Showing posts with label తెలుగుదేశం పార్టీ. Show all posts
Showing posts with label తెలుగుదేశం పార్టీ. Show all posts

Thursday, 19 January 2012

వారసులొస్తున్నారు!



దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనంతపురంలోని తన నివాసంలో ఆయన రాప్తాడు, అనంతపురం శాసనసభా నియోజకవర్గాలకు చెందిన పరిటాల అభిమానులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 24వ తేదీన జరిగే పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు. ఇక నుంచి పరిటాల రవి ట్రస్టు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉంటానని చెప్పారు. రాజకీయం పెద్దలు చూసుకుంటారని, రాజకీయం గురించి మాట్లాడే వయస్సు తనకు లేదని శ్రీరామ్ అన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఆయన క్రియాశీలకంగా ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లోకి రావచ్చునని చెబుతున్నారు. అందుకు తగిన ప్రాతిపదిక ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువోత్సాహంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర రాజకీయాల్లోకి హీరో బాలకృష్ణ, అనంతపురం జిల్లాలో స్వర్గీయ పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వారసులు తెరపైకి రావడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో బాలయ్య ప్రకటించడం టిడిపిని ఉత్సాహంలో ముంచడమే కాకుండా, రాష్ట్రంలో ఒక్కసారిగా బాలయ్య చర్చనీయాంశమయ్యారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారు, పార్టీలో ఏం బాధ్యతలు నిర్వహిస్తారనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన రాజకీయ ఆరంగేట్ర ప్రకటనతో టిడిపిలో 1983 నాటి ఉత్తేజం కనిపిస్తోందనే వారూ ఉన్నారు. దీంతో 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు యువత రాజకీయాల్లోకి రావాలని, మేం ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. పరిటాల తర్వాత అనంతపురం జిల్లాలో టిడిపి నిస్తేజంగా మారిందనే చెప్పవచ్చు. ఆ జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం తీసుకు రావడానికి రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల సతీమణి సునీత ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె తన తనయుడు పరిటాల శ్రీరాంను పరిచయం చేసినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో శ్రీరాంకు ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఉండదు. అయితే యువతను టిడిపి వైపు లాగేందుకే అధిష్టానం సూచనల మేరకు శ్రీరాంను తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిటాల తర్వాత దాదాపు నిరుత్సాహంతో ఉన్న పార్టీ క్యాడర్ సేవా కార్యక్రమాల పేరుతో శ్రీరాం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. శ్రీరాం రాకతో జిల్లా కార్యకర్తల్లో నూతనోత్సాహం రావడంతో పాటు యువత నుండి కూడా మద్దతు బాగానే లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీరాం పోటీ చేయకున్నప్పటికీ జిల్లాలో ప్రచారం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.విజయవాడ టిడిపి నేత వల్లభనేని వంశీ కూడా శ్రీరాం రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటించినప్పుడు నారా వారసులు నారా లోకేష్, నారా రోహిత్ ఫోటోలు ఫ్లెక్సీల్లో ప్రముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఓ వైపు యువతను ఆకర్షించడానికి ఇలాంటి వారు రంగంలోకి దిగుతుండగానే, చంద్రబాబు రైతు పోరు బాట తదితర యాత్రల రుతో ప్రజల్లోకి వెళుతూ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే బాలయ్య ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండగా, పరిటాల శ్రీరాం వంటి యువకుల ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Friday, 16 December 2011

ఉప ఎన్నికల ప్రచారానికి కొత్త గెటప్‌లో బాలయ్య?

ఉప ఎన్నికల భారాన్ని బాలయ్యపై పెట్టాలని టిడిపి అధిష్టానం యోచిస్తోంది. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మార్చడానికి రంగం సిద్ధం చేస్తోంది. దూరమైన ఎన్టీఆర్‌ ఫ్యామిలీని దగ్గరకు తీసుకోవడానికి ఇదొక్కట్టే చంద్రబాబు ముందున్న మార్గంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా గురిపెట్టింది. కనీసం ఆరు నుంచి ఎనిమిది స్థానాల్ని కైవసం చేసుకోవడానికి ప్లాన్‌ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో రెండో స్థానంలో నిలిచేందుకు ప్రణాళికను రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం సినీగ్లామర్‌ పుష్కలంగా ఉన్న బాలయ్యను ప్రచారంలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. రూట్‌మ్యాప్‌ను కూడా తయారు చేస్తోంది. ఆయన ప్రచారంతో ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాల్లో ఓట్ల వర్షం కురిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తొలి నుంచి బాలకృష్ణకు బలమైన అభిమాన సంఘాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఆ తరువాత ఆంధ్రా ఏరియాలో అభిమానుల హడావుడి బాగా కనిపిస్తోంది. ఆయన సినిమాలకు భారీ కలెక్షన్లు కూడా అక్కడే వస్తాయి. ఇదే తరహాలో ఓట్లు కూడా పడతాయని పార్టీ అధిష్టానం అంచనా. నేరుగా బాలకృష్ణను రంగంలోకి దింపడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్న టిడిపి ఆయన సినీగ్లామర్‌ను వీలున్నంత వరకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడానికి ఇంకొంత కాలం ఉన్నప్పటికీ గతం కన్నా ఇక నుంచి చురుగ్గా ప్రచారానికి వెళతారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలపై వరుసగా అన్ని జిల్లాల నేతలతో చంద్రబాబు రివ్యూ మీటింగ్‌లు పెట్టారు. బాలయ్య ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారని...ఏదో చేస్తారని టిడిపి క్యాడర్‌ ఆశలు పెట్టుకుంటోంది. వారి ఆశల్ని ఓట్ల రూపంలో మార్చడానికి ఈసారైన బాలయ్య స్పీచ్‌ మార్చుతారా..? లేక ఎన్టీఆర్‌ ఫ్యామిలీ పార్టీకి దగ్గరగానే ఉందనే సంకేతాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతారో చూడాలి.