Monday, 31 October 2011

కర్నూలు జిల్లా లో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం కూలిపోయింది

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు

యువరాజ్ సింగ్ దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు

                                            
తన చిరకాల స్వప్నమైన ‘యువరాజ్ సింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ను భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ సోమవారం గుర్గావ్‌లో ప్రారంభించారు. ఈ క్రికెట్ అకాడమీలో యువ క్రికెట్ క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణను అందించనున్నాడు. నైపుణ్యం కలిగిన కోచ్‌ల సహాయంతో ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ సౌకర్యాల్ని అందించనున్నాడు. దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ యంత్రాలతోపాటు, జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలను యువరాజ్ సింగ్ ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులతోపాటు, ఇతర వర్గాలకు కూడా అకాడమీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు

రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి ఏసీ క్లాస్ టిక్కెట్లు కొన్నవారందరూ రూ. పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. దీన్ని ప్రయోగాత్మకంగా తిరుపతిలో ప్రారంభించారు. ఇది సఫలమైతే ఈ విశ్రాంతి గదుల నిర్వహణను ప్రైవేటుపరం చేసే అవకాశముంది. ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఏసీ, స్లీపర్ సాధారణ క్లాస్‌లలో ప్రయాణించే వారే రైలు వచ్చే వరకు ఏసీ గదుల్లో ఉచితంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇక స్లీపర్ క్లాస్ ప్రయాణికులు స్లీపర్ క్లాస్ విశ్రాంతి గదుల్లో ఉండొచ్చు. వీరు తమ టిక్కెట్లను గదుల రికార్డులో నమోదు చేసి ఉచితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఇకపై రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కరు రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రచారం లేకపోవడంతో పెద్ద సమస్యగా లేదు. ఒకవేళ అందరూ రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవాలంటే తిరుపతిలో సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎందుకంటే స్టేషన్‌లో ఉండేవి రెండు ఏసీ విశ్రాంతి గదులే. అందులో 80 సీట్లు ఉన్నాయి. తిరుపతి నుంచి వెళ్లే ఏసీ క్లాస్ ప్రయాణికులకే ఇవి చాలవు. అలాంటిది అందరూ విశ్రాంతి కోసం వస్తే ఎలా సాధ్యమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు

Sunday, 30 October 2011

‘దమ్ము’ చిత్రంలో ఎన్టీఆర్, త్రిష

                                   
‘దమ్ము’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన త్రిష నటించటం దాదాపు ఖరారైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ కనిపిస్తారు. మాకందిన అధికారిక సమాచారం ప్రకారం శుక్రవారం నుంచి త్రిష షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్స్ పై ఓ పాట షూట్ చేయనున్నారు. యంగ్ టైగర్ సరసన త్రిష తొలిసారి జతకడుతోంది. కాగా, కార్తీక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించటం ఖాయమైంది

త్వరలోనే చరణ్, అర్జున్ సినిమా


మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్నకాంబినేషన్ సాకారం కాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకే చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి పైడిపల్లి వంశీ దర్శకత్వం వహిస్తారు. నిర్మాత దిల్ రాజు
                            .
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ చిత్రం లో మెయిన్ హీరోగా నటించబోతున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోలూ ఈ సినిమా లో నటిస్తున్నప్పటికీ, వీరిరువురూ ఒకే సారి తెరపై కనిపించరు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక కీలక మైన పాత్రను అల్లు అర్జున్ పోషించబోతున్నారని సమాచారం.
మొత్తానికి ఈ వార్త చరణ్, అర్జున్ అభిమానులిద్దరికీ ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరుంటారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మూవీకి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు

                             
కరువు ప్రాంతాల ప్రకటనతో రైతులకు ఒరిగేదేమిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకువచ్చిన ఆయన ప్రభుత్వాస్పత్రి, వివాదాస్పద మిస్సమ్మ కాంపౌండ్ స్థలాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది తాము అడిగిన దానికంటే ఎక్కువగానే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నప్పటికీ...ఆచరణలో మాత్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్భాటంగా కరువు మండలాలను ప్రకటించడం... ఆ తర్వాత చేతులెత్తేయడం రివాజుగా మా రుతోందని విమర్శించారు. పక్షం రోజుల్లో కరువు మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ రూపొందించి సాయం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టడమే కాకుండా... ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి 3 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఆదివారం ప్రసారం చేసింది. అనుమతులకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వ భవనంలో ఉంటున్నారని, అందుకు ఆయన మూడు లక్షల రూపాయలు కేంద్రానికి బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు మాత్రమే కేటాయించే భవనాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం వైయస్ జగన్‌కు కేటాయించింది. కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఆ భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకుగాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. 

కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెసు నేత జి. వెంకటస్వామి కూడా తనకు గతంలో కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అందుకు గాను ఆయన కేంద్ర ప్రభుత్వానికి రూ. 30 లక్షలు బాకీ పడ్డారని ఆ తెలుగు టీవీ చానెల్ తెలిపింది. ఇదిలా వుంటే, వార్త దినపత్రిక అధిపతి, మాజీ పార్లమెంటు సభ్యుడు గిరీష్ సంఘీ కూడా అనుమతులకు విరుద్ధంగా ఓ భవనంలో ఉన్నారని చెప్పింది. అయితే, ఆయన చెల్లించాల్సిన బాకీ ఏమీ లేదని తెలుస్తోంది