Wednesday, 7 March 2012

రామ్ గోపాల్ వర్మకు కెవిపి షాక్

ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు షాక్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మకు ఇచ్చిన అపాయిటంట్‌మెంటును రద్దు చేసుకున్నారు. రెడ్డిగారు పోయారు సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ కెవిపి రామచందర్ రావును కలవాలని అనుకున్నారు. సినిమా కోసం వస్తున్నానని వర్మ తనతో చెప్పలేదని, సినిమా కోసం వస్తున్నట్లు తెలిసి తర్వాత భేటీని రద్దు చేసుకున్నానని కెవిపి రామచందర్ రావు చెప్పారు. సినిమా కోసం వస్తున్నట్లు వర్మ తొలుత తనతో చెప్పలేదని, అందుకే అపాయింట్‌మెంట్ ఇచ్చానని, సినిమా కోసమని చెప్పాక అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసుకున్నానని ఆయన చెప్పారు. రామ్ గోపాల్ వర్మను తాను కలువబోనని ఆయన చెప్పారు. రెడ్డిగారు పోయారు సినిమా కోసం వర్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కూడా కలుసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతర పరిణామాలపై రెడ్డిగారు పోయారు అనే సినిమాను వర్మ తలపెట్టినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

చిరు రాజ్యసభకు వెళ్తే తిరుపతి నుంచి పోటీ....మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్తే తాను తిరుపతి నుంచి శానససభకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ చెప్పారు. తిరుపతి శాసనసభా సీటుకు చిరంజీవి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయితే, జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా ఉన్నానని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెసు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతూనే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జయదేవ్ తెలిపారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లకుండా తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా కొనసాగితే తాను 2014లో శాసనసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మంత్రి గల్లా అరుణ కుమారి ఇది వరకే ధ్రువీకరించారు.

రేపు నెట్ సేవలు బంద్

ఇంటర్నెట్‌ ప్రియులకు బ్యాడ్ న్యూస్. రేపు నెట్ సేవలు బంద్. నెట్‌వర్క్ కంప్యూటర్లకు వైరస్‌ ముప్పు తలెత్తుతుండడంతో దీన్ని అధిగమించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను 24 గంటలపాటు నిలిపేస్తున్నారు. 2007 నుంచి డొమైన్ నేమ్ సిస్టమ్ (డిఎన్ఎస్) చేంజర్ పేరుతో వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌లోకి క్రిమినల్స్ అప్‌లోడ్ చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ సమస్యలు తలెత్తుతున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. 2007 నుంచి ఎస్తోనియాకు చెందిన క్రిమినల్స్ ఈ వైరస్‌ను విస్తరించే పనిలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2011 నవంబర్‌లో గుర్తించిందని క్విక్ హీల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ చెప్పారు. ఈ వైరస్‌ను నియంత్రించే ఉద్దేశంతో క్విక్ హీల్ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పేజీని ఏర్పాటు చేసింది. కంప్యూటర్లు వైరస్ బారినపడితే సలహాలు, సహాయం కోసం http://www.quickheal.com/chkdnsను సందర్శించవచ్చని సూచించింది.

Tuesday, 6 March 2012

సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అనుభవాలు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇక నుంచి అభిమానులకు నిత్యం అందుబాటులో ఉండనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపిఎల్ సీజన్ నుంచి సచిన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అకౌంట్ తెరవనున్నాడు. దీని ద్వారా సచిన్ తన ఆలోచనలను, మైదానంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకోనున్నాడు. సచిన్‌తో పాటు ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు హర్భజన్ సింగ్, మలింగ, ఇతర ఆటగాళ్లు, కోచ్ షాన్ పొలాక్ ‘ఎమ్‌ఐ పాల్టన్’ అనే పేరుతో ఒకే అకౌంట్‌లో అందుబాటులో ఉంటారు. ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య సంబంధాలను పెంచడానికి ఈ ప్రయత్నం చేశారు. ఐపి ఎల్ ఫ్రాంచైజీలు అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను కొంత కాలంగా ఉపయోగించుకుంటున్నాయి. యువ క్రికెటర్లు సచిన్, ఇతర ముంబయి ఇండియన్స్ (ఎమ్‌ఐ) ఆటగాళ్లతో ఐపి ఎల్ జరిగే టప్పుడు, తర్వాత కూడా క్రికెట్ గురించి చర్చించవచ్చు. ‘అభిమానులు ఎల్లప్పుడూ మా వెంటే ఉండి మద్దతునిచ్చారు. మేము ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. దీనికోసం ప్రతి ఆటగాడు అభిమానులకు అందుబాటులో ఉండేవిధంగా ఎమ్‌ఐ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఎమ్‌ఐ ప్రతినిథి తెలిపాడు. అభిమానులతో ఇలా అందుబాటులో ఉండటానికి సచిన్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. ‘అభిమాలకు అందుబాటులో ఉండగలగడం, వారు ఏం ఆనుకుంటున్నారో తెల్సుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మాలో చాలా మంది తొలి సారిగా సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు’ అని భజ్జీ చెప్పాడు.


