక్ట్ గా మొహమాటం లేకుండా అనేసాడు.కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున స్వయంగా తన బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'చంద్రలేఖ'.మోహన్‌ లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ డైరక్షన్‌లో మలయాళంలో వచ్చిన చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడలేదు.అయితే అందులో వెరైటీగా ఉంటుందని ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని తీసుకొచ్చారు.ఆయన పాపం నాగార్జునపై ఉన్న గౌరవమో మరేమో కానీ..తనకున్న ప్యాన్ ఫాలోయింగ్ ని ప్రక్కన పెట్టి నటించాడు. అయితే అందుకు రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదని ఇన్నాళ్ళ తర్వాత ఆయన బయిట పెట్టారు

నాగార్జున హెయిల్ స్టైల్ కోసం ఇరవై లక్షలు రూపాయలు

                                             
నాగార్జున హెయిల్ స్టైల్ కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి స్టీవ్ అనే స్పెషలిస్టుని రప్పించి చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందునిమిత్తం ఇరవై లక్షలు రూపాయలు వరకూ ఖర్చుపెట్టారని ఓ ఆంగ్ల పత్రిక కథనం. అయితే అది ఢమురకం నిర్మాత బడ్జెట్ లోది కావటం విశేషం. ఇక ఈ విషయాన్ని చాలా పాజిటివ్ గా చెప్తూ.. ఆయన తన సినిమా పట్ల చాలా శ్రద్ద ఉన్న మనిషి. ప్రతీ విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. హెయిర్ స్టైయిల్ కూడా ప్రేక్షకుల్లో ఓ విధమైన ఇంపాక్ట్ కలగచేస్తుందని ఆయన ఇలా డబ్బు ఖర్చైనా సరే అని నిపుణుల సలహాలు, సూచనలుతో తనను తాను మార్చుకుంటున్నారు. అందుకే నాగార్జున నిత్య మన్మధుడులాగ ఉంటున్నాడని అంటున్నారు. ఇక రాజన్నలోనూ ఆ గెటప్ కి హెయిర్ స్టైల్ ని స్టీవే డిజైన్ చేసినట్లు చెప్తున్నారు

డబ్బింగ్ సినిమాలకు కళ్లెం వేయాలని తెలుగు ఫిలిం ఛేంబర్ నిర్ణయం

డబ్బింగ్ సినిమాల జోరుకు కళ్లెం వేయాలని తెలుగు ఫిలిం ఛేంబర్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో డబ్బింగ్ సినిమాలు తెలుగులో విపరీతంగా విడుదలవుతూ ఇక్కడి డబ్బులను కొల్లగొట్టకుని పోతున్నట్లు చెబుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఖరారు చేసి, అమలు చేయడానికి ఫిలిం ఛేంబర్ ఓ కమిటీని వేసింది. సురేష్ బాబు, దిల్ రాజు, విజయేందర్ రెడ్డి, నట్టి కుమార్‌లతో కూడిన ప్రత్యేక కమిటీ డబ్బింగ్ సినిమాలను నియంత్రిస్తుంది. డబ్బింగ్ సినిమాలపై ఉన్న 20 శాతం పన్నును 50 శాతానికి పెంచాలని కూడా నిర్ణయించారు. 
పండుగ రోజుల్లో డబ్బింగ్ సినిమాల విడుదలకు అవకాశం ఉండదు. సంక్రాంతి, దసరా, వినాయక చవితి, దీపావళి పర్వదినాల్లో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని, తెలుగు సినిమాల విడుదలకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. డబ్బింగ్ సినిమాలకు సంబంధించి 85 ప్రింట్లకు మించి అవకాశం ఇవ్వకూడదని కూడా అంటున్నారు. ఈ ఆంక్షలు ఇదివరకు ఉన్నవేనని, వాటి అమలు సక్రమంగా జరగడం లేదని, ఇప్పుడు ఆ ఆకాంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని మాత్రమే నిర్ణయించారని అంటున్నారు

రాయల సంపద శిథిలమవుతోంది!

 శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న అనంతపురం జిల్లాలో రాయల సంపద శిథిలమవుతోంది. రాజగోపురాలు నెర్రెలతో వెక్కిరిస్తున్నాయి. ధ్వజస్తంభాలు నేలకొరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తవ్విన గుంతలు, ధ్వంసమైన విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చారిత్రక జ్ఞాపకాలు చెదిరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ఆలయాల దుస్థితిపై భక్తుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక్కడి ప్రముఖ దేవాలయాల్లో రాజగోపురాలు, ధ్వజస్తంభాల పరిస్థితిని పరిశీలిస్తే...
                                   
* తాడిపత్రిలో చింతల వెంకటరమణస్వామి గాలిగోపురం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 500ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ ఆలయ గోపురం ఆరేళ్ల క్రితం కూలిపోయింది. ఆ తర్వాత పునరుద్ధరించినా ఫలితం కనిపించడంలేదు. గాలి గోపురం భద్రత గాలిలో దీపంగా మారింది. అధికారుల అవినీతి, నాసిరకం పనుల వల్ల నెర్రెలు చీలి ఏ క్షణంలో కూలుతుందో తెలియని స్థితిలో ఉంది. 
దీనికితోడు ఇటీవలే పిడుగు తాకిడికి గాలి గోపురం పైభాగం కొంతమేర దెబ్బతిన్నది. క్రీ.శ.1490 నుంచి 1520 సంవత్సరాల మధ్య కాలంలో పెమ్మసాని తిమ్మనాయకుడు ఈ గుడిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయంలో శిల్పకళా శోభితమైన మండపాలు, మహాద్వార గోపురాలు నిర్మించారు. ఘనద్వారం, గాలి గోపురాలు తూర్పు దిశలో ఉన్నాయి. వాటి ముందు ఊయల మండపం, ఎత్తయిన దీపస్తంభాలున్నాయి. ఏక శిలా రథం కూడా ఉంది. దానిలోని రంధ్రాల నుంచి ఏడాదికి రెండుసార్లు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించడం ఇక్కడి విశిష్టత. 
* ఉరవకొండ పరిధిలోని పెన్నోబిళంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా రాయలకాలం నాటిదే. దీని ఉత్తర, దక్షిణ గోపురాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో వీటికి మరమ్మతులు చేసిన్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాజగోపురాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమంటూ భక్తులు మండిపడుతున్నారు.
* రాయదుర్గం పట్టణ సమీపంలోని కొండ మీద మాదవరాయస్వామి పురాతన దేవాలయం ఉంది. ఇక్కడ గుప్తనిధుల కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరిగాయి. దీంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. భక్తులు అక్కడకు వెళ్లేందుకే భయపడుతున్నారు. 
* రాయలు విడిది చేసిన ప్రాంతం పెనుకొండ. ఇక్కడి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని రాయల కాలంనాటి దీప స్తంభం ధ్వంసమైంది. ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. గత ఏడాది గగనమహల్‌తోపాటు మరికొన్ని కట్టడాలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. 
*బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గుప్తనిధుల కోసం విగ్రహాలను పెకిలించారు. ఆలయమంతా గుంతలతో నిండిపోయింది. 
* కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పు రాజగోపురం నెర్రెలు చీలింది. అయినా అధికారుల్లో చలనం లేదు. మరోవైపు పడమర, ఉత్తర రాజగోపురాలపై మొక్కలు పెరుగుతున్నాయి. అధికారులు కనీసం వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయడంలేదు

ఓటరు జాబితాల్లో పేర్ల నమోదు చేసుకోండి

ఓటరు జాబితాలో కొత్తవారి పేర్లను నమోదు చేయాలని తహసీల్దార్ దొరస్వామి బూత్‌లెవల్ ఆఫీసర్లకు ఆదేశించారు. స్థానిక కార్యాలయం లో విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల చివరిదాకా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. 18ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటుహక్కుకో సం దరఖాస్తుచేసుకోవాల్సిందిగా సూ చించారు. అలాగే ఓటరు కార్డులో పేరు మార్పుకోసం ఒకరు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ నిర్వాహకులు పకడ్బందీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్న కార్యాలయంలో రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు