Showing posts with label తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. Show all posts
Showing posts with label తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. Show all posts

Thursday, 23 February 2012

జైలుకు పంపించాలని కాంగ్రెస్ కుట్ర....చంద్రబాబు

శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మార్ పాపం చంద్రబాబుదేనని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలతో సభలో కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు సీఎం ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. కిరణ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూనే వాస్తవాలు వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేరని అన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్ద నిల్చుని నినాదాలు చేశారు. స్పీకర్ కోరినప్పటికీ అక్కడి నుంచి కదలలేదు. దీంతో సభ కొన్ని నిమిషాల పాటు స్తంభించింది. నన్ను జైలుకు పంపించాలని కాంగ్రెస్ నాయకులు ఎప్పటినుంచో విఫల యత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నన్ను జైలుకు పంపించడం ఎవరి తరమూ కాదని కూడా ఆయన హెచ్చరించారు.రాష్ట్ర శాసన సభలో గురువారంనాడు జరిగిన చర్చలో తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెబుతూ తాము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కుళ్లుకుంటోందని ఆయన అన్నారు. రాష్ట్రానికి కన్వెన్షన్ సెంటర్‌లు తీసుకువచ్చిన ఘనత తమదేనని వివరిస్తూ, గచ్చిబౌలి స్టేడియంను తాము తీసుకువస్తే, కాంగ్రెస్ నాయకులు ఈ ప్రతిష్ఠాత్మకమైన స్టేడియంను సమావేశాలకు వాడుకుంటూ ఆ స్టేడియంను నాశనం చేసేశారని ఆయన వివరించారు. వీటిని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఘనత మాకే చెందుతుందని చంద్రబాబు నాయుడు వివరిస్తున్నప్పుడు అధికార పక్ష సభ్యులు గొడవ సృష్టించారు.

Friday, 30 December 2011

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది ... చంద్రబాబునాయుడు

దేశంలో అవినీతే తీవ్రవాదం కన్న పెద్ద సమస్యని, అవినీతిని నిరోధించాల్సిన అవసరం ఉందని, అవినీతిని రూపు మాపడానికి సమర్ధవంతమైన చట్టాలు రావాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపే ఉద్దేశం, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన విమర్శించారు. లోక్‌పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందంటూ బాబు ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పటిష్టవంతమైన లోక్‌పాల్ బిల్లు కోసం తుదివరకు పోరాటం చేస్తామని అన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంనకు ప్రోత్సాహాకాలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 4.12 కోట్ల లిక్కర్ కేన్‌లు, 3.49 కోట్ల బీర్ కేన్‌లు ఉత్పత్తి చేస్తున్నారని ప్రతి లిక్కర్ కేన్‌కు ప్రభుత్వానికి రూ. 1549 లాభం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ఒక వ్యక్తికి ఒకే షాపు రావాలన్న నిబంధనలున్నప్పుడు బొత్సకు 31 షాపులెలా వచ్చాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లపై ఏసీబీ నివేదికను ఎందుకు బయటపట్టడం లేదని బాబు ప్రశ్నించారు. మద్యం సిండికేట్లకు నిరసనగా జనవరి 3,4,5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.