 
 

Monday, 5 March 2012

కర్నూలు జిల్లా ఉపఎన్నికకు నేతల ఆధిపత్య పోరు

ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆది నుంచి గంగుల, భూమా కుంటుంబాల మధ్య ఫ్యాక్షన్, గ్రూపు రాజకీయాలు నడుస్తూన్నాయి. పార్టీల కన్నా గంగుల, భూమా గ్రూపు ఆధిపత్య రాజకీయమే ఆళ్లగడ్డలో కీలకం. అయితే స్థానిక ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాను రెండురోజుల క్రితం అసెంబ్లీ స్వీకర్ ఆమోదించడంతో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు తెర లేచింది. దీంతో అందరి దృష్టి ఆళ్లగడ్డవైపు మళ్లింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలతో పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు కూడా తమ గ్రూపులను ఇప్పటి నుంచే ఉపపోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా రెండు ప్రధాన గ్రూపుల ఆధిపత్య పోరు మధ్య అధికారుల నలిగిపోతున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారులతో సమావేశమై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులతో పాటు గ్రామపంచాయితీ నిధులు కూడా తాము సూచించిన వారికే కేటాయించాలని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలుపాలన్నదే తమ ఉద్దేశ్యం అని కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిబంధనలమేరకు ఉపాధి హామీ పనులు చేయాలని సూచించారు. రాజకీయ వత్తిళ్లకు తలవంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.

జగన్ కేసు విషయం సీబీఐ చూసుకుంటుంది...సీఎం

ఉప ఎన్నికల విషయమై ఎన్నికల కమిషనన చూసుకుంటుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ ప్రత్యేక కారణాలవల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నందున ప్రభుత్వానికి రెఫరెండం కాదని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారం విషయం పీసీసీ పరిశీలిస్తోందని, అవసరమైన చోట తమతోపాటు ఇతర నేతలు ప్రచారానికి వెల్తారని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యనేతలు ప్రచారం చేస్తే లాభాలతోపాటు, నష్టాలు కూడా ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.రాజ్యసభ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తుందని సీఎం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు అక్రమాస్తుల వ్యవహారం సీబీఐ చూస్తోందని, ప్రభుత్వానికి సంబంధం లేదని, పార్టీలో ఇతర నేతల వ్యాఖ్యలపై తాను స్పందించనని మీడియాముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమేనని సీఎం పేర్కొన్నారు.

జగన్ అరెస్ట్ ఖాయం జేసీ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ను అరెస్ట్ చేయక తప్పదని,  స్పష్టత లేదని అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయక తప్పదని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం జెసి టిడిఎల్పీ గదికి వచ్చారు. ఆయన టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పయ్యావుల కేశవ్‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు. జగన్‌ను అరెస్టు చేయడం తప్పదని, అయితే అది కొవ్వూరు ఎన్నికలకు ముందా లేక తర్వాత అన్న దానిపై స్పష్టత లేదని చెప్పారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్ర రావును ఎందుకు అరెస్టు చేయడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మీరు బాగా ఇరుకున పెడుతున్నారని మోత్కుపల్లికి జెసి కితాబిచ్చారు. మీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నామని వారితో అన్నారు. అధికారులు అవినీతి విషయంలో బాగా బరి తెగించారని అరోపించారు. కాగా కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను చేపట్టబోయే పాదయాత్ర వివరాలను మోత్కుపల్లి ఆయనకు వివరించారు.కేసీఆర్ ను ఘాటుగా విమర్శిస్తున్నారని మోత్కుపల్లిని ప్రసంశించారు.