Friday, 21 October 2011

కిరణ్ అనంత పర్యటన జెసి దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు

 అనంతపురం సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు డుమ్మా కొట్టారు. కిరణ్ శుక్రవారం ఆయన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయారు. జిల్లా మంత్రి రఘువీరా రెడ్డితో సహా మిగిలిన నేతలతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇటీవల పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రజారాజ్యం పార్టీ జిల్లా విలీన సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. అయితే ఆయన వర్గం నేతలు మాత్రం హాజరై హంగామా చేస్తారు!

కిరణ్ అనంత పర్యటన, తన గైర్హాజరీపై హైదరాబాదులో ఉన్న ఆయనను మీడియా కదిలించగా తాను కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని, ఆప్తుడిని అయినందు వల్లే పర్యటనలో పాల్గొనలేదని చెప్పారు. తనకు హైదరాబాదులో వేరే కార్యక్రమం ఉన్నందున సమయం చిక్కలేదని చెప్పారు. కాగా కిరణ్ మంత్రివర్గంలో ఆశలు పెట్టుకున్నప్పటికీ జెసికి చోటు దక్కక పోవడం గమనార్హం

కర్నూలు జిల్లా ల్లో సీబీఐ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది

వెల్దుర్తి, బేతంచెర్ల, ఓర్వకల్లు మండలాల్లోని ఆయా ప్రాంతా ల్లో ఇనుప ఖనిజం నిక్షేపాలు విస్తృత్తంగా ఉన్నాయి. మొత్తం 28మందికి ఇనుప ఖనిజం లీజులున్నాయి. గత ఆరేళ్లుగా మార్కెట్లో ఐరన్ఓర్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇదే అవకాశంగా చేసుకొని లీజుదారులు, అక్ర మ మైనింగ్‌దారులు రూ.కోట్లు గడించారు. అక్రమంగా తవ్వకాలు జరిపిన ఖనిజాన్ని లీజుదారులు తమ యార్డులకు తరలించారు.
                                   
చివరకు ప్రభుత్వ భూములు, దేవాయదాయశాఖ భూ ములను వదిలి పెట్టలేదు. వాటికి తో డు లీజుమైనింగ్ ప్రాంతాల్లో ఖనిజం తవ్వకున్నా.. భారీ ఎత్తున రాయల్టీలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే రాయల్టీలను ఓఎంసీకి తరలించినట్టు తెలుస్తోంది. భూగర్భ గనుల శాఖ అధికారుల అండదండలతోనే ఈ తంతు నిరాటకంగా సాగిన ట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో గాలిజనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత.. జిల్లా ఇనుప ఖనిజం తవ్వకాల్లో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది

సచిన్‌కు భారీ జరిమానా



కొత్త ఇంటి మురిపెం తీరముందే బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భారీ జరిమానా వడ్డించింది. ఎంతో ముచ్చటపడి ముంబయి శివారు ప్రాంతం బాంద్రాలో ఓ పాత భవంతిని కొనుగోలు చేసి దాన్ని తన అభిరుచులకనుగుణంగా ఆధునీకరించుకున్న సచిన్... ఆ ఐదు అంతస్థుల కొత్త ఇంటికి బీఎంసీ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ (ఓసీ) తీసుకోలేదట.

దీంతో బీఎంసీ ఈ మాస్టర్‌బ్లాస్టర్‌కు రూ. 4.35 లక్షల మేరకు పెనాల్టీ విధించింది. ఈ జరిమానాను సచిన్ చెల్లించినట్టు సమాచారం. కాగా, బీఎంసీ అధికారి ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ, ముందు జరిమానా చెల్లించాల్సిందేనని, ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో ఓసీ పొందవచ్చని వెల్లడించారు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దీపావళి రోజున ప్రత్యేకపూజ

                                  
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో 26వ తేదీన దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా అశ్వయుజమాసం అమావాస్య నాడు వచ్చే దీపావళి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలోని బంగారువాకిలిలో ఆరోజు ఉదయం 7-9గంటల మధ్య అర్చకులు ప్రత్యేక ఆస్థాన వేడుకలను నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉభయ నాంచారులతో కూడి మలయప్పస్వామి ఘంటా మండపానికి వేంచేస్తారు. సర్వభూపాల వాహనంలో స్వామివార్లను గరుడాళ్వారులకు అభిముఖంగా ఏర్పాటు చేస్తారు. సేనాధిపతి విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ వైపున మరొక పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేస్తారు. తరువాత స్వామివార్లకు ప్రత్యేకపూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆ రోజున శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీ సేవలను రద్దు చేశారు. మిగిలిన సేవలను యథావిధిగా నిర్వహించనున్నా

రాష్ట్ర విభజన ఎవరికీ మంచిది కాదు

                         
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా నష్టపోయింది తెలంగాణ వాళ్లే.. రాష్ట్ర విభజన ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కోదండరాం రెచ్చగొడుతున్నారు. ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి' అని మంత్రి శైలజానాథ్ పేర్కొ న్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి కేసీఆర్ వర్గానికి చెందిన కొందరికి పోలవరం ప్రా జెక్టు పనులు ఇచ్చారనే ఆరోపణలపై మంత్రిని విలేఖరులు ప్రశ్నించగా అదంతా సోనియమ్మ చూసుకుంటారని బదులిచ్చారు. కేసీఆర్, కోదండరాం లాంటి వాళ్లు సొంత లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టి శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. రైల్‌రోకోలు.. బస్సుల బంద్ లాంటివాటిని సకల జనుల సమ్మె పేరుతో నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు

తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కౌంట్ డౌన్‌ను ప్రారంభించింది

                   
తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కౌంట్ డౌన్‌ను ప్రారంభించిందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖా మంత్రి, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీనర్ టీజీ వెంకటేష్ అన్నారు. ఆయన గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఇటీవల వరకు కొనసాగిన సకల జనుల సమ్మెతో ఆ ప్రాంత నాయకులు తమ ఉనికిని చాటుకున్నారని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర సమస్య కేవలం ఒక్క తెలంగాణకు సంబంధించినది కాదని దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందని అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని తీసుకునేందుకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ఉద్యమాలు చేయడం మానేసి ఇక తమ ప్రాంత అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రాంత నేతలకు ఆయన హితవు పలికారు. సకల జనుల సమ్మె కారణంగా ప్రధానంగా ఏర్పడిన విద్యుత్ సమస్యతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఎంతో నష్టపోయాయన్న విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలని కోరారు. వర్షాలులేక, విద్యుత్ కోతతో నీరందక లక్షల ఎకరాల్లో పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని తీసుకునే వరకు తెలంగాణలో శాంతియుత పరిస్థితులను కల్పించి అభివృద్ధికి నాంది పలకాలని కోరారు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరపున సీమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 22న కర్నూలులో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి సీమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని పార్టీల వారు మద్దతు తెలిపి ఆయనకు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు సహకరించాలన్నారు. సీమను దేశంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో హక్కుల వేదిక పనిచేస్తోందన్నారు. తాము ఎప్పటికీ సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉంటామని, ఐక్యతతోనే దేన్నైనా సాధిస్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగిపోయేలా ముఖ్యమంత్రి కృషి చేశారని ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమకు ఎంతో కొంత మంచే జరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో రాయలసీమను ఫాక్షన్ భూతం వెంటాడిందని ఎపుడైతే మంచి పంటలు పండి నాయకులు, వారి అనుచరులకు డబ్బులు రావడం ప్రారంభించాయో ఆ రోజు నుంచి ఫ్యాక్షన్ తగ్గిందని ఆయన గుర్తుచేశారు. ఇదే విధంగా అభివృద్ధి జరిగితే సాధారణ నేరాలు కూడా జరుగవని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నాయకులు కూడా ఇదే విధంగా అభివృద్ధి కోసం పోరాడుతూ ప్రత్యేక ప్యాకేజీలను పొంది తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీజీ వెంకటేష్ సూచించారు

డెంగ్యూ , మలేరియా, క్యాన్సర్ రోగులకు (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ సెపరేషన్ యూనిట్)చికిత్స మిషన్

: పేద, మధ్యతరగతి కుటుంబాల రోగులకు వరం డెంగ్యూ వ్యాధి నిర్ధారణ చికిత్స మిషన్ (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ సెపరేషన్ యూనిట్)ను అన్నదాత ఎంపి ఎస్పీవై రెడ్డి విరాళంగా అందించడం ఎంతో అభినందించదగ్గ విషయమని కలెక్టర్ రాంశంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల వైద్య విధాన పరిషత్‌లో ఎంపి ఎస్పీవై రెడ్డి విరాళంగా అందజేసిన మిషన్‌ను కలెక్టర్ రాంశంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కర్నూలుతోపాటు నంద్యాలలో కూడా రూ.13లక్షలు విలువ చేసే మిషన్‌ను ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. దీనివల్ల రోగులు కర్నూలుకు రావాల్సిన అవసరం లేదని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ వ్యాధి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని దీనివల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వారు రోగం వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక వ్యయం చేసి చికిత్సలు చేయించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే రూ.10వేల నుంచి రూ.20వేల వరకూ వ్యయం అవుతుందని, అయితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఈ మిషన్ ద్వారా రూ.5,500లకే చికిత్సలు చేస్తారని తెలిపారు. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ మిషన్ డెంగ్యూ వ్యాధితోపాటు మలేరియా, క్యాన్సర్ రోగులకు కూడా చికిత్సలు చేయవచ్చన్నారు. మిషన్ ద్వారా వ్యాధి వచ్చిన రోగికి గంటపాటు చికిత్స చేయవచ్చన్నారు. ఈ మిషన్ ద్వారా రోగికి వచ్చిన వైరస్‌ను తొలగించి కొత్త రక్తం ద్వారా స్వస్థత చేకూర్చవచ్చన్నారు. ఎంపి ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మిషన్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. తాను ఎప్పుడూ పేద రోగులకు అండగా ఉంటానని తెలిపారు. మిషన్‌ను ఆపరేట్ చేయడానికి ముగ్గురు టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చి ఏర్పాటుచేయడం జరిగిందన్నారు