Friday, 18 November 2011

కర్నూలు బాలకృష్ణ అభిమానుల కొత్త సంప్రదాయం

కర్నూలు నగర నందమూరి అభిమానులు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తమ అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాకు గురువారం అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా చూపించారు. అభిమాన నటుల సినిమా విడుదలైతే అభిమానులు తమ ఆనందాన్ని భారీ ఎత్తున టపాసులు పేల్చడం, పండుగ వాతావరణం నడుమ జరుపుకుంటారు. అయితే కర్నూలు నందమూరి అభిమానులు ఈ సారి తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాకు అన్ని రాజకీయ పక్షాల నాయకులను ఆహ్వానించి చూపడం విశేషం. అంతేకాకుండా వారిని సినిమాహాల్ లోపలికి మంగళవాయిద్యాలతో పూలు జల్లుతూ తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తల నడుమ ఆయన అభిమానులు సినిమా విడుదలను ఇలా అఖిల పక్ష నేతలకు చూపడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పౌరాణిక సినిమా కావడంతో సినిమాహాళ్ల వద్ద సీతారాముల చిత్రపటాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెయి కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, డిసిసి అధ్యక్షుడు ఎస్. రఘురామిరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లగిశెట్టి విశ్వనాథం, వామపక్ష పార్టీల నాయకులు హాజరై అభిమానులను అభినందించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాక్షించారు

No comments:

Post a Comment