Showing posts with label అక్కినేని నాగార్జున. Show all posts
Showing posts with label అక్కినేని నాగార్జున. Show all posts

Monday, 27 February 2012

రాజకీయాలకు సూట్ కాను ....నాగార్జున

రాజకీయాలంటే ఇష్టమని చెప్పానుకాని, వస్తానని చెప్పలేదని యువసామ్రాట్ నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు ఓ నమస్కారం అంటూ తను రాజకీయాల్లోకి రావడంలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని చెప్పారు. మంచి రాజకీయ నాయకులు మనకు అవసరమని చెప్పారు. అయితే తాను రాజకీయాలకు సూట్ కానని నాగార్జున చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని చెప్పారు.అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. నాగార్జున త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పారు. టాప్ హీరోల్లో చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. బాలకృష్ణ కూడా 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అదే దారిలో ఇప్పుడు నాగార్జున రానున్నారని జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున మాత్రం తాను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేసి చర్చకు తెరదించే ప్రయత్నాలు చేశారు. అసలు నాగార్జున రాజకీయాలపై కామెంట్ చేసిన రోజే తాను రానని స్పష్టం చేసినప్పటికీ ఆరంగేట్రంపై జోరుగా చర్చ జరగడం విశేషం.

 



Saturday, 25 February 2012

రాజకీయాలంటే ఆసక్తి...అక్కినేని నాగార్జున

తనకు రాజకీయాలంటే ఆసక్తి అని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున మీడియాకు వెల్లడించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉందని.. రాజకీయాల్ని తాను అనుసరిస్తు ఉంటానన్నారు. అయితే తాను రాజకీయాలకు సరిపోతానో లేదో తెలియదని ఆయన అన్నారు.శనివారం తిరుపతిలోని కళ్యాణ్‌జ్యువెలరీ ప్రారంభోత్సవంలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని అన్నారు.తనకు భక్తిరస ఆధ్యాత్మిక చిత్రాలు చేయడమంటే ఇష్టమని నాగార్జున తెలిపారు. షిరిడి సాయిబాబా చిత్రంలో నియమనిష్టలతో పాల్గొంటున్నాని అన్నారు. తమ చిన్న కుమారుడు అఖిల్ సినిమాల్లోకి వచ్చేది లేనిది ఆయన ఇష్టమని, త్వరలోనే ఢమరుకం చిత్రం విడుదల అవుతుందని నాగ్ పేర్కొన్నారు.

Thursday, 22 December 2011

రాజన్న రివ్యూ


నిజాం పాలన గురించి, తెలంగాణ ఉద్యమం గురించి.. తెలంగాణ వాదులు సినిమాలు తీస్తే ఆశ్చర్యం లేదు. కానీ ఓ అగ్రనటుడు, నిర్మాత.. ప్రముఖ రచయితతో కలిసి రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో ఓ కమర్షియల్ సినిమా తీసేందుకు ముందుకొస్తే మాత్రం అది ఆశ్చర్యం కలిగించే అంశం. ఆ సినిమానే రాజన్న. నాగార్జున-విజయేంద్రప్రసాద్-రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన ఈ రాజన్న ఆసక్తి కలిగించే సినిమానే. కానీ అద్భుతమనిపించే చిత్రమైతే కాదు.
స్వాంతత్ర్యం రాకముందు తెల్ల దొరలపై.. ఆపై రజాకార్లపై పోరాడిన యోధుడు రాజన్న. ఈ పోరాటంలో రాజన్న ప్రాణాలు వదులుతాడు. అతని భార్య లచ్చమ్మ (స్నేహ) కూడా చనిపోవడంతో అనాథైన కూతురు మల్లమ్మను ఓ ముసలాయన చేరదీస్తాడు. ఇదంతా పూర్వ కథ. మల్లమ్మ పుట్టడంతో కథ మొదలవుతుంది. మల్లమ్మ పెరిగి పెద్దదవుతూ పాట మీద ప్రేమ పెంచుకుంటుంది. ఆమె ఉండే నేలకొండపల్లి దొరల అధీనంలో ఉంటుంది. దొరసాని (శ్వేతమీనన్)కు రాజన్న వల్ల జరిగిన అవమానం కారణంగా పాటంటే అసహ్యం. తన మాట కాదని పాటలు పాడుతున్న మల్లమ్మను చంపేయబోగా ఆమె సంగీతం మాస్టారు కులకర్ణి (నాజర్) సాయంతో తప్పించుకుంటుంది. అతని మాట విని ఢిల్లీలో ప్రధానిని కలవడానికి బయల్దేరుతుంది. అదే క్రమంలో తన తండ్రి రాజన్న కథ కూడా తెలుసుకుంటుంది. రాజన్న కథేంటి? మల్లమ్మ ప్రధానిని కలిసిందా అన్నది మిగిలిన కథ.
రాజన్న తన పాటతో గ్రామ ప్రజల్లో ఉత్తేజం తెచ్చి, ఉద్యమాన్ని లేవనెత్తే సన్నివేశాలే సినిమాలో ప్రధాన ఆకర్షణ. 20 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ సినిమాకు ఆయువుపట్టు. వీటిని రాజమౌళే తెరకెక్కించాడు. రాజన్న పాటతో ఉత్తేజితురాలై ముసలమ్మ పోరాడే తీరు, ఆపై పిల్లాడు ఉరికి వచ్చి దొర మనిషిని చంపే వైనం.. ఆపై గ్రామ ప్రజలంతా కలిసి దొర సైన్యాన్ని మట్టుబెట్టే తీరు ప్రేక్షకుల్నీ ఉత్తేజపరుస్తాయి. ఇవే కాదు రాజమౌళి తీసిన యాక్షన్ సన్నివేశాలన్నీ ఆకట్టుకునేలా సాగాయి. దాదాపుగా నాగార్జున కనిపించే సన్నివేశాలన్నింటికీ రాజమౌళే దర్శకత్వం వహించినట్లు అర్థమైపోతుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ మాస్ ను, యూత్ ను ఆకట్టుకుంటాయి.  ఐతే నిజాం పాలకుల క్రూరత్వాన్ని ప్రతిబింబించేందుకు తీసిన ‘పన్ను’ సన్నివేశం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకు మరో మార్గాన్ని ఎంచుకుని ఉంటే బావుండేదేమో. తీవ్రత చూపించడానికి మరో మార్గమే లేదా? వాస్తవంగా అలా జరిగి ఉన్నా కూడా అలా తీయాల్సింది కాదు.  రాయడానికి ఇబ్బంది కలిగించే ఈ సన్నివేశాల్ని మహిళలు, పిల్లలు థియేటర్లలో చూడగలరా?
 ఆరంభంలో మల్లమ్మ పాత్ర చుట్టూ నలభై నిమిషాల పాటు సాగే సన్నివేశాల్లో సెంటిమెంట్ ప్రధానంగా నడిచాయి. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. తొలి అరగంటా సినిమా స్వచ్ఛంగా సాగింది. కానీ మల్లమ్మ ప్రధానిని కలవడానికి ఢిల్లీకి బయల్దేరడంతోటే కథ సినిమాటిక్ గా తయారైంది. ఆరేళ్ల పాప నడుచుకుంటూ ఢిల్లీకి వెళ్లిపోవడం టూమచ్. రైలెక్కించి ఉంటే బావుండేదేమో. ఇక యాక్షన్ ప్యాక్డ్ ఫ్లాష్ బ్యాక్ ముగిశాక.. సినిమాను సాదాసీదాగా ముగించిన తీరు కూడా నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్ కూడా ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయింది. కేవలం మల్లమ్మ పాట విని ప్రధాని తెలంగాణ ప్రాంతానికి దొరల నుంచి విముక్తి కలిగించడం అతిశయోక్తిలా అనిపిస్తుంది.
సినిమాకు ప్రధాన బలం కచ్చితంగా కీరవాణి సంగీతమే. సందర్భానుసారంగా గుండెల్ని హద్దుకునే పాటలు, సన్నివేశాలకు చక్కగా సరిపోయే నేపథ్య సంగీతంతో కీరవాణి సినిమాకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బిట్ సాంగ్స్ కథను నడిపించడానికి బాగా ఉపయోగపడ్డాయి. రజాకార్ల నేపథ్యంలో మంచి కథ రాయడంలో, అప్పటి మాండలికాల్ని, మనుషుల ఆహార్యాన్ని తెరమీదకు తేవడంలో విజయేంద్రప్రసాద్ విజయవంతమయ్యాడు. ఆయన దర్శకత్వ ప్రతిభ సెంటిమెంట్ సన్నివేశాల్లో బాగా కనిపించింది. ఐతే యాక్షన్ సన్నివేశాలన్నీ తానే తీసి, తండ్రిని డామినేట్ చేశాడు రాజమౌళి. ఆర్ట్ డైరెక్టర్ అరవై ఏళ్ల కిందటి వాతావరణాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని తేవడంలో బాగానే కృషి చేశాడు. ఫైట్ మాస్టర్లు కూడా అత్యుత్తమ ప్రతిభ చూపారు. మొహమాటం లేకుండా చెప్పాలంటే నాగార్జున రాజన్న పాత్రలో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు. ఆహార్యం, నటన ఓకే కానీ.. డైలాగ్ డెలివరీలో తేలిపోయాడు. రాజన్న పాత్రకు గంభీరమైన కంఠం అవసరం. కానీ సాఫ్ట్ గా ఉండే నాగార్జున వాయిస్ అందుకు సూటవలేదు. గంభీరమైన డైలాగుల్ని నాగార్జున పలుకుతుంటే ఇబ్బందికరంగా అనిపించింది. స్నేహది పరిమితమైన పాత్ర. సినిమాలో అందరికంటే ఎక్కువ ఆకట్టుకునేది బేబి అనినే. అంత చిన్న వయసులోనూ మల్లమ్మ పాత్రలో అద్భుతంగా నటించి మార్కులు కొట్టేసిందా అమ్మాయి. మల్లమ్మ తాత పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా నటించాడు. మిగతా పాత్రలన్నీ మామూలే.
 తెలంగాణ ప్రజలతో ముడిపడిన కథాంశం కాబట్టి ఈ ప్రాంతంలో రాజన్నకు బాగానే ఆదరణ దక్కే అవకాశముంది. మిగతా ప్రాంతంలో స్పందన తక్కువగా ఉండొచ్చు. తెలంగాణ కథాంశం అన్నది పక్కనబెట్టి ఓ సినిమాగా చూస్తే రాజన్న గుడ్ ఫిలిం. తెలుగులో చారిత్రక కథాంశంతో తీసిన సినిమాల్లో చాలావరకు ఘోరంగా దెబ్బతిన్నవే. ఐతే నాగార్జున, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కలిసి చేసిన సిన్సియర్ ఎఫర్ట్ మాత్రం మెచ్చుకోదగ్గదే. కానీ శ్రీరామరాజ్యం లాంటి సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతున్న తెలుగు ప్రేక్షకులు.. సీరియస్ గా సాగే రాజన్నను ఎంతవరకు ఆదరిస్తారన్నది సందేహం. మహరాజ పోషకులైన యువత నుంచి ఎలా స్పందన వస్తుందన్నదాన్ని బట్టే రాజన్న ఫలితం ఆధారపడి ఉంది.

Saturday, 26 November 2011

‘రాజన్న’ సినిమా పాటలు ఆడియో వేడుక లేకుండానే విడుదల

అక్కినేని నాగార్జున తాజా సినిమా ‘రాజన్న’ సినిమా పాటలు ఆడియో వేడుక లేకుండానే విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా శనివారం పాటలు మార్కెటోకి విడుదలయ్యాయి. కొన్ని వెబ్ సైట్లలో ఇప్పటికే రాజన్న పాటలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం సాయంత్రం నుంచి రాజన్న పాటలు ఐటూన్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.