Showing posts with label తెలుగుదేశం. Show all posts
Showing posts with label తెలుగుదేశం. Show all posts

Tuesday, 17 January 2012

బాలయ్యపై పోటీపై పార్టీదే నిర్ణయం, చర్చిస్తాం...చంద్రబాబు నాయుడు


సినీ హీరో, తమ పార్టీ నాయకుడు బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చెప్పారు. బాలయ్య పోటీపై పార్టీలో చర్చిస్తామని ఆయన అన్నారు. బాలయ్య పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే, బాలయ్య పార్లమెంటుకు పోటీ చేస్తారా, శాసనసభకు పోటీ చేస్తారా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏ విషయమైనా పార్టీలో చర్చిస్తామని, పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఆయన అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం బాలయ్య పోటీ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి పార్టీ నిర్ణయం పేర చంద్రబాబు తన నిర్ణయాన్ని బాలయ్యపై రుద్దబోతున్నట్లు చర్చ జరుగుతోంది. బాలకృష్ణను లోకసభకు పంపేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల నుంచి తనకు పోటీ లేకుండా చూసుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. నందమూరి హరికృష్ణను రాజ్యసభకు పంపించినట్లే, బాలకృష్ణను లోకసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణను కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన అభిమానులు చూస్తున్నారు. శాసనసభకు ఆయనను పోటీకి దించే 2014 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ రావడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, ముందే ఆయనను అడ్డం తొలగించుకోవాలనే ఎత్తుగడలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ నిర్ణయం పేర ఆయనను వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా లోకసభకు పోటీ చేస్తే శాసనసభకు ఎక్కువ మందిని గెలిపించే అవకాశాలుంటాయని ఆయనకు నచ్చజెప్పే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏమైనా, బాలకృష్ణ విషయంలో చంద్రబాబు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.సినీ హీరో, పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించినప్పటి నుంచి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయన లోకసభకు పోటీ చేస్తారా, శాసనసభకు పోటీ చేస్తారా అనే చర్చ ప్రారంభమైంది. ఈ చర్చను చంద్రబాబు నాయుడే ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. విజయవాడ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు నాయకుడు లగడపాటి రాజగోపాల్‌పై బాలకృష్ణ పోటీ చేస్తే బాగుంటుందని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారానికి ఓ మలుపు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడే ఆ మాటలు అనిపించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ ప్రతిస్పందన, పార్టీ ఇతర నాయకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది చంద్రబాబు చూడదలుచుకున్నట్లు భావిస్తున్నారు.

Saturday, 3 December 2011

ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి?

సొంత గూటికి చేరేందుకు ముగ్గురు తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యులు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వారు తెలుగుదేశం వర్గాలకు సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. తిరుగుబాటు శాసనసభ్యులు వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగి రెడ్డి రహస్యంగా చంద్రబాబును కూడా కలిసి తమ అభిమతాన్ని తెలియజేసినట్లు వినికిడి. దీంతో చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతోనూ పార్టీ శాసనసభ్యులతోనూ ఆ విషయంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి వారు సముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, పార్టీ బలంగా ఉంది కాబట్టే వారు తిరిగి పార్టీలోకి వచ్చారని అనుకుంటారని భావిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. కాగా, బాలనాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఆ ముగ్గురు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తే చంద్రబాబుకు నైతిక బలం చేకూరినట్లేనని చెప్పవచ్చు. అయితే, ఆ వార్తలను హరీశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పిలిచినా తాను కలవబోనని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేసేవరకు తాను కలవబోనని చెప్పారు.