Thursday, 26 January 2012

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ...నందమూరి బాలకృష్ణ

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు.తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి ఇటీవల వరకు చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్వుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని పెట్టిన వారు ఆ తర్వాత అమ్మేసుకున్నారని, తనను ఎవడో బాలుడు అన్నారని, పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవి పైనా పోటీకి సిద్ధమని ఇటీవల వివిధ సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. మిగతా అంశాలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని బాలయ్య తెలిపారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల సేవను కొనియాడారు.
నమస్తే రాయలసీమ డాట్ కాం      పాఠకులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు





పులివెందుల్లో సోలార్ వెలుగులు

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కాబోతోంది. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.100 కోట్లతో 38.23 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను వెల్స్‌ఫన్ కంపెనీ చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం చివరి దశలో సాగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి చెందిన వెల్స్‌పన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమైంది. అప్పుడే పులివెందుల పారిశ్రామికవాడలో 38.23 ఎకరాలు కొనుగోలు చేసింది. వెల్స్‌పన్ సోలార్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పులివెందుల్లో ఆరు నెలల క్రితం సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. సూర్యకాంతి ద్వారా (సోలార్) విద్యుత్తును ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రం పులివెందుల్లో ప్రారంభం కాబోతోంది. వెల్స్‌పన్ సంస్థ దాదాపు రూ.100 కోట్లతో ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యుత్తు కేంద్రంలో 5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.14 కోట్ల వంతున 5 మెగావాట్లకు రూ.74 కోట్లు, అలాగే భూమి కొనుగోలు, ఇతరత్రా పనులకు మరో రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్యానల్ బోర్డులు అమర్చే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. అలాగే దీనికి సంబంధించిన విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును పక్కనే ఉన్న 220 కేవీఏ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అందించనున్నారు. అక్కడి నుంచి ఈ విద్యుత్తును వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ విద్యుత్తు ప్లాంట్ మరికొన్ని రోజుల్లోనే విద్యుత్తు ఉత్పత్తిని చేయబోతోంది. ఈ ప్లాంట్ విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తే జిల్లాలో విద్యుత్తు కొరత కొంతవరకు తీరనుంది.

అనంతపురం జిల్లాలో రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్

మండలంలోని వడియంపేట గ్రామంలో ఇరువర్గాలకు చెందిన రౌడీషీటర్లుకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుస్తు చర్యగా ఎస్ఐ నారాయణరెడ్డి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదుగురు రౌడీషీటర్లును గుర్తించారు. వారిని అనంతపురం డీఎస్పీ దయానందరెడ్డి ఎదుట హాజరుపరిచారు.గ్రామంలో అధిపత్యం కోసం ఇరువర్గాలు ఘర్షణలు,బెదిరింపులు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. గతంలో జరిగిన సంఘటనలు పునురావృత్తం కాకుండా చూడాలని మాజీ సర్పంచ్ పీ శ్రీనివాసులుకు సూచించారు. ప్రస్తుతం 12 సంవత్సరాల అనంతరం గ్రామంలోకి వచ్చిన రౌడీషీటర్ శ్రీరాములను తిరిగి గ్రామబహిస్కరణ చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. ముందుస్తు జాగ్రత్తగా ఐదుగురు రౌడీ షీటర్లు గంధం రవి, తలారి కాశీం, పరిశే నరసింహలు, పరిశే శ్రీనివాసులు, గంధం శ్రీరాములును తహీసీల్దార్ నాగరాజు వద్ద 50 వేల పూచీకత్తుతో బైండోవర్ చేశారు.గ్రామాల వారీగా రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్- ఎస్ఐ త్వరలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంఘటనల జరగుకుండా ముందస్తు భాగంగా రౌడీషీటర్లు, ఫ్యాక్షన్ నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల వారీగా తొలుత రౌడీషీటర్లును గుర్తించి వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. అనంతరం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామల్లో ఉన్న ఇరు వర్గాల నేతలకు కూడ దశలవారిగా కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు

ర్యాగింగ్ చేయొద్దన్నందుకు దాడి

ఓ విద్యార్థిపై దాడి చేసిన కేసులో ఏడుగురు విద్యార్థులను చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న జ్ఞానేంద్రనాయుడు, సాయికృష్ణ, శరత్‌కుమార్, నిరంజన్, వినోద్, భరత్, దిలీప్‌లు స్నేహితులు. వీరందరూ నెల క్రితం మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే వీరిలో జ్ఞానేంద్రనాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరి మధ్యన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాలేజీ విడిచిపెట్టిన తరువాత జ్ఞానేంద్రనాయుడు మోటార్ సైకిల్‌పై తిరుపతి వెళుతుండగా, మిగిలిన ఆరుగురు దాడి కి పాల్పడ్డారు. ఇందుకు కేఎంఎం కాలేజీకి చెందిన భరత్ సహాయం తీసుకున్నారు. దీనిపై బాధితుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ఆ ఏడుగురిని అరెస్టు చేశారు. ర్యాగింగ్ చేయడం తగదని చెప్పినందుకు కక్షకట్టి దాడుల వరకు వెళ్లిన ఆ విద్యార్థులను చంద్రగిరి సీఐ నాగభూషణం తీవ్రంగా మందలించారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాక దాడికి పాల్పడ్డ విద్యార్థుల గురించి ఆయా కాలేజీల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ర్యాగింగ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Tuesday, 24 January 2012

జన గణ మన కు వందేళ్ళు పూర్తి

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదిన వేడుకలు, ఆయన విరచిత జాతీయ గీతం 'జనగణమన' వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతానికి స్వరకల్పన జరిగిన మదనపల్లి బిటి కళాశాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, 10 వేలమంది విద్యార్ధులతో కలిసి 'జనగణమన' గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ కాలేజీ ప్రహరీ గోడకై రూ.2 కోట్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన రచించిన జాతీయ గీతం భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం కొనియాడారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు.ఏ గీతం వింటే దేశవిదేశాల్లోని భారతీయుల హృదయాలు పులకరిస్తాయో. దేశంలోని 120 కోట్ల మంది లేచి నిల్చుని గౌరవిస్తారో అలాంటి జాతీయగీతాన్ని మంగళవారం మదనపల్లెలోని బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో పదివేల మంది విద్యార్థులు ముక్తకంఠంతో 20సార్లు జాతీయగీతాన్ని ఆలపించి రెండు లక్షల గళార్చన పూర్తిచేశారు.తొలుత బెంగాలీలో రచించిన ఈ గీతాన్ని మదనపల్లె బీటీ కళాశాల సందర్శనార్థం ఇక్కడికి వచ్చిన ఠాగూర్ ఆంగ్లంలోకి తర్జుమా చేయడం ద్వారా మదనపల్లెకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. జనగణమన గీతానికి ఎంతటి గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నామో, అంతటికంటే మించిన విశ్వవ్యాప్త గౌరవం కూడా దక్కింది. 1911లో మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయనేత, రాజ్యసభసభ్యుడు వెంకయ్యనాయుడు, చిరంజీవి, మంత్రులు రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

పరిటాల రవీంద్ర వర్థంతి ఘనంగా

మాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల రవి ఏడో వర్థంతి కార్యక్రమం కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలమధ్య మంగళవారం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాలఘాట్‌ వద్ద రవి భార్య సునీత, కుటుంబసభ్యులు ఆయనకు నివాళి అర్పించారు. రవి వర్థంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల ఘాట్ అలంకరణకు థాయ్ లాండ్, ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా పుష్పాలు తెప్పించారు. ఇక బెంగుళూరుకు చెందిన కళాకారులు ఘాట్ ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవారం పరిటాల రవీంద్ర ఏడవవర్ధంతి మండలంలోని వెంకటాపురంలో  ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర ఘాట్‌ని ప్రత్యేకంగా అలంకరించారు. పరిటాల రవీంద్రమెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదానశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదానశిబిరం నిర్వహణ బాధ్యతలను పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ చేపట్టారు. ప్రధానంగా రక్తదాన శిబిరంలో 130పడకలు ఏర్పాటు చేశారు.రక్తదానశిబిరం ద్వారా పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితర దాతలు ఇచ్చే రక్తాన్ని సేకరించడానికి అనంతపురం ప్రభుత్వవైద్యశాల సిబ్బంది, రెడ్‌క్రాస్‌సొసైటీ, ఆర్‌డీటీ, ఎన్టీఆర్ ట్రస్ట్, తలసీమియా సొసైటీకి చెందిన వైద్య బృందం మంగళవారం ఉదయాన్నే వెంకటాపురం చేరుకోనుంది.  ఉదయం తొమ్మిది గంటలకు రక్తదానశిబిరాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా ప్రజల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన పరిటాల రవి తనయుడు శ్రీరామ్ ఆధ్వర్యంలో మొదటిసారి కార్యక్రమం జరుగుతుండడంతో పలువురు అభిమానులు ఉత్సాహంగా ఆయనకు మద్ధతుగా నిలిచి తమ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. అంతే కాకుండా పరిటాల శ్రీరామ్‌తో పరిచయం కోసం తహతహలాడుతున్నారు